Thursday 13 November 2014

ఈరోజు బాలల దినోత్సవం. బాలల ప్రగతికి, అభ్యుదయానికి, వారి హక్కుల సంరక్షణకు ఉద్దేశించిన రోజు. నెహ్రు గారి 125 వ జన్మ దినం జరుపుకుంటున్న మనం నిజంగా బాలలు ప్రగతి బాటలో నడుస్తున్నారా , వారి హక్కులు సంరక్షింప బడుతున్నాయ అని ఆలోచించ వలసిన రోజు. ప్రతి ఉదయం దిన పత్రిక తిరగేస్తే, ముక్కు పచ్చలారని ఆడపిల్లల మిద అత్యాచారాలు, లేదా మగపిల్లల కిడ్నాపులు  ఇవన్ని మనకు నిత్య కృత్యం అయిపోయాయి. వీటికి మనం ఎంతగా అలవాటు పడిపోయాము అంటే, ఇంక ఆ పేజీలు పక్కకు తిప్పేసి, ఇది మాములే అన్నట్టు, వేరే వార్తలు చదవడం లో నిమగ్నం అవ్తున్నాం. ఇటువంటి పెద్ద పెద్ద నేరాలు ఏదో మాఫియా వాళ్ళు, కరడు కట్టిన నేరస్తులు చేస్తున్నారు అనుకుంటే ప్రభుత్వం వారి సంగతి చూసుకుంటుంది అని సర్దుకుపోవచ్చు. కానీ చాలా కేసుల్లో ఇవి దగ్గర బంధువుల వల్లనే జరుగుతున్నాయి అని, ముఖ్యంగా లైంగిక వేధింపులు దగ్గర బంధువుల వల్లనే జరుగుతున్నాయి అని సర్వేలు చెపుతున్నాయి. మన చట్టాల్లో ఉన్న లొసుగుల వల్లనో, మరే ఇతర కారణం వల్లనో, విచారణకు ఎన్నో సంవత్సరాలు పట్టేసి, నిందితులకు శిక్ష వెంటనే పడడం లేదు. ఇది మరి కొన్ని నేరాలు జరగడానికి కారణం అవుతోంది. నేర ప్రవ్రుత్తి ఉన్నవాళ్ళ సంగతి పక్కన పెడితే, మరి విద్యా బుద్ధులు నేర్పవలసిన గురువులే కీచకులు అవుతున్నారు. ఆడపిల్లల మీదనే కాక, మగపిల్లల మిద కూడా వారి ప్రతాపం చూపిస్తున్నారు. లైంగిక వేధింపులే కాకుండా, మితిమీరిన దండన కూడా నిత్యకృత్యం అయిపోతోంది. మొన్న కాకినాడ లో అంధ విద్యార్ధుల మిద గురువు ప్రతాపం, నిన్న రాజమండ్రి లో గురువు గారి ఒళ్ళు తెలియని కోపం.... వీటన్నిటికీ  మగపిల్లలు పావులు అవుతున్నారు. లైంగిక వేధింపుల కన్నా ఇవి ఏమి తక్కువ కాదు. పిల్లలు ఎంతో భయభ్రాంతులకు గురి అవుతారు.

14 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య, బాల కార్మిక వ్యవస్థ రద్దు అనేవి కాగితాలకే కాని, వాస్తవం లో కార్య రూపం దాల్చడం లేదు. ఎంతో మంది బాల కార్మికులు ఎంతో ప్రమాదకరమైన బాణ సంచా తయారీ వంటి కర్మాగారాలలో నేటికీ పని చేస్తున్నారు. వారి వయసుకు మించిన బరువులు మోస్తూ ఇంటిలో సంపాదనకు ఓ చేయి వేస్తున్నారు. వారి తల్లితండ్రుల పేదరికం వలన వారు పని చేయవలసి వస్తోంది. ఇంకా కొంత మందిని మాఫియా ముఠాలు వారి అవసరాల కోసం యదేచ్చగా వాడుకుంటున్నాయి. వీటన్నిటి యొక్క మూల కారణాన్ని గుర్తించి,మూలాల  నుంచి సంస్కరిచుకుంటూ వస్తే, బాలల ప్రగతి మనం సాధించినట్టే.

ఇంకో వైపు చుస్తే, చదువుకునే పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీ లు, పోటీ పేరుతొ ఎంత అవస్థ పెడుతున్నారో చుసిన వాళ్ళకు తెలుస్తుంది. ఈ నేరం లో సగం పాపం తల్లితండ్రు లదే. చదువు పేరుతొ వారికీ వేరే వ్యాపకం లేకుండా, రాంకుల పోటీలో లోకజ్ఞానం తెలియకుండా, కనీసం చుట్టాలు, స్నేహితులు అనే బంధాలు కూడా లేకుండా పెరుగుతున్న బాలల వర్గం ఇంకొకటి. ఇంతంత ఫీజులు పోసి చదివిస్తున్నాం, రాంక్ రాకపోతే నలుగురిలో తలెత్తుకోలేము, అనిపక్క వాళ్లతో పోల్చి  పిల్లల మనసులపై ప్రెస్టేజ్ అనే ముద్ర వేసి వారిని మానసికంగా క్రుంగ దీయడం వేధింపు కాదా?

మరోవైపు పిల్లలను ఆల్రౌండర్లు చేయాలనే సంకల్పంతో వారిని ఊపిరి తీసుకోకుండా చేసి, రియాలిటీ షో లకు పంపడం, అక్కడ వారిని TRP  రేటింగ్స్ కోసం నవ్వుతూ ఉన్న వాళ్ళను కూడా ఏడ్పించి వినోదం చూసే ప్రేక్షకులు, వివిధ ఛానల్స్ వాళ్ళు నేరస్తులు కారా? 9థ్  క్లాసు అయిన వెంటనే, సెలవులు కూడా ఇవ్వకుండా, 10 థ్ పాఠాలు మొదలుపెట్టేసి, అలాగే, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అవకుండానే, రెండవ సంవత్సరం పాఠాలు మొదలు పెట్టె నేటి విద్యవ్యవస్తకు ఏమి శిక్ష వేయాలి? సంవత్సరం అంతా చదివి పరీక్షలు వ్రాసిన పిల్లలకు ఒక నెల రోజులు అయినా విశ్రాంతి అక్కరలేద? మండు వేసవి లో క్లాసులకు అటెండ్ అయి శ్రమ పడే పిల్లలకు ఆరోగ్యం మిద శ్రద్ధ వహించవలసిన అవసరం లేదా? పిల్లలు సరే, ఏడాది అంతా సూర్యుని కన్నా ముందు లేచి వారికీ బాక్స్ లు కట్టిపెట్టే తల్లులకు కనీసం వేసవి లో అయినా విశ్రాంతి వద్దా? ఇటువంటి వన్నీ మనం కోరి తెచ్చుకుంటున్న సమస్యలు. వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు? పిల్లల శక్తి తెలుసుకోకుండా IIT  క్లాసుల్లో చేర్చేసి, సీటు రాలేదు అని వేధించే తల్లితండ్రులు కూడా నేరస్తులే నా దృష్టి లో.

పిల్లలకు వారి ఆలోచనలు వికసించేలా కొంత స్వేచ్చ ఇవ్వండి. వారి మనోవికాసానికి చదువే కాకుండా, ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. పేదరికం కారణం గానో, సమాజం కారణంగానో, నిరక్షరాస్యత కారణం గానో, ఏ ఒక్క చిన్నారి కంటి లోను నీరు కనబడని రోజునే మనకు నిజమైన బాలల దినోత్సవం. దీని కోసం "స్వచ్చ భారత్ " లాగా "స్వచ్చ బాల్యం, స్వేచ్చా బాల్యం" అనే కార్యక్రమాలు కూడా చేపట్టాలేమో!


Sunday 21 September 2014

ఇది గురజాడ వారి స్వగృహం. వీధి వైపు నుంచి. అంటే సింహద్వారం ఇది. రెండవ ఫోటో లోపలి వైపు. మూడవ ఫోటో, ఇంటి లోపల ఉన్న బావి. అయన రోజు అక్కడే బావి నీటి తో స్నానం చేసి, ప్రక్కనే ఉన్న తులసి మొక్కకు పూజ చేసుకునేవారట. క్రిందటి సంవత్సరం ఈ ఇంటిలో రెండు చిన్న చిన్న దొంగతనాలు జరిగాయిట. ఆ తరువాత సరిగ్గా సంవత్సరం క్రితం, అయన జన్మదినం నాడు ఈ ఇంటిని ప్రభుత్వం వారు స్మారక చిహ్నంగా ప్రకటించారు. అయన పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేసారు. ఇంకా అయన వాడిన కుర్చీ, కళ్ళజోడు, మిగిలిన వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. రాజా వారి కోట నుంచి చాలా దగ్గరగా ఉంటుంది గురజాడ వారి నివాసం.



సెప్టెంబర్ 21.

ఈరోజు ప్రపంచ అల్జీమర్స్ డే. ఆధునిక ప్రపంచం లో చాల వేగంగా విస్తరిస్తున్న వ్యాధి అల్జీమర్స్. భారత దేశానికి ప్రస్తుతానికి ఈ ముప్పు లేకున్నా, మారుతున్న జీవన శైలి, మారుతున్న ఆహార విహార నియమాల వాళ్ళ భవిష్యత్తు లో ఈ ముప్పు పొంచి ఉంది అని మేధావులు చెప్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి  అభివృద్ది చెందిన దేశాలలో అధిక శాతం మరణాలు ఈ వ్యాధి వలన కూడా సంభవిస్తున్నాయి అని సర్వే లు చెపుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఈ వ్యాధి గురించిన అవగాహన తీసుకురావటానికి " అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ " అనే సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. వాటిలో భాగంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 నాడు ప్రపంచ అల్జీమర్స్ డే ను జరుపుతున్నారు. ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ, ప్రజలలో ఈ వ్యాధి గురించి ప్రచారం చేస్తున్నారు.

సాధారణంగా తీవ్రంగా  జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనా శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలను అల్జీమర్స్ వ్యాధి లక్షణాలుగా పరిగణిస్తారు. ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, సమయానికి ఒక పేరు కానీ, ఒక పని కానీ గుర్తు రాకపోవడం, ఒక అడ్రెస్స్ ఏదైనా గుర్తురాకపోవడం ఇటువంటివి అందరికీ సామాన్యంగా ఉండే ఇబ్బందులే. ఇవి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు అనుకోలేము. అయితే., ఈ వ్యాధి తోలి దశలను మనం సులభంగా గుర్తుపట్టచ్చు. మన కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులలో కానీ ఈ క్రింది లక్షణాలు ఉంటె మనం వారిని వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్ళాలి.

1. రోజూ చూసే ప్రక్క ఇంటి వాళ్ళ పేర్లు మర్చిపోవడమే కాకుండా, మనకు బాగా తెలిసిన వారి , రోజూ చూసేవారి ముఖాలు కూడా గుర్తు పట్టలేక పోవడం.

2. పనులు చేసే క్రమాన్ని మర్చిపోవడం. ఉదాహరణకు, భోజనం చేసేటపుడు దేని తర్వాత ఏది తినాలో మర్చిపోవడం, బట్టలు కూడా దేని తర్వాత ఏది వేసుకోవాలో మర్చిపోవడం.

3.రోజువారీ సంభాషణలలో వచ్చే పదాలను మర్చిపోవడం, మాట తడబడడం, మాట్లాడుతున్నపుడు ఒక్కో సందర్భం లో అక్కడ ఎ మాట వాడాలో తెలియక పోవడం, ఎదుటివారి సంభాషణ అర్ధం చేసుకోలేక పోవడం.

4. రోజూ వెళ్ళే ప్రదేశాలు -- గుడి, పార్క్, మార్కెట్, ఇటువంటి వాటిని గుర్తు పట్టలేకపోవడం, ఎక్కడికైనా వెళ్లి మళ్ళీ ఇంటికి దారి మర్చిపోవడం, ఫలానా ఇల్లే, తమ ఇల్లు అని గుర్తు పట్టలేక పోవడం,

5. వస్తువులను సరి అయిన జాగా లో పెట్టలేకపోవడం. ఉదాహరణకు పెన్నును ఫ్రిడ్జ్ లోను, కూరగాయలను బెడ్ రూం లోను, దుస్తులను బాత్ రూం లోను పెట్టడం.

6. తొందర తొందరగా మూడ్స్ మారిపోవటం, సంతోషం గా ఉన్న వ్యక్తీ అంతలోనే కోపం తెచ్చుకోవడం, అందరి మీదా అరవడం, తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించలేక పోవడం, అందర్నీ అనుమానించడం, ఎక్కువ చికాకు పడడం,


7.కూర్చున్న చోటనే అదే పనిగా కూర్చోవటం, గంటల కొద్దీ టీవీ ముందు కూర్చున్నా, దృష్టి దాని మిద లేకపోవడం, గంటల కొద్దీ నిద్రపోవడం,

ఇటువంటి వన్నీ ఈ వ్యాధి లక్షణాలు. పని లోను, వ్యాపార వ్యవహారాలలోను, తీవ్రంగా అలిసిపోయిన వారు, జీవితం లో ఎక్కువ సంఘర్షణ పడిన వారు సాధారణంగా ఈ వ్యాధికి గురి అవుతారు అని సర్వే లు చెపుతున్నాయి. కొన్ని నాడీ సంబంధిత రుగ్మతల వలన కూడా ఈ వ్యాధి రావచ్చు.

అయితే దురదృష్ట వశాత్తు, ఈ వ్యాధిని నిర్ధారించేందుకు స్పష్టమైన పరీక్షలు, ఇతర మార్గాలు లేవు. అల్జీమర్స్ కు గురి అయ్యారని భావిస్తున్న రోగి బంధువుల నుంచో, దగ్గరి స్నేహితుల నుంచో సమాచారం సేకరించి, వారి జీవన విధానాన్ని తెలుసుకుని ఈ వ్యాధిని నిర్ధరించడమే. అలాగే ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స కూడా ఏమి లేదు. ఈ వ్యాధిని రాకుండా ముందుగ  నివారించడానికి కానీ, వచ్చిన తర్వాత పూర్తిగా నిర్మూలించ లేకపోయినా, కనీసం వ్యాధి తీవ్రత తగ్గించడానికి కానీ, మందులు లేవు.

ఈ వ్యాధిని నివారించడానికి కుటుంబ సభ్యుల, సన్నిహితుల, స్నేహితుల మద్దతు, ప్రేమ, సహకారం ఎంతో ముఖ్యం.  ఈ రోగులతో రోజు గడపటం చాలా కష్టమే, అయినప్పటికీ, వ్యాధి గురించి మాట్లాడకుండా, వారిని ప్రేమతో ఆదరించి, సహకారం అందించినపుడు వారికీ కొంచెం ప్రశాంతం గా ఉంటుంది. అంతకు మించి మనం వారికీ అందించే చికిత్స ఏమి లేదు. మనం వారిని ప్రేమిస్తున్నట్టు వారికీ తెలియచేయడం ఇక్కడ ముఖ్యం.

చిన్నతనం నుండీ పిల్లల చేత పజిల్స్ పూర్తీ చేయించడం, సు డో కు వంటివి, లేక క్రాస్ వర్డ్ పజిల్స్ వంటివి చేయించడం, పుస్తకాలూ చదివించడం, మెదడుకు పదును పెట్టె పొడుపు కథల వంటివి, నేర్పించడం వలన, మెదడుకు బలం చేకూర్చే, బాదం, అన్జీరా వంటివి తినిపించడం వలన, విటమిన్ లోపాలు లేకుండా మంచి పౌష్టిక ఆహారం ఇవ్వడం వలన, భవిష్యత్ లో వారు ఈ వ్యాధి కి గురి కాకుండా ఉంటారు.

Wednesday 10 September 2014

 ఈమధ్య చాల మంది తల్లితండ్రులను చూస్తున్నాను. పిల్లలను ఎక్కువ గారాబం చేసి, వాళ్ళలో మొండితనాన్ని ఇంకా పెంచుతున్నారు. పిల్లలు చాల తెలివైన వారు. మనం ఎలా పెంచితే, అలాగే పెరుగుతారు. మన బలాలను, బలహీనతలను అంచనా వేయడం లో వాళ్ళు ఘనులు. ఇప్పటి తల్లితండ్రులు చాల మంది ఒకలాగే ఆలోచిస్తున్నారు. మనకు ఉద్యోగం వచ్చేవరకు సైకిల్ నే ఉపయోగించాం కదా, పిల్లవాడు అడుగుతున్నాడు కదా, పోనీ బైక్ కొని ఇద్దాం, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొని ఇద్దాం. మనం మన చిన్నతనం లో ఏమి సుఖాలు అనుభవించలేదు కదా, పిల్లలను అయినా అనుభవించనీ అనే ఆలోచనాలో ఉన్నారు. మనం అనుభవించలేని సుఖాలు వాళ్ళకు ఇద్దాము అనే ఆలోచన చాలా తప్పు. వారికీ ఏది అవసరమో అది కొని ఇయ్యండి. మనం కొని ఇచ్చిన వస్తువును వారు సరి అయిన మార్గం లో ఉపయోగించుకొనే సామర్ధ్యం వారికీ ఉందా లేదా అని ఆలోచించండి. వయసును బట్టి వారి కోరికలకు మీరు ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే, చిన్నతనం నుంచి, ఈ పని చేస్తే నీకు ఈ బహుమతి ఇస్తా అని చెప్పటం తప్పు. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే ఈ బహుమతి ఇస్తా అని చెప్పకండి. మంచి మార్కులు తెచ్చుకోవడం వారి విధి. అది వారికీ తెలిసేలా చేయండి. ఒక పని చేసిన తరువాత, మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత, నువ్వు కష్టపడ్డావు కాబట్టి, నువ్ ఒక మంచి పని చేసావ్ కాబట్టి నీకు ఈ బహుమతి అని చెప్పండి. ఈ రెండింటికీ తేడాను దయచేసి అర్ధం చేసుకోండి. ఇంట్లో పిల్లలకు ప్రతి పనిలోనూ, ప్రతి విషయం లోను వారి బాధ్యతను వారికీ తెలియచేయండి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ఆ పని మనది కాదులే అని వాళ్ళ పని వాళ్ళు చూసుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా, కాస్త వారిని పలకరించి, మందులు ఇచ్చి, కాస్త టీ యో, కాఫీ యో చేసి ఇవ్వడం అలవాటు చేయండి. ఇంట్లో హడావిడిగా ఉన్నపుడు, పని చాల ఉండి, మీ ఒక్కరి వల్ల అవనపుడు,  పనిలో సహాయం చేయడం అనే పధ్ధతి పిల్లలకు నేర్పండి. దానివల్ల మీకు పని సులువు అవుతుంది. వారికీ బాధ్యత తెలుస్తుంది. కొంత వయసు వచ్చిన పిల్లలకు వారి పని వారు చేసుకోవడం, ప్రయాణాల సమయంలో వారి బాగ్ లు వారు సర్దుకోవటం అలవాటు చేయండి. 10, 12 సంవత్సరాల పిల్లలు చక్కగా చేయగలరు ఈ పనులు. వారికీ సరదాగా ఉంటుంది కూడాను. మీకు పని తగ్గుతుంది. ఒకటి రెండు సార్లు వాళ్ళు చేస్తున్నపుడు మీరు పర్యవేక్షిస్తే, తరువాత వాళ్ళు సొంతగా చేసుకోగలుగుతారు.

( మరికొన్ని సూచనలు వచ్చేసారి )

Wednesday 27 August 2014

అందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు...

భారతీయులు అనాదిగా ప్రకృతిని పూజిస్తున్నారు. చెట్లు, చేమలు, నీరు, నిప్పు, నదులు, సముద్రాలు వీటన్నిటినీ పూజించడం మన సంప్రదాయం. దీని వెనుక పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడే గొప్ప ఆలోచన ఉంది. దేవుడి పేరు చెప్తేనే కానీ మనుషులు వినరు అనే ఉద్దేశ్యంతో పెద్దలు దేవుడికి, ప్రకృతికి , పర్యావరణానికి లింక్ పెట్టి ప్రకృతిని పూజించే అలవాటు చేసారు. రాను రాను మనిషికి తెలివి తేటలు( మూర్ఖత్వం), స్వార్ధం పెరిగి తను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు, తను నివశిస్తున్న భూమిని, తన చుట్టూ ఉన్న ప్రకృతిని తనే నాశనం చేసుకుంటున్నాడు.

మనం జరుపుకునే పండగలు అన్నీ పర్యావరణానికి ఎంతో కొంత దోహదం చేసేవే. మరీ ముఖ్యంగా వినాయక చవితి. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పూజ విధానం పత్రీ పూజ ఎంతో ముఖ్యం. వానలు కురిసే ఈ ఋతువులో చెట్ల ఆకులను ఈ పత్రిపూజ పేరుతొ కోయడం వల్ల చెట్లు మళ్లీ చక్కగా చిగురించి చక్కగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పూజలో చెప్పే 21 రకాల పత్రాలు ఎంతో ఔషధ గుణాలతో కూడి ఉన్నవి కనుక, అవి స్వయంగా సేకరించి పూజ చేయడం వలన చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది.

 ఈ పండుగ నాడు వినాయకుడికి, ఎక్కువ పులుపు, కారం లేకుండా, నూనె లేకుండా కేవలం నెయ్యి తోనే వండే పదార్థాలు నివేదించి, మనం ఆ ప్రసాదాన్ని సేవించడం ద్వారా, ఎండలు తగ్గి, వానలు పడుతూ ఉన్న ఈ సమయం లో వాతావరణ మార్పుల ద్వారా వచ్చే అనారోగ్యాలు దూరం అవుతాయి. కొత్తగా జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు.

ఈ పండుగకు మొట్ట మొదటగా సామాజిక గుర్తింపును తెచ్చి ప్రజలందరినీ ఏకం చేయడానికి, ఒక్క తాటి మిద నడపడానికి శ్రీ బాలగంగాధర తిలక్ గారు వీధులలో పందిళ్ళు వేసి, వినాయక విగ్రహాలు నెలకొల్పి సాముహిక పూజలు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించారు. దీనివల్ల ప్రజలలో ఐక్యత సిద్ధిస్తుంది.

అన్నిటి కన్నా ముఖ్యంగా మనం పూజించే వినాయక విగ్రహాలను కేవలం మట్టితోనే తయారుచేయడం వెనుక ప్రకృతి పరంగా గొప్ప ఆలోచన ఉంది. చెరువుల లోని మట్టితో అందరికీ కావలసిన వేల వేల వినాయక ప్రతిమలను తయారు చేయడం వల్ల చెరువులలో మట్టి పూడిక తీసినట్టు అవుతుంది. చెరువులు శుభ్రపడతాయి. ఇది పర్యావరణానికి గొప్ప మేలు చేస్తుంది.

కానీ మనం ఈనాడు ఏమి చేస్తున్నాం? గొప్పలకు పోయి పోటాపోటీగా ఒకరి కంటే ఒకరు గొప్ప అని నిరూపించుకోవాలని పెద్ద పెద్ద విగ్రహాలను మట్టి తో కాకుండా, ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసి, వాటికీ రసాయన రంగులు వేసి వాటిని ఊరి చెరువులలో నిమజ్జనం చేస్తున్నాం. దాని ద్వారా నీటి కాలుష్యనికీ, నీటిలో నివశించే అనేక జీవుల మరణానికి కారణం అవుతున్నాం. ఆ రసాయన రంగులు నీటిలో కరగకుండా అవి వెదజల్లే వాయువుల ప్రభావానికి గురి అవుతున్నాం. ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. ప్రకృతి సమతుల్యతను దెబ్బ తీస్తున్నాం. మన నాశనాన్ని మనమే ఆహ్వానిస్తున్నాం. ఇలా మరికొన్ని సంవత్సరాలు జరిగితే వచ్చే ఆపదను మనం గ్రహించలేక పోతున్నాం.

ఈ ఆపద నుంచి బయట పడాలి అంటే అందరూ దయచేసి మట్టి విగ్రహలనే పూజించండి. స్థానిక కళాకారులను ప్రోత్సహించండి. మన ఊరి చెరువులను మనం కాపాడుకుందాం. పర్యావరణాన్ని కాపాడుదాం.....

వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభా,
నిర్విఘ్నం కురుమే దేవా, సర్వ కార్యేషు సర్వదా.....

Wednesday 20 August 2014

మా తరం వాళ్ళం చాల అదృష్టవంతులం. (అంటే ఇప్పుడు 40 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నవాళ్ళు ) ఎందుకంటే, మేము ప్రయాణాలకు పాసెంజర్ రైళ్ళు, బొగ్గు రైళ్ళు, ఎక్స్ప్రెస్స్ రైళ్ళు, సూపర్ ఫాస్ట్ రైళ్ళు అన్నీ ఉపయోగించాము. అలాగే చిన్నతనాల్లో జనరల్ కంపార్ట్మెంట్ లు, తరువాత రిజర్వేషన్ , ఫస్ట్ క్లాసు కోచ్ లు, ఇప్పుడు AC  కూడా ఎక్కుతున్నాం. ఇప్పటి వాళ్ళకి బొగ్గు రైళ్ళు తెలియదు, రాక్షసి బొగ్గు కాలుతుంటే వచ్చే ఆ కమ్మటి వాసనా తెలియదు. అలాగే మేము సమాచారం తెలియడం కోసం, ఉత్తరాలు, ఫోన్ అయితే, ట్రంక్ బుకింగ్, STD , ఇప్పుడు మొబైల్ ఫోన్, ఆండ్రాయిడ్, whatsapp  అన్నీ వాడాము. ఇప్పటి వాళ్ళకు ఉత్తరాలు వ్రాసి మనసులో భావాలూ తెలియపరుచుకోవడం, మళ్లీ తిరుగు టపాలో జవాబు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడడం, అసలు postman  అంటేనే ఒక చుట్టం లాగా ఫీల్ అవ్వడం తెలియదు. అలాగే పుట్టినరోజు పేరంటాలు, శ్రావణ మాసం పేరంటాలు, వినాయక చవితి కి పత్రీ స్వయంగా కోసుకుని రావటం,  ఒక కాలనీ పిల్లలు అందరూ కలిసి ఆషాఢమాసం లో గోరింటాకు కోసం, ఉగాది ముందు రోజు వేపపువ్వు కోసం గుంపులు గుంపులు గా వెళ్లి స్వయంగా కోసుకునే ముచ్చట్లు ఏవి ఈ తరం వాళ్ళకు తెలియవు. ఏదో బజారుకు వెళ్లి 10 రూపాయలు పెట్టి కొనుక్కురావడమే కానీ, గుంపులుగా వెళ్తూ అల్లరి చేస్తూ వెళ్ళే మజా వీళ్ళకు తెలియదు.

  ఈ తరం పిల్లలకు సూర్యోదయం, సూర్యాస్తమయం స్వయంగా చూసి అనుభవించడం తెలియదు. ఆరుబయట వెన్నెల్లో కథలు వింటూ పడుకోవడం, డాబా మిద వెన్నెల్లో భోజనం చేయడం, వేసవి సెలవులలో ఆరుబయట ఆడుకోవడం, సూర్యోదయం తో పాటు ఆహార వేటకు వెళ్ళే పక్షుల గుంపులు చూడడం, వీటిలోని అందాలు ఏ మాత్రం తెలియవు.

పక్కింటి వాళ్ళ జామ చెట్టునో, మామిడి చెట్టునో రాళ్ళతో కొట్టి కాయలు తినడం (ఎందుకో అలా తింటే చాలా రుచిగా ఉండేవి ), స్కూల్ కు నడిచి వెళ్తూ ఇల్లు కట్టుకోవడానికి ఎవరో తెప్పించుకున్న ఇసుక గుట్టలు, కంకర గుట్టలు ఎక్కుతూ, దిగుతూ వెళ్ళడం, ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఈరోజుల్లో వాళ్ళకు తెలియదు.

ఇంకో విషయం ఏమిటంటే, మా తరం వాళ్ళకు ఉద్యోగాలు చిన్నవే, జీతాలు చిన్నవే. అయినా మాకు అసంతృప్తి లేదు. ఒక్కో రూపాయి దాచుకొని కొనుక్కున్న వస్తువులు మాకెంతో అపురూపం. పాత టీవీ అమ్మేసి, రిమోట్ కంట్రోల్ ఉన్న టీవీ కొనుక్కున్నపుడు పాత టీవీ ఎవరికో ఇచ్చేస్తుంటే ఎంతో విలవిల లాడిపోయాం. మా వస్తువులతో మాకు అంత attachment . సంవత్సరాల తరబడి ఉన్న ఇల్లు మారాలన్నా, transfer అయి, ఊరు మారాలన్నా, ఏదో ఎమోషన్. ఇపుడు ఉద్యోగాలు పెద్దవి, జీతాలు పెద్దవి. పాతిక సంవత్సరాలు రాకుండానే సొంత స్థలాలు, ఇల్లు కొనుక్కున్నా మీకు  సంతృప్తి లేదు, వేటి మీదా మమకారం లేదు, ఇంకా ఏదో లేదు అనే వెలితి భావనే.

ఒకప్పుడు ఇంట్లో పెద్ద కొడుక్కు ఉద్యోగం, సంపాదన వస్తే, ఇంటి సమస్యలు అన్నీ తీరినట్టే అని భావించే వారు. తన కన్నా చిన్నవాళ్ళను పెద్ద కొడుకే చదివించేవాడు. తల్లితండ్రులు కూడా నిశ్చింతగా ఉండేవారు. ఇప్పుడు అన్నదమ్ముల సంగతి సరే,భార్యా భర్తల మధ్యనే నీది, నాది అనే బేధాలు. ఎవరి జీతం వారిది, ఎవరి లోన్లు వాళ్ళవి, ఎవరి ఖర్చు వారిది, ఎవరి బ్రతుకు వాళ్ళది. మనది అనే భావన లేదు ఇప్పుడు. ఇక ఇలాంటివాళ్ళు తల్లితండ్రులను, అన్న దమ్ములను, అక్క చెల్లెళ్ళను ఏమి చూస్తారు? నీ చుట్టాలు వస్తే నీ ఖర్చు. నా చుట్టాలు వస్తే నా ఖర్చు. ఇదీ ఇవాల్టి పోకడ.

మొత్తం మీద మేము కష్టపడినా జీవితం లో ఉండే ఆనందాన్ని అనుభవించాము. కష్టం వెనకాల ఉండే సుఖాన్ని చూసాము. అత్తమామలతో గొడవలు ఉన్నా, వారి నీడన ఉండే సౌఖ్యం చూసాము. గొడవలు వస్తాయి అని వాళ్ళను వద్దు అనుకోలేదు. ఆడపడుచులు, మరుదులు బాధ్యతలు తీర్చాము, ఇపుడు వాళ్ళ నుంచి గౌరవమూ పొందుతున్నాము. ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది, ఈ బాధ్యతలు నావి అని అనుకోని నిర్వర్తిన్చాము.

ఇపుడు పుట్టుక తోనే అన్ని సౌఖ్యాలు అమరిపోతున్నాయి కాబట్టి ఈ తరం వాళ్ళకు కష్టం అంటే తెలియడం లేదు, దాని ద్వారా సుఖం యొక్క విలువా తెలియడం లేదు. అందుకే మీకు ఎన్ని ఉన్నా తృప్తి లేదు. మీరు డబ్బు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. దానిని ఖర్చు పెట్టడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు. కానీ ఆ డబ్బు మీకు ఆనందాన్ని , తృప్తిని ఇవ్వడం లేదు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ అయింది కాబట్టి. తల్లి తండ్రుల ప్రేమ కూడా మీకు ఎక్కువ దొరుకుతోంది కాబట్టి మీకు ఆ మమకారం యొక్క విలువ కూడా తెలియడం లేదు. మీకు పెద్ద పెద్ద సమస్యలు లేవు, బాధ్యతలు లేవు అందుకనే మీకు చిన్న చిన్న సమస్యలు చాలా పెద్దవిగా కనబడతాయి. అవి మీరు పరిష్కరిచుకో లేకపొతున్నారు. అందుకే ఈరోజుల్లో, ఆత్మహత్యలు, విడాకులు ఎక్కువ అయినాయి. ఈ విషయం మీద ఇంకోసారి చర్చించుకుందాం.

సెలవు.

Sunday 10 August 2014

మిత్రులకు వందనం...

ఈ మధ్య నేను ఒక మంచి పుస్తకం చదివాను. పుస్తకం పేరు, రచయిత్రి పేరు ఇక్కడ అప్రస్తుతం . అందులో విషయం ఏమిటంటే, సమాజం లో ఎంతో అట్టడుగు వర్ణం బాలికలు, ఆర్ధికం గా చాల వెనుకబడిన కుటుంబాలకు చెందిన వాళ్ళు, ఎంత అంటే కనీసం రెండు రోజులకు ఒకపూట కూడా తినడానికి దొరకని పరిస్థితి. కుటుంబంలో ఆడపిల్ల కన్నా, మగపిల్లవాడు ఎక్కువ అనే నేపధ్యం నుంచి వచ్చిన బాలికలు, ఎవరి స్పూర్తి లేకుండా, వారి స్వంత ఆలోచనలతో, మనకు ఇటువంటి జీవితం వద్దు, మనం కూడా ఏదైనా సాధించాలి అనే తపనతో, పుస్తకాలు కూడా లేకుండా, కేవలం చదువు మీద, భవిష్యత్తు మీద ఉన్న నమ్మకంతో నానా కష్టాలు పడి చదువుకుని, సంఘం లో ఉన్నతమైన స్థితిలో నిలిచినా మహిళల గాధలు అవి. అందులో ఒకరు అమెరికాలో సైంటిస్ట్ గా, ఒకరు డాక్టర్ గా,కవయిత్రిగా , ఒకరు ప్రొఫెసర్ గా ప్రసిద్ధి పొందారు. వాళ్ళ జీవితాల గురించి చదువుతుంటే ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, మనుషులు ఇంత దుర్భర పరిస్థితులలో కూడా జివిస్తారా? అనిపించింది. ఉన్న ఒక్క ముద్ద కోసం కొట్టుకునే బ్రతుకులు కూడా ఉంటాయా? అనిపించింది. అటువంటి ప్రతికూల  పరిస్థితులలో, ఎందుకురా ఈ జీవితం అనుకోకుండా, చదువుకుని అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన మహిళలకు జోహార్లు చెప్పకుండా ఉండలేకపోయాను. అటువంటి వారిని ప్రతి బాలికా, ప్రతి స్త్రీ స్పూర్తి గా తీసుకోవాలి. అన్నీ అమర్చి పెట్టినా, చిన్న చిన్న విషయాలకే చికాకు పడడం, ఏంటి ఈ వెధవ జీవితం అనుకోవడం, ఉన్న సౌకర్యాలలో ఏమాత్రం కొరత వచ్చినా ఆందోళన పడిపోవడం ఈ తరం పిల్లలకు బాగా అలవాటు అవుతున్నాయి. దీనికి కారణం, మానసిక స్థైర్యం లేకపోవడం, తల్లి తండ్రుల ఆలోచనా ధోరణి, సంపాదన ఎక్కువై, పెద్ద పెద్ద సమస్యలు లేకపోవడం వలన, బ్రతుకును గడపడానికి ఎక్కువ సంఘర్షణ అవసరం లేకపోవడం వలన, చిన్న చిన్న సమస్యలే, పెద్ద పెద్ద విషయాలుగా పరిగణించి అనవసర ఆందోళన పడుతున్నారు. ఈరోజుల్లో పిల్లలకు ఒక పార్టీకి వెళ్ళలేక పొతే బాధ, అనుకున్న రోజున పిజ్జా తినలేక పోతే బాధ, స్నేహితుల పుట్టిన రోజుకి బహుమతి ఇవ్వలేకపోతే బాధ, వేసుకునే డ్రెస్ పైకి మాచింగ్ జెవేల్లరీ లేకపోతే బాధ. మనకన్నా డబ్బు ఉన్నవాళ్ళను చూసి వాళ్ళలా మనం ఉండలేక పోతున్నాం అనే బాధ. దీనికి కారణం జీవితం పైన సరి అయిన అవగాహనా లేకపోవడమే. ఇందులో తల్లితండ్రుల తప్పు కూడా ఉంది. నిజానికి చాల శాతం తల్లితండ్రులు ఈ రోజున మంచి స్థితిలో ఉన్నా కూడా, వారు జీవితం మొదలు పెట్టిన తోలి రోజుల్లో, ఆర్ధికంగా, ఇతరత్రా కష్టాలు పడినవారే. వారు ఏమనుకున్తున్నారంటే, మేము కష్టాలు పడ్డాము కాబట్టి, మా పిల్లలు ఆ కష్టాలు పడకూడదు అని ముద్దుగా, గారాబంగా చూస్తూ అడిగిన వన్నీ అందజేస్తున్నారు. దానితో, పిల్లలకు అసలు బాధ్యత తెలియకుండా పోతోంది. చిన్న చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారు. వివాహానంతర జీవితం లో కూడా సమస్యలకు ఇదే కారణం అవుతోంది. ప్రతి చిన్న విషయానికి అవగాహనా లేకుండా గొడవలు పడడం, నీతో నాకు సరిపడదు, విడిపోదాం అనే నిర్ణయానికి రావడం. ఫలితంగా జీవితం లో అంతులేని అశాంతి.

పరిష్కారం లేని సమస్యలు ఉండవు. సమస్య యొక్క మూలాన్ని వెతుక్కొని, నిదానంగా, సహనంతో ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక్కటి గమనించుకోండి. తిండికి కూడా లేని వారు, సరి అయిన ఆరోగ్యం లేనివారు, సరి అయిన రవాణా సౌకర్యాలు కూడా లేని మారుమూల గ్రామాల వాళ్ళు , వికలాంగులు ఎంతోమంది చదువులోనే కాక, వివిధ రంగాలలో రాణిస్తున్నారు. వారందరిదీ జీవన పోరాటం, ఎంతో శ్రమించి  వారి గమ్యాన్ని చేరుకుంటున్నారు. దానిలో విజయం సాధిస్తున్నారు. వారితో పోలిస్తే చాల మంది జీవితం అమర్చి పెట్టినట్టు ఉంటోంది. దానిని గౌరవించండి.  జీవితాన్ని ప్రేమించండి. సమస్యల నుంచి పారిపోకుండా పోరాడండి. విజయం సాధించండి.

Wednesday 30 July 2014

మహిళలకు ప్రత్యేకం అయిన టూర్లు..

నిజమే. మహిళలు ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలు తిరిగి రావాలి అని అనుకున్నపుడు ఇంట్లో మగవాళ్ళకు తీరిక లేకపోతే ఎలా?  వివిధ కారణాల వలన మగవారి తోడూ లేకుండా మహిళలు బయటికి వెళ్ళాలంటే ఎలా? ఇలా అలోచించి 2005 లో ఢిల్లీ కి చెందినా సుమిత్రా సేనాపతి అనే మహిళ కేవలం మహిళల కోసం టూర్లు ఏర్పాటు చేసారు. అంటే వీటిని నిర్వహించేదీ, అందులో పాల్గొనేదీ కేవలం మహిళలే అన్నమాట. ఆ తరువాత పియా బోస్ అనే ఆవిడ దీనికి ప్రాచుర్యం తెచ్చారు. పేస్ బుక్ లో girlsonthegoclub  అనే కమ్యూనిటీ ప్రారంభించి ఈ రకమైన విహార యాత్రల ప్రాముఖ్యత ను చాటి చెప్తున్నారు. కార్పొరేట్ లాయర్ గా చేస్తున్న పియ బోస్, లక్షలు ఆర్జించే తన వృత్తిని వదిలి, ఆత్మసంతృప్తి కోసం ఈ పనిని చేపట్టినట్టు చెప్తున్నారు. ఈరోజున ఆ కమ్యూనిటీ కి 10 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు.

గ్రూప్ లో మహిళలు అందరూ ముందు పేస్ బుక్ లో మాట్లాడుకుని టూర్లు ప్లాన్ చేసుకుంటారు. ఒకవేళ సభ్యుల్లో ఎక్కువమంది ఒకచోటికి వెళ్ళాలి అని కోరుకుంటే, ఆ ట్రిప్ కు ఎంత ఖర్చు అవుతుంది, ఏ సమయాలు అనుకూలం, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు అన్ని వివరాలూ పియా బోస్ అందరికీ తెలియ చేస్తారు. వీరు ఇప్పటివరకు కెన్యా, కాశ్మీర్, ఈజిప్ట్, తో సహా దాదాపు భారత దేశం అంతా చుట్టి వచ్చారు.

ఈ గ్రూప్ లో అన్ని వర్గాల మహిళలు, అన్ని వయసుల వాళ్ళు అందరూ సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్ కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది అని అందులోని సభ్యులు అందరూ ఉత్సాహంగా చెప్తున్నారు.

Sunday 27 July 2014

పిల్లలు అందరూ తరచుగా చదివినవి అన్నీ మర్చిపోతున్నాను, ఎంత చదివినా గుర్తు ఉండడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆమాట వినగానే తల్లులు చాలా గాబరా పడిపోతారు, అయ్యో, పరీక్షల సమయంలో ఇలా ఉంటె ఎలా? మార్కులు, రాంకులు తక్కువ వచ్చేస్తే ఎలా, అని. కానీ, పిల్లలలో మతిమరుపు అనేది చాల  ఒక మానసిక భావన. చదువులో పిల్లలకు జ్ఞాపక శక్తి ని పెంచాలి అంటే, పాఠం వినేటప్పుడు అది దృశ్య రూపం లో గుర్తు ఉంచుకోవాలి. పాఠం చదివేటప్పుడు ఒక వరుసలో చిన్న చిన్న పాయింట్స్ గా రాసుకోవాలి. జవాబులు గుర్తు ఉండడం లేదు అనుకున్నపుడు ఆ జవాబును 2,3 సార్లు పుస్తకం లో బైటికి అనుకుంటూ వ్రాయాలి. ముఖ్యంగా దృశ్య రూపం లో గుర్తు ఉంచుకున్న పాఠాలు చాల త్వరగా మనసుకు హత్తుకుంటాయి. వెంటనే మర్చిపోవటానికి అవకాసం ఉండదు. అలాగే దేశాల రాజధానులు, కరెన్సీ, ఇటువంటివి నిరంతర సాధన వల్ల గుర్తు ఉంటాయి. టీవీ, కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ gadgets వాడకం తగ్గిస్తే, అక్కర్లేని విషయాలు చాల మటుకు మన మెదడునుంచి తొలగి పోతాయి.

పెద్దవాళ్ళలో మతిమరుపు కూడా తేలికగా అధిగమించవచ్చు. వస్తువులు ఎక్కడ పెట్టామో జ్ఞాపకం ఉండదు చాలా మందికి. ప్రతి వస్తువుకూ ఒక స్థానం నిర్ణయించి ప్రతి రోజూ అక్కడే పెట్టడం ద్వారా గుర్తు ఉంచుకోవచ్చు. ఉదాహరణకు, బీరువా తాళాలు, కొవ్వొత్తులు, బ్యాంకు పుస్తకాలు, మొదలైనవి. చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నపుడు అవి అన్నీ కాగితం మిద వ్రాసుకొని ప్రాధాన్యత క్రమం లో చేసుకోవడం వల్ల చేసే పనులు గుర్తు ఉంటాయి, తొందరగా కూడా పనులు ముగించుకోవచ్చు. అలాగే షాపింగ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఏమేమి వస్తువులు కొనుక్కోవాలో ముందుగానే ఒక లిస్టు తయారు చేసుకోవటం వల్ల అన్ని వస్తువులు మర్చిపోకుండా కొనుక్కొగలుగుతాము. అన్నిటికన్నా ముఖ్యం, మన వరకు చేరే విషయాలలో ఏది గుర్తు ఉంచుకోవాలి, ఏది అక్కరలేదు అనే విచక్షణ మనలో ఉండాలి. అక్కర్లేని విషయాలు గుర్తు ఉంచుకోవడం వల్ల, అవసరమైన విషయాలు స్మృతి లో ఉండవు.

వైద్య పరంగా మతిమరుపు ఒక వ్యాధి కానేకాదు. కానీ ముసలివాళ్ళలో వచ్చే అల్జీమర్స్ ఒక వ్యాధి. వారు తమ బందువులనే ఒక్కోసారి గుర్తుపట్టలేరు. ఇటువంటి వాటికీ వైద్య సహాయం అవసరం. మతిమరుపును తగ్గించేందుకు ఆహారం లో గింజలు (బాదాం, అఖ్రోట్ ) బాగా పనిచేస్తాయి. విద్యార్ధులకు తప్పనిసరిగా బాదాం , ఆఖ్రోట్ గింజలు ఇవ్వాలి.  అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోవాలి. పిల్లలు పెద్దలు కూడా పత్రికలలో వచ్చే crossword puzzles , సుడోకు, వంటివి ఎక్కువ చేస్తూ ఉంటె మెదడు పదును దేరుతుంది. వీరికి పెద్ద వయసులో కూడా అల్జీమర్స్ వ్యాధి రావడానికి అవకాశం తక్కువ. అరటిపండు ను ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

Saturday 26 July 2014

ఎక్కడైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం రెండు మూడు రోజులు తెగ హడావిడి చేస్తుంది. స్కూల్ బస్సు ప్రమాదం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజులు బస్సులను తనిఖీ చేసి సీజ్ చేస్తారు.  కానీ సమస్య మూలాలలోకి వెళ్లి అసలు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా? డ్రైవర్ కు కానీ , క్లీనర్ కి కానీ మద్యపానం అలవాటు ఉందా? వారు ఫిట్ గా ఉన్నారా లేదా? వారి డ్రైవింగ్ సరిగా ఉందా లేదా అనే విషయాలు అటు స్కూల్స్ కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవు. బస్సులు సంగతి అటు ఉంచితే, స్కూల్ ఆటో ల మాట ఏంటి? అందులో అసలు ఎంత మందిని ఎక్కించుకోవాలి? ఎంత మంది పిల్లలు ఎక్కుతున్నారు? వాళ్ళ పుస్తకాల సంచులు, క్యారేజిల సంచులు కలిపి ఎంత బరువు ఉన్నాయి అనే విషయం ఎవరూ పట్టించుకోరు. అసలు తల్లి తండ్రులు కూడా తమ అబ్బాయి/అమ్మాయి ఆటో లో ఎంత క్షేమంగా వెళ్తున్నారు? వాళ్ళ పిల్లలు ఆటో లో ఎక్కడ కూర్చుంటున్నారు? ఆటో లో మొత్తం ట్రిప్పు కి ఎంత మందిని తీసుకెళ్తున్నారు? అనే విషయాలు అసలు పట్టించుకోరు. దానికి తోడూ, మన రాష్ట్రం లోని రహదారుల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాజధాని నగరం లో కూడా చిన్న వర్షం వస్తే, దారి ఎక్కడ ఉందొ, manhole ఎక్కడ ఉందొ కనిపెట్టలేము. నాలాలు నిండి దారి మీదే పారుతూ ఉంటాయి. వీటన్నిటిని వర్షాకాలం రాకముందే మరమ్మతులు చేసే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి ఉండదు. వర్షాకాలం వచ్చాక మరమ్మతులు మొదలుపెడితే, పాపం పనిచేసే కార్మికుల ప్రాణాలకు కూడా హామీ ఉండడం లేదు.  కనీసం ప్రమాదం జరిగాక ప్రభుత్వం లోని ఏ శాఖా వారూ కూడా ఈ ప్రమాదానికి మేము ఎంత వరకు బాధ్యులము అని ఆలోచించారు. ఎంత సేపూ ఒకరి మీద ఒకరు నేరం నేట్టేసుకుని, ఒకవేళ జరిగిన ప్రమాదములో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి మిద నేరం నెట్టేసి చేతులు దులిపెసు కుంటున్నారు. ఒక వారం తరువాత మళ్లీ అంతా మాములే. అసలు తీర్చవలసిన ప్రజా సమస్యలు ఎన్నో ఉండగా, నేతలు అందరూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఈ రాష్ట్రం యొక్క దుస్థితికి మీరు కారణం అంటే మీరు కారణం అనుకుంటూ వీధులకు, పేపర్లకు ఎక్కడం తప్ప పరిపాలన మీద, ప్రజా సంక్షేమం మిద దృష్టి పెడుతున్నట్టు కనబడడం లేదు. ఇకనైనా ప్రభుత్వాలు, అధికారులు మేల్కొని ప్రతి సమస్యను మూలం నుంచి పరిష్కరించ ప్రార్ధన.

Thursday 24 July 2014

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ము క్షీయమామ్రుతాత్

ఈ మహా మ్రుత్యునజయ మంత్రం విశిష్టత అందరికీ తెలుసు. ఇది జీవన ప్రదాత వంటిది. దీర్ఘాయువు, శాంతిసౌఖ్యలు, ధన ధాన్యాలు, సంపద, సంతోషం, ప్రసాదించే పరమ పవిత్రమైన మంత్రరాజం. పాము కాటు, నిప్పు, నీరు, పిడుగుపాటు వంటి ఆకస్మిక దుర్ఘటనల నుంచి రక్షించ గలిగి నటువంటి కవచం ఇది. భక్తీ విశ్వాసాలతో ఈ మంత్రం జపిస్తే అపర ధన్వంతరి వంటి వైద్యులు కూడా నయం కావు అని చెప్పిన మొండి రోగాలు సైతం నయం అయి మృత్యు ముఖానికి చేరువ అవుతున్నవారు కూడా ఆయుష్ మంద్తులవుతారు అని ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. స్నానం చేస్తూ ఈ మంత్రాన్ని జ్జపిస్తే రోగ విముక్తులవుతారు. భోజనం చేస్తూ జపిస్తే తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవడమే కాకా, ఆహారం లోని విష తుల్యమైన పదార్ధాలు హరించా బడతాయి. పాలు, పానీయాలు తాగేటప్పుడు వాటినే తదేకంగా చూస్తూ జపిస్తే యవ్వనం సిద్ధిస్తుంది. రోగుల చెవిలోను, వారి సన్నిధి లోను ప్రతిదినమూ నిర్ణీత సంఖ్యలో ఈ మంత్రం జపం చేస్తే వ్యాధి బాధల నుండి విముక్తి కలిగి, ఆయుర్దాయం పెరుగుతుంది. ఇంటిలో చిక్కు సమస్యలు, చికాకులు ఉంది మానసిక ప్రశాంతత లోపించిన వారు వేదవిదులైన పండితుల చేత మృత్యుంజయ హోమం కానీ, జపం కానీ చేయిస్తే చిక్కులు తొలగి ప్రశాంతత చేకూరుతుంది.

గాయత్రీ మంత్రం జపం, చంద్రసేఖరాష్టకం, విశ్వనాధ అష్టకం, సౌందర్య లహరి వంటివి కూడా మృత్యువును దూరం చేస్తాయి.

ఆహారపు అలవాట్లు కూడా ఆయుర్దాయాన్ని పెంచడంలో ఎంతో ఉపకరిస్తాయి. రాత్రి పూట పెరుగును వర్జించి, పాలు అన్నం కలుపుకుని తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది. మనసను ప్రశాంతంగా ఉంచుకోవడం, తలస్నానానికి చన్నీతిని, మాములు స్నానానికి గోరువెచ్చటి నీటిని, వాడటం, వారానికో సారి నువ్వుల నూనెను ఒంటికి మర్దనా చేసుకుని అభ్యంగన స్నానం చేయడం, బాగా వేడిగా, లేదా చల్లగా ఉండే పదార్ధాలను తినక పోవడం, పంచ గావ్యలను సేవించడం, ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవడం, సప్త వ్యసనాలకు దూరంగా ఉండడం, భోజనం చేసిన వెంటనే వంద అడుగులు నడవడం వంటివి ఆయుర్దాయాన్ని పెంచడానికి దోహద పడతాయి.

మానవుడు ఏ కారణం చేత పూర్ణాయుర్దాయం పొందలేకపోతున్నాడు అనే ద్రుత రాష్ట్రుని ప్రశ్నకు సమాధానంగా విదురుడు మహాభారతం లో " గర్వము, హద్దుమీరి మాట్లాడడం, మహాపరాధాలు చేయడం, క్రోధం, తన సుఖమే చూసుకోవడం, నమ్మిన వారిని మోసం చేయడం, అనే ఈ ఆరు లక్షణాలు పదునైన కత్తుల లాంటివి. దేహుల ఆయువును ఇవి నశింప చేస్తాయి. కాబట్టి ఇటువంటి వాటికీ దూరంగా ఉంటూ పైన చెప్పిన విధి విధానాలు పాటిస్తూ ఉంటె అయుస్శును పొడిగించు కోవడం అసాధ్యం ఏమి కాదు " అని చెప్తాడు.

ఆయుష్య సూక్త, వేద పారాయణ, యోగ, ప్రనాయామములు, ఆహార నియమాలు, నిరంతర భగవాన్ నామస్మరణ, శౌచ పాలనా, ఉపవసనియమలు, మహా మృత్యుంజయ ఉపాసన ఇవన్ని మానవుని ఆయు: ప్రమాణాన్ని పెంచడంలో ఉపకరిస్తాయి.

వర్ష వృద్ది కర్మ:

సంవత్సరం పైబడ్డ పిల్లలు అందరకు ప్రతి ఏటా జన్మ తిథి నాడు ఆచరించే ఈ ప్రక్రియ వారి ఆయుష్షును పెంచడంలో సహాయ పడుతుంది. పిల్లల జన్మ తిథి నాడు. అక్షతలతో కూడిన మంటపంలో కులదేవత, జన్మ నక్షత్ర దేవత, మాతా పితరులు, ప్రజాపతి, సూర్యుడు, గణపతి, మార్కండేయుడు, వ్యాసుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బాలి, ప్రహ్లాదుడు, హనుమంతుడు, విభీషణుడు, షష్టీ దేవత అనే 16 మంది దేవతలను ఆరాధించాలి. షష్టీ దేవికి పెరుగన్నం నైవేద్యం పెట్టాలి . ఈ కర్మ చేసుకునే రోజున క్షవరం , గోళ్ళు కత్తిరించుకోవడం, మిథునం, మాంసా హార భక్షణం చేయరాదు.

Wednesday 23 July 2014

మనలో చాల మందికి ఆరోగ్యం మీద కనీస అవగాహనా ఉండదు.  జ్వరం, తలనొప్పి, వాంతులు , కడుపు నొప్ప్పి, లేదా అజీర్ణం ఇలా సాధారణంగా వచ్చే రుగ్మతలకు ఇంట్లో ఉన్న, తెలిసిన మందులు వేసుకుంటాం. అలాగే కొన్ని చిట్కాలు, గృహ వైద్యాలు పాటిస్తాము. కానీ కొన్ని కొన్ని అనారోగ్య లక్షణాలు మనకు తెలియని జబ్బులకు దారి తీస్తాయి. వీటిలో ఒకటి కాల్షియం లోపం, విటమిన్ డి లోపం. ఎముకలు నొప్పిగా ఉండడం, తీవ్రమైన అలసట, నీరసం, మెట్లు ఎక్కడం, దిగడం లో ఇబ్బంది పడడం. నడుస్తుంటే ఆయాసం రావటం, మోకాళ్ళ నొప్పి కాకపోయినా, ఎముకల మిద ఒత్తిడి పడినపుడు నొప్పి రావడం ఇటువంటివి విటమిన్ డి లోపం ఉంటె వచ్చే రుగ్మతలు.

స్త్రీలకూ ఎక్కువగా కాల్షియం అవసరం అవుతూ ఉంటుంది. నడివయసు వారికీ, మెనోపాజ్ వచ్చిన వారికీ ఇంకా అదనపు కాల్షియం అవసరం. ప్రతిరోజూ పాలు మరియు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఒక్కటే చాలదు. అదనంగా వైద్యుల సలహాతో కాల్షియం సప్లిమెంట్లు కూడా తీసుకోవాలి. అలాగే, పైన చెప్పిన లక్షణాలు ఉన్నపుడు సాధారణంగా మనం వైద్యుల వద్దకు వెళ్ళకుండా ఇంట్లో ఏవో మందులు వేసేసుకుంటాం. కానీ విటమిన్ డి లోపం వల్ల మనం తీసుకునే కాల్షియమ్ పూర్తిగా వంట పట్టదు.

ఈ విటమిన్ డి ఆహార పదార్ధాల ద్వారా ఎక్కువ లభించదు. ఇది లభించే ప్రముఖ వనరు సూర్య రశ్మి మాత్రమే. ఇదివరకు ఇంట్లో పెరడు, వాకిలి అన్ని వేరు వేరు గా ఉండేవి. ఉదయం కానీ, సాయంత్రం కానీ ఇంట్లోకి ధారాళంగా ఎండ పడేది. పిల్లలకు కూడా బయలు ప్రదేశాలలో ఆడుకొనే సమయం, వీలు ఉండేది, అందువల్ల విటమిన్ డి లోపం ఉండేది కాదు. కానీ ఇపుడు అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చింది. ఇంటి లోపలికి  ఎండ రావటం తక్కువే. మనం ఎండలోకి వెళ్ళటం కూడా తక్కువ అయిపొయింది. పిల్లలకు కూడా ఆడుకునే సమయం లేదు. ఒకవేళ ఆడుకున్నా, ఇంట్లో కంప్యూటర్, ఫోన్ ల లోనే ఆడుతున్నారు కాబట్టి ఎండ వారికీ తగిలే అవకాసం ఉండడం లేదు. అందువల్ల ప్రతివారి లోను ఈ లోపం ఎక్కువగా ఉంటోంది. పూర్వపు రోజుల్లో నెలల పసికందులను కూడా ఉదయం లేత ఎండలో కాసేపు ఉంచి లోపలి తీసుకెళ్ళేవారు.

ఇప్పుడైనాస్త్రీలు, పిల్లలు ఉదయం, సాయంత్రం కొంత సేపు ఎండలో నిలబడడం మంచిది. విటమిన్ డి లోపం వల్ల తలెత్తే సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పై లక్షణాలు  కనపడినపుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. పిల్లల్లో విటమిన్ డి లోపం నిర్లక్ష్యం చేస్తే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఇందులో ఎముకలు పటుత్వం కోల్పోయి, కాళ్ళు వనకరగా అవుతాయి. ఈ విటమిన్ లోపం వల్ల స్త్రీలలో ఎముకలు ద్రుధత్వం కోల్పోయి, బోలుగా తయారవుతాయి. అప్పుడు ప్రతి చిన్న దెబ్బకి ఎముకలు విరిగె ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ముందరే మనం జాగ్రత్త తీసుకొని, స్త్రీలలో, పిల్లలలో కాల్షియమ్, విటమిన్ డి లోపం తలెత్తకుండా చూద్దాం.

కాకినాడ లో అంధ విద్యార్ధులను చితకబాదిన గురువు.....
నిన్న రాత్రి న్యూస్ చానల్స్ నిండా ఈ వార్తే..... ఆ మాస్టారిని చుస్తే అసలు మనిషేనా అనిపించింది. చిన్న పిల్లలను.... అందునా అంధులను అలా గొడ్డును బాదినట్లు బాదడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయో.... టీవీ లో చూస్తుంటేనే కళ్ళ నీళ్ళు తిరిగాయి. అతనికి మనసు అనేది ఉందా అనిపించింది. పిల్లలు తప్పు చేస్తే, ఒకటి రెండు దెబ్బలు వేయటం ఎవరికైనా సహజం... కానీ మరీ ఇంత రాక్షసత్వమా? అవే దెబ్బలు ఆయనను కొడితే అయన తట్టుకోగలడా?
ఉపాధ్యాయులను ఎంపిక చేసేటప్పుడు, సబ్జెక్టు, మార్కులే కాకుండా మానవత్వం ఆధారంగా కూడా వారిని ఎంపిక చేయాలేమో! వారికీ మనస్తత్వ పరీక్ష పెట్టి కనీస మానవత్వం ఉన్న వారికే ఉపాద్యాయ పదవి ఇవ్వాలెమో...
పిల్లలను తెల్లవారు ఝామున లేపడం కష్టం అయిపోతోంది అని చాల మంది నాకు చెప్తున్నారు. . దీనికి ఒక పధ్ధతి ఉంది అండీ. అన్నిటి కన్నా ముందు, పిల్లలకి, తల్లులకి కూడా లేవాలి అని ఒక కమిట్మెంట్ ఉండాలి. తరువాత రాత్రి పూట త్వరగా పడుకోవాలి. అలాగే పడుకునే అరగంట ముందు టీవీ చూడకండి. చాల మంది అలారం పెట్టుకుని అది మోగగానే ఆపేసి పడుకుంటారు. అది చాలా తప్పు పధ్ధతి. అయితే అలారం కొంచెం ఆలస్యంగా పెట్టుకోండి. లేదంటే అది మోగగానే లేవండి. అంతే కానీ అలారం మోగిన తరువాత దానిని ఆపేసి మళ్లీ పడుకోవడం వల్ల పిల్లలకు నిద్ర లేవడం అస్సలు అలవాటు కాదు.

ముందు ఒక టైం కి అలారం సెట్ చేసుకోండి. మోగిన వెంటనే లేవండి. మీకు ఇంకా బద్ధకం గా ఉంటె వెంటనే పని లోకి, పిల్లలు చదువు లోకి వెళ్ళకుండా ఒక పావుగంట అలా ఊరికే కూర్చుని బద్ధకం తీర్చుకోండి. ఇలా ఒక వారం చేయండి. తరువాతి వారం అలారం ఒక 20 నిముషాలు ముందుకి సెట్ చేసుకోండి. అప్పుడు కూడా అలాగే చేయండి. మళ్లీ తరువాతి వారం ఇంకో 20 నిముషాలు ముందుకి సెట్ చేయండి. ఇంక ఈవారం నుంచి బద్ధకం తీర్చుకోకుండా వెంటనే పనిలోకి వెళ్ళండి. ముందు చన్నీటితో ముఖం కడుక్కుంటే ఫ్రెష్ గా ఉంటుంది. కొన్నాళ్ళకు అలారం పెట్టుకోవడం మానేయండి. రాత్రి  పడుకునేటప్పుడు రేపు నేను ఇన్ని గంటలకి లేవాలి అని గట్టిగా అనుకోని పడుకోండి. ఉదయం కరెక్ట్ గా అదే టైం కి లేవగాలుగుతారు. ఇలా మీరు అనుకున్న సమయానికి లేచే వరకు ఈ పధ్ధతి పాటించండి. ఈ పధ్ధతి చాల బాగా పని చేస్తుంది.

Friday 18 July 2014

ఎవరైనా మనల్ని సలహా అడిగితె, ఓ, నన్నే అడిగారు కదా అని ఒకటికి రెండు లాభ నష్టాలు అలోచించి, నిజంగా మనం వాళ్ళకు శ్రేయోభిలాషులం ఏమో అని భ్రమించి ఒకటికి పది సలహాలు ఇచ్చెస్తాము. తీరా వాళ్ళు మన సలహాలు పాటించకపోతే మనను లెక్క చేయలేదని భావించి మనసు పాడుచేసుకొని, బుర్ర చెదగోట్టుకుని, పనులు మానుకుని, ఎంతో ఇదైపోతాం. కాని ఇలా సలహాలు ఇచ్చే వారు అందరూ జ్ఞాపకం పెట్టుకోవలసినది ఏమిటంటే, ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎవరికీ తోచినట్టు, ఎవరికీ వీలైనట్టు వాళ్ళు చేస్తారు. ఎవరి పరిస్థితుల బట్టి వారు వ్యవహరిస్తారు. అందుచేత ఎవరైనా సలహాలు అడిగినప్పుడు ఎక్కువ మతి చెడగోట్టుకోకుండా, నొప్పింపక, తానొవ్వక అన్నట్టు ఉంటె మంచిది. మరి అవతలి వాళ్ళు సలహాలు ఎందుకు అడుగుతారు అంటారా! అది కొందరికి కాలక్షేపం, కొందరికి మనం ఏమి చెప్తామో అనే కుతూహలం, మరికొందరికి మన అభిప్రాయం తెలుసుకోవాలనే జిజ్ఞాసా , వాళ్ళ సంకటం ఎవరితోనైనా షేర్ చేసుకుంటే కొంచెం భారం తగ్గుతుంది అనే ఆలోచన, తప్ప మరింకేమి కాదు. అందుకని ఎవరైనా సలహా అడిగినా ఎక్కువ బుర్ర పాడుచేసుకోకండి.

Wednesday 16 July 2014

యువత-స్నేహాలు.

ఈ రోజుల్లో అడ, మగ కలిసి చదువుకోవడం, ఆడ, మగ మధ్య స్నేహాలు సాధారణం అయిపోయాయి. ఇదివరకు రోజుల్లో ఆడ పిల్లలు, మగపిల్లలు కాలేజీ లలో కూడా మాట్లాడుకోవడానికి భయ పడేవారు. సంశయించేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరూ స్నేహంగా ఉంటున్నారు. కానీ ఆడపిల్లలకు వచ్చే ప్రమాదాలు ఇదివరకటి కన్నా ఎక్కువ అయాయి. ఒక్కోసారి నమ్మిన స్నేహితులే మోసం చేస్తున్నారు కూడా. ఇటువంటి పరిస్థితులలో స్నేహితులు, స్నేహం గురించి కొన్ని మాటలు చెప్పుకోవలసిన అవసరం ఉంది.

**తల్లితండ్రులు పిల్లల స్నేహితుల మీద ఒక కన్ను వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపూ మొబైల్స్, చాటింగ్ , కంప్యూటర్ లో చాటింగ్ చేస్తూ ఉంటె మీరు కొంత అడ్డుకట్ట వేయాలి.

**కంప్యూటర్, laptop వాడేటప్పుడు ఎక్కడో మారుమూల గదిలో కాకుండా, అందరికీ కనబడేలా హాల్ లో కూర్చోమని చెప్పాలి.

**ఇంటికి పిల్లల స్నేహితులు వచ్చినపుడు అరా తీస్తున్నట్టు కాకుండా మీరు కూడా ఒక ఫ్రెండ్ లాగా వారితో కలిసిపోయి కొంత సమయం గడపాలి.

**ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ని కూడా ఒక ప్రత్యేకమైన గదిలో కాకుండా, హాల్ లో కూర్చోపెట్టి మాట్లాడమని చెప్పాలి.

**మీ పిల్లల ముఖ్యమైన స్నేహితుల తల్లి/తండ్రులతో మీరు కూడా స్నేహం పెంచుకుంటే మంచిది.

**ఈరోజుల్లో పేస్ బుక్ స్నేహాలు కూడా ఎక్కువ అయిపోయాయి. ముక్కు మొహం తెలియని పేస్ బుక్ స్నేహితులను కలుసుకోవాలి అని మీ పిల్లలు అనుకున్నపుడు వారు తిట్టుకున్నా సరే, మీ పిల్లల క్షేమం కోసం, వారి వెంట మీరు తప్పనిసరిగా వెళ్ళండి.

**చాలా ఇళ్ళల్లో, పిల్లల స్నేహాల గురించి, దానివల్ల ఏదైనా చెడు పర్యవసానాలు వస్తే వాటి గురించి, సాధారణంగా తండ్రులకు తెలియకుండా దాస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. ఒక తల్లిగా నాకు ఈ విషయం తెలిసినపుడు, ఒక తండ్రిగా, ఇంటి యజమానిగా, మీ నాన్నకు కూడా ఈ విషయం తెలియాల్సిందే అని మీ పిల్లలకు ఖరాఖండి గా చెప్పండి.

**ఒకవేళ మీరు భర్తకు  తెలియకుండా ఒక విషయం దాస్తే, మీరు మీ పిల్లలకు మీ బలహీనత ఏమిటో చెప్పారన్న మాటే. మీ పిలక వారి చేతికి ఇచ్చారన్న మాటే.

**పిల్లల వల్ల తప్పు జరిగితే, ఇంట్లో అందరికీ తెలియాలి. దాని వల్ల, తండ్రి/తోబుట్టువుల దగ్గిర అవమానం అనే భావన వారిని తప్పు చేయకుండా ఆపుతుంది.

**అడ, మగ మధ్య స్నేహం తప్పు కాదు కానీ, ఎంత వరకు ఒక పరిధి లో ఉండాలి అనే విషయం మీ పిల్లలకు వివరంగా చెప్పండి.

**ఆడ, మగ మధ్య స్నేహం ఈ రోజుల్లో కల్చర్ అని మీరు అనుకుంటే మీరు చాల పొరబడ్డట్టే. కల్చర్ కి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు దాటితే వచ్చే ఫలితాలు ఇద్దరూ సమానంగా అనుభవించాలి.

****పిల్లలూ, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. మీ తల్లి తండ్రులు ఎప్పుడూ మీ శత్రువులు కారు. మీ మంచి కోరేవారు మాత్రమే. మీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఎంత మంది ఉన్నా, తల్లితండ్రుల తర్వాతనే ఎవరైనా! మీ పేరెంట్స్ మిమ్మల్ని అనుమానిస్తున్నారు అనేది మీ అభియోగం కావచ్చు. ముందు మీరు మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మేలా చూసుకోండి. మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉండాలి. మీరు ఎవరితో బయటికి వెళ్ళాలన్నా, ఎవరితో స్నేహం చేస్తున్న, తగిన కారణం మీరు చూపించ గలగాలి. అడ/మగ స్నేహలలో మీ ప్రవర్తన పట్ల మీ పేరెంట్స్ కు సందేహం ఉండకూడదు. వారిని కలవాలి అంటే, వారి ఇంట్లోనో, మీ ఇంట్లోనో కలవండి. మీ ప్రవర్తన పారదర్శకంగా ఉంటె, మీ తల్లితండ్రులు మిమ్మల్ని అనుమానించరు కదా!

****ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో చెప్పి వెళ్ళండి. అదేమీ అవమానం కాదు. మీరు అనుమతి తీసుకునేది మీ తల్లి తండ్రుల దగ్గరే అనే విషయం గుర్తు పెట్టుకోండి.

****లేట్ నైట్ పార్టీలు avoid  చేయండి.

****మీ ముఖ్యమైన స్నేహితుల ఫోన్ నంబర్లు ఇంట్లో వ్రాసి పెట్టి వెళ్ళండి.

****ఈనాటి పిల్లల ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే, మా అమ్మ/నాన్న మాటిమాటికీ ఫోన్ చేస్తారు. అందువల్ల మా ఫ్రెండ్స్ నన్ను వెక్కిరిస్తున్నారు అని. ఇందులో నామోషి పడవలసినది ఏమి లేదు. మీ ఫ్రెండ్స్ ఒకవేళ మిమ్మల్ని వెక్కిరిస్తే, మా అమ్మ/నాన్న లకు నాపై చాల ప్రేమ, చాల కేరింగ్ గా ఉంటారు వాళ్ళు అని సమర్ధించండి.

****ఒకవేళ ఆడ/మగ స్నేహితులు పార్టీలకు పిలిస్తే, వారిని ఇంటికి తీసుకువచ్చి మీ తల్లిదండ్రులకు పరిచయం చేయండి. వారికీ ఉన్న అనుభవం తో వారి ప్రవర్తన చూడగానే, వారు ఎటువంటి వారు అని చెప్పే నైపుణ్యం ఇంట్లో పెద్దలకు ఉంటుంది. మీ స్నేహాలను ఇంట్లో  దాచే ప్రయత్నం చేయవద్దు.

****ఒకవేళ మీరు వెళ్ళిన పార్టీలో మీ స్నేహితులతో పాటు ఇంకా అపరిచితులు ఉంటె, వారి వివరాలు మీకు సంతృప్తి కలిగిస్తేనే, ఆ పార్టీ లో కంటిన్యూ అవ్వండి. వారు అనుమానితులు గా అనిపిస్తే, ఏమి పర్వాలేదు, పార్టీ నుంచి వెనక్కి వచ్చేయండి.

****తల్లి తండ్రులు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా తమ పిల్లలు వృద్ధిలోకి రావాలనే. వారు కష్టపడేది మీ కోసమే. అటువంటి వారిని, చిన్న తనం నుంచి మిమ్మల్ని కళ్ళల్లో వత్తులు వేసుకొని, మీ ఆలనా పాలనా చూసిన వారిని మధ్యలో వచ్చిన స్నేహితుల కోసం మోసం చేయకండి. మీ భవిష్యత్ బాగుండాలి అంటే మీ ఆడ/మగ స్నేహితులతో కూడా మీరు నిజాయితీ గా , పారదర్శకంగా ఉండండి. స్నేహం పట్ల నిబద్దతో తో ఉండండి. అప్పుడు ఎవరికీ ఏ సమస్యలూ రావు.
అబ్బా, ప్రపంచం లో మనుషులందరూ జీవితాన్ని జీవించడం మర్చిపోయి, ఎంత అద్భుతంగా నటించేస్తున్నారో? మాట నటన, మనసు నటన, నడక నటన, నడత నటన, స్వచ్చత లేని మనసు, స్పష్టత లేని మాట. బంధాలు-అనుబంధాలు ఏవి లేవు. రక్త సంబంధాలు మొదలే లేవు. అన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. భగవంతుడు ఇచ్చిన సమస్యలకు తోడు, మనం తెచ్చిపెట్టుకునే సమస్యలు కొన్ని, ఈ సమస్యల వలయంలో నటన కూడా అవసరమా? ఖర్మ కాలి ఈ క్షణం ప్రాణం పోతే, మరుక్షణం మనం ఏమి చేయాలన్నా చేయలేమే! తదుపరి ఘడియలో ఏమి జరుగుతుందో మనం చెప్పలేము. మరి బ్రతికిన నాలుగు రోజులు, తృప్తిగా నొప్పింపక, తానొవ్వక అన్నట్టు బ్రతకకుండా ఈ నటనలు ఎందుకు? ఎవర్ని ఉద్ధరించడానికి? నిజానికి మన మనసు పారదర్శకంగా ఉండకపోతే, మనకే మనశ్శాంతి ఉండదు కదా? మరి ఎందుకు తెచ్చిపెట్టుకున్న ముఖాలు, తెచ్చిపెట్టుకున్న నవ్వులు? బ్రతికినన్నాళ్లు పారదర్శకం గా బ్రతకలేమా?
పిల్లలు సాధారణంగా పెద్దలను అనుకరిస్తూనే పెరుగుతారు. ఇంట్లో పెద్దలు ఏమి చేస్తున్నారో, అది వాళ్ళు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. తాత మూకుడు తరతరాల అనే సామెత లో లాగా, మన ఏ పని చేసినా, అది వారి మనసు మీద ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అందుకే అంటారు...భార్యా భర్తలుగా తప్పు చేయవచ్చు కానీ, తల్లి తండ్రులు అయ్యాక మాత్రం మన ప్రవర్తన ను మనం ఎప్పుడూ పరీక్షించు కుంటూ ఉండాలి. మన, మాటలు, చేతలు, ప్రవర్తన చూసే పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలకు మంచి మాటతీరు నేర్పాలి అంటే ఈ క్రింది విషయాలు తల్లితండ్రులు గుర్తుపెట్టుకోవాలి.
1. మాట్లాడేటప్పుడు స్వరం అదుపులో ఉండాలి. గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడకూడదు.
2. మనం చెప్పే విషయం పట్ల మనకు పూర్తీ అవగాహనా ఉండాలి. మనం మాట్లాడే విషయం మీద పిల్లలు ప్రశ్నలు వేస్తె, జవాబు చెప్పగలిగే పరిజ్ఞానం మనకు ఉండాలి.
3. ఇతరులు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మనం మాట్లాడడం మొదలు పెట్టాలి.
4. కొంత మంది తమ వాదన సరి అయినది అని నిరూపించు కోవడానికి ఒకళ్ళు మాట్లాడు తుండగానే పెద్దగా స్వరం పెంచి మాట్లాడుతుంటారు. అది సరిఅయిన పధ్ధతి కాదు.
5. పదాల ఉచ్చారణ బాగుండాలి.
6. మాటిమాటికి ఊతపదాలు ఉపయోగించ కూడదు.
7. ప్రతి మాటకి తిట్టు, అశ్లీలమైన పదాలు ఉపయోగించ కూడదు.
8. ప్రక్కనున్న వాళ్ళను చరుస్తూ మాట్లాడడం, అనవసరమైన హావభావాలు పనికిరావు.
9. సమయం, సందర్భం గుర్తుంచుకోవాలి, గుడి, ఆసుపత్రి, వంటి చోట పెద్దగా స్వరం పెంచి మాట్లాడకూడదు.
10. మరీ నింపాదిగా, సాగదీస్తున్నట్టు, అలా అని, మరీ వేగంగా మాట్లాడకూడదు.
11. ఇద్దరు మాట్లాడుతున్నపుడు మధ్యలో కల్పించుకొని మాట్లాడకూడదు.
12. పనివారితో పిల్లల ఎదురుగా గద్దిస్తున్నట్లు మాట్లాడకూడదు. పనివారిని చిన్న చూపు చూడకూడదు.
13. పెద్దలతో, ఉపాధ్యాయులతో నమ్రతగా మాట్లాడాలి.
14.మన తప్పును సమర్ధించు కొనేందుకు గట్టిగా అరిచి ఒప్పించాలని ప్రయత్నించ కూడదు.
15. పిల్లల ఎదురుగా ఇతరులకు, ఇరుగు పొరుగు వారికీ నిక్ నేమ్స్ తో వ్యవహరించా వద్దు. చాల మంది చేసే పెద్ద పొరపాటు ఇది.
16. ఇతరుల వస్త్ర ధారణా, వ్యక్తిగత విషయాల గురించి పిల్లల ఎదురుగా చర్చ జరపకండి.
17. ఒకరి మాటలు ఒకరికి చెప్పడం, ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పడం, పిల్లలకు అలవాటు చెయ్యవద్దు. ఒకవేళ పెద్దలకు ఉంటె మీ పిల్లల సంక్షేమం కోసం ఆ అలవాటు మానుకోండి.
18. ఫోనులో మాట్లాడేటప్పుడు, సౌమ్యంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి.
19. మన గౌరవం, ఎదుటివారి గౌరవం దృష్టి లో పెట్టుకొని మాట్లాడడం పిల్లలకు చిన్నతనం నుంచీ నేర్పాలి.
20. ఒకవేళ మీ పిల్లల మాట తీరు లో ఏదైనా తేడా గమనిస్తే, వారికీ మెల్లగా అర్ధం అయ్యేలా చెప్పండి. వారి తప్పు ముందు చెప్పి, దానిని సరిచేసుకొనే పధ్ధతి కూడా చెప్పండి. ఊరికే వారి మిద అరవటం వల్ల వాళ్ళు విసిగిపోయి, కొన్నాళ్ళకు మన అరుపులకు భయ పడడం మానేస్తారు.
ఎవరినైనా ఒదార్చ వలసి వచ్చినపుడు....
ఎపుడైనా మనకు ఆత్మీయులైన వారు కష్టాల పాలైతే ఎలా ఓదార్చాలో తెలియక ఇబ్బంది పడతాం. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే confusion లో ఉంటాము. ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఓదార్చడం కొంత సులువు అవుతుంది.
1. బాధలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా ఆనందపరచాలి అని ప్రయత్నించకండి.
2. జరిగిన నష్టం చిన్నది అని, మర్చిపోండి అని తేలికగా మాట్లాడకూడదు.
3. బాధలో ఉన్న వారిని అకస్మాత్తుగా వేరే విషయాల మీదకు మళ్ళించాలి అని ప్రయత్నించకండి.
4. మనసు మార్చుకోవడం అంత సులువు కాదు. దానికి కొంత సమయం పడుతుంది.
5. బాధలో ఉన్న వారి మనసు మళ్ళించడానికి వ్యర్ధ ప్రసంగం, అసందర్భంగా మాట్లాడడం చేయకూడదు.
6. ఎవరైనా ఆత్మీయులు మరణించినపుడు ఒదార్చవలసి వస్తే, మరణించిన వ్యక్తీ గురించి మంచి విషయాలు మాట్లాడాలి. కోలోపోయిన వ్యక్తీ గురించిన మంచి విషయాలు వినడం వారి సంబంధీకులకు ఆనందంగా ఉంటుంది.
7. మీరు వోదార్చేటప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకుంటే, వారిని స్వేచ్చగా ఏడవనివ్వండి. వేదన కన్నీళ్ళ రూపం లో బయటికి వస్తే, మనసు తేలికపడుతుంది.
8. పలకరించడానికి వెళ్ళినపుడు మీకు కూడా కన్నీళ్లు వస్తే రానివ్వండి. దానివల్ల అవతలి వారు మరింత దుఃఖ పడతారు అని సంశయించ వద్దు. వారి బాధలకు మీరు తోడూ ఉన్నారు అన్న ఫీలింగ్ వారిని తేలిక పడేలా చేస్తుంది.
8. బాధకు లోనైన వ్యక్తిని కూడా మాట్లాడనివ్వాలి. వారు ఏమి చెప్పినా ఓపికగా వినాలి. వారు ఒకటే మాట పది సార్లు చెప్పినా వినాలి.
9. ఓదార్చే సమయం లో వారితో కానీ, ఇతరులతో కానీ, అనవసర చర్చలు, అనవసర సంభాషణలు చేయకూడదు.
10. బాధ పడుతున్న వ్యక్తీ ఏమి చెప్పినా, అది మీకు అబద్ధం అనిపించినా, ఆ సమయం లో ఖండించకూడదు.
11. కష్టం వచ్చినపుడు అందరూ ఒక్కసారి కలుస్తారు. తరువాత ఎవరికీ వారె అన్నట్టు ఉంటారు. అలా కాకుండా, తరచూ కలుసుకో గలిగినంత దగ్గరలో ఉన్నట్టయితే, అవకాశం ఉన్నట్టయితే, తరువాత కొంత కాలం వరకూ తరచూ కలుస్తూ ఉండాలి.
12. బాధలో ఉన్న వ్యక్తీ భోజనం మానేయడం, బయటికి రావడం మానేయడం వంటివి చేస్తున్నపుడు వారిని ఒప్పించి నలుగురిలో తిరిగేల చేయాలి.
13. ఆత్మీయులను పోగొట్టుకున్నపుడు, అత్యంత వేదన అనుభవిస్తున్నపుడు, వారు ఆ బాధ నుంచి బయటకు రావడం ఒక్కోసారి చాల కష్టం అవుతుంది. అటువంటప్పుడు వారికీ ఉన్న హాబీలు ఇతరత్రా వాటి ద్వారా ఆ వేదన మర్చిపోయేట్లు చేయాలి.
14. ఇదేమంత పెద్ద విషయం? అందరికి ఉండేదే కదా! లోక సహజం కదా! అన్నట్లు మాట్లాడకూడదు. ఎవరి కష్టం వారికీ పెద్దగానే ఉంటుంది.
15. వారి బాధను పోగొట్టడానికి అన్నట్టు, వారికీ ఇష్టమైన విషయం మాట్లాడాలి. అలా అని, క్రికెట్ గురించో, సినిమాల గురించో మాట్లాడడం చాలా అసందర్భంగా ఉంటుంది.
16. వారి దారిలోనే వెళ్లి వారి మనసు మళ్ళించాలి తప్ప, మన దారిలోకి తెచ్చుకోవాలి అనుకోవడం హాస్యాస్పదం.
17. వారు పోగొట్టుకున్న వ్యక్తీ గురించి వివరాలు తెలుసుకోవాలని వినాలని అనుకుంటారు. అలా అని కోలోపోయిన వ్యక్తీ గురించి నెగటివ్ గా అసలు మాట్లాడకూడదు.
18. మౌనప్రేక్షకుల లాగా ఉండటం కంటే, ఏదో ఒకటి సవ్యంగా మాట్లాడడం మేలు.
19. చివరిగా, మన ఓదార్పు వారికీ శక్తి నిచ్చేదిగా ఉండాలి. వారిలో స్థైర్యం పెంచాలి. ఇలా చేస్తే, వారు జీవితాంతం మనతో బంధం కోరుకుంటారు.
భారత దేశం లో ఆయుర్వేద వైద్య విధానం అనాదిగా పాటింపబడుతోంది. దీని ప్రాశస్త్యం గుర్తించి దీనిని పంచమ వేదం గా పరిగణించారు మన పూర్వులు. మన చుట్టూ ప్రక్రుతి ప్రసాదించిన మూలికలు, వేర్లు, వివిధ వృక్షాలకు , తీగలకు సంబంధించిన భాగాములతోనే పూర్తీ రసాయన రహితంగా తయారయ్యే ఈ ఆయుర్వేద ఔషధాలు ఒక వ్యాధి యొక్క మూలాన్ని గుర్తించి, ఆ వ్యాధిని సమూలంగా నాశనం చేసే విధంగా తోడ్పడతాయి. ఎన్నో రకాల ఆయుర్వేద ఔషధాలు మన మునులు, ఋషులు, ఎన్నో పరిశోధనలు చేసి, మానవాళికి వరంగా అందించ బడ్డాయి. వీటిలో మానవుని నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు నివారిణి గా ఉపయోగపడే ఒక అపురూపమైన ఔషధం "త్రిఫల చూర్ణము".
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ల మిశ్రమమే త్రిఫల చూర్ణం. విడివిడిగా ఈ ఫలాలలో ఎంత ఔషధ గుణాలు ఉన్నాయో, ఈ మూడు కలిసినపుడు ఇంకా మంచి ఫలితాలు ఇస్తాయి. వీటిని సమానమైన భాగాలలో తీసుకుని, గింజలు వేరు చేసి, పైన ఉండే బెరడును ఎండబెట్టి, దంచి మెత్తగా పొడి చేసి ఒక సీసా లో నిల్వ చేసుకొని రోజూ వాడుకోవచ్చు. పలుచని మజ్జిగలో, గోరువెచ్చని నీటితో, లేదా తేనెతో కలిపి వాడుకోవచ్చు. ఈ చూర్ణం కొద్దిగా వగరు రుచి కలిగి ఉంటుంది. కాబట్టి, మజ్జిగలో కొంచెంగా ఉప్పు వేసుకొని ఒక చెంచా పొడిని కలుపుకొని తాగితే మంచిది. సాధారణంగా దీనిని రాత్రిపూట భోజనం అయినాక పడుకునే ముందు తీసుకుంటారు.
ఉపయోగాలు.
1.జీర్ణ శక్తిని పెంచుతుంది.
2. అన్నవాహిక ను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా గ్యాస్, త్రేనుపులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.
3. జీర్ణ కోశాన్ని పరిపుష్టంగా ఉంచుతుంది.
4. రక్తాన్ని శుద్ది చేస్తుంది.
5. జుట్టు రాలకుండా ఆపుతుంది.
6. జుట్టు తొందరగా తెల్లబడకుండా నివారిస్తుంది.
7. జుట్టు కుదుల్లను బలంగా చేస్తుంది.
8. శరీరం లోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది.
9. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అద్భుతమైన ఔషధం.
10. రక్తపోటు ను నియంత్రించడంలో దోహదపడుతుంది.
11. కాలేయం, స్ప్లీన్ ల పనితీరు ను మెరుగు పరుస్తుంది.
12. కంటిలో శుక్లాలు, గ్లకోమ రాకుండా అడ్డుకుంటుంది .
13. ప్రేగులను శుభ్రం చేస్తుంది.
14. దీనిని క్రమం తప్పకుండా వాడితే చర్మం వయసుతో పాటు ముడుతలు పడకుండా నివారిస్తుంది.
త్రిఫల చుర్ణమును 1-2 చెంచాలు రాత్రి పూట అరగ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి, రాత్రంతా అలాగే కదపకుండా ఉంచి, మరునాడు ఆ నీటితో కళ్ళు కడుక్కుంటే, కంటి బాధలు తొలగిపోతాయి.
ఇంతటి అద్భుతమైన ఔషధం ప్రతి వారి ఇంటిలోనూ ఉండవలసినది. వయసు నిమిత్తం లేకుండా అందరూ వాడవచ్చు. గర్భిని స్త్రీలు మాత్రం వాడకూడదు. వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.* అన్ని రకాల రుగ్మతలకు పనిచేసే ఔషధం ఈ త్రిఫల
గత ఆదివారం సాక్షి దినపత్రిక అనుబంధం పుస్తకం లో ఒక కధ చదివాను. చాల మంది మిత్రులు చదివే ఉంటారు. ఆ కధ సారాంశం క్లుప్తంగా....పేదరికంతో రోజు గడవక, పిల్లల చదువు మాట అలా ఉంచి, అన్నం కూడా పెట్టలేని పరిస్థితులలో, వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఒక తల్లి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి కూలి పని కోసం సౌది వెళ్తుంది. అక్కడ చాకిరీ చేయగా వచ్చిన జీతంలో తను కొద్దిగా ఖర్చు పెట్టుకొని, మిగతా అంతా భర్తకు పంపుతుంది, అప్పులు తీర్చడం కోసం, ఉన్న పొలం సాగు చేయడం కోసం, పిల్లల ప్రస్తుత చదువుల కోసం, వారి భవిష్యత్ కోసం దాచమని భర్తకు చెప్తుంది. తీరా కొన్నేళ్ళు కష్టపడిన తర్వాత, అక్కడి రూల్స్ మారటం వల్ల ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ఇండియా కి వెళ్ళిపోవలసిన పరిస్థితులు వస్తాయి. అపుడు టికెట్ కొనుకోవడానికి కూడా డబ్బు లేక, భర్తకు డబ్బు పంపమని ఉత్తరం రాస్తుంది. దానికి భర్త ఏమి చెప్తాడు అంటే====నువ్ పంపిన డబ్బు నేను ఏదో కొద్దిగానే అప్పులు తీర్చాను. పొలం సాగులో లేదు. పిల్లల భవిష్యత్ గురించి కూడా ఏమి దాచలేదు, అంత డబ్బు ఒక్కసారిగా చూసేసరికి నాకు జల్సాలు ఎక్కువ అయినాయి, వ్యసనాలకు అలవాటు పడ్డాను, ఫలితంగా రోగాల బారిన పడ్డాను, నీకు పంపడానికి నా దగ్గర ఏమి లేదు అని....
ఈ కధ నేను ఇక్కడ వ్రాయటానికి సందర్భం ఏమిటంటే, ఇది వట్టి కధ కాదు. నిజ జీవితం లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. భార్య సంపాదించడానికి వెళ్తే, భర్తలకు లేనిపోని వ్యసనాలు అంటుకుంటున్నాయి. ఒక ఇంటిలో మగవాడు సంపాదించడానికి విదేశాలకు వెళ్తే, ఆ ఇంటిలోని పిల్లలకు చెడు అలవాట్లు అవుతున్నాయి. అక్కడ సంపాదించే వాడికి కష్టం తెలుస్తుంది కాని, ఆ డబ్బు అనుభవించే వాడికి కష్టం తెలియదు. ఇక్కడ పిల్లలు మాత్రం (అందరు కాదు, చాల మంది) బైకులు, పార్టీలు, ఖరీదైన ఫోనులు, ఇలా బాధ్యత తెలియకుండా జల్సా చేస్తున్నారు. కొంత మంది ఆడవాళ్లు కూడా మితి లేకుండా , బాధ్యత లేకుండా ఖర్చు పెడుతున్నారు.
ఊరికే వచ్చే డబ్బు, కష్టం తెలియనీయని డబ్బు ఎప్పుడూ అనర్ధాలకే దారి తీస్తుంది. మీ జీవిత భాగస్వాములు విదేశాలకు వెళ్లి సంపాదిస్తున్నారు అంటే, ఇక్కడ వచ్చేది చాలదు, ఇక్కడి కన్నా మీకు మెరుగైన , సౌకర్య వంతమైన జీవితం ఇవ్వాలి అనేది వాళ్ల ఉద్దేశ్యం. రుచికరమైన భోజనం లేక, తినీ తినక, సరియైన వాతావరణ పరిస్థితులు లేక, అయిన వాళ్ళు దగ్గర లేక, కేవలం డబ్బు కోసం దూరాన ఉండి, వారు జీవిస్తున్నారు. పేస్ బుక్ లు, చాటింగ్ లు, స్కైపులు, మనసులను దగ్గర చేయలేవు. మనసులోని ఒంటరితనాన్ని దూరం చేయలేవు. వారి కష్టాన్ని గమనించుకోండి.
వారు పంపే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి.
చివరగా ఒక విషయం. "డబ్బును మన గుప్పెట్లో పెట్టుకున్నంత వరకే అది మన మాట వింటుంది. మన గుప్పిట దాటిందో, మనలను ఆడిస్తుంది.".
కధ వ్రాసిన రచయిత కు ధన్యవాదములు. శతకోటి నమస్సులు.
ప్రతి గర్భిణి స్త్రీ కి ఒక మొబైల్ ఫోన్ ఉచితం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ యోచన.

గర్భిణి స్త్రీలకూ ఉచితంగా ఒక మొబైల్ ఫోన్ అందజేసి, సంక్షిప్త సందేశాల ద్వారా, ఆమె తీసుకోవలసిన టీకాలు, బలవర్ధక మైన ఆహారం వంటి వివరాలు అందజేయాలి , తద్వారా దక్షిణ భారతం లోనే మాతా శిశు మరణాలు ఎక్కువగా నమోదు అయిన రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో గర్భిణి స్త్రీల ఆరోగ్యం విషయం మిద శ్రద్ధ పెట్టి, మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి అని ప్రభుత్వ యోచన. ఇది ఈనాడు దినపత్రిక లో నిన్న అనగా 16 జూలై నాడు ప్రచురింపబడిన వార్త.

1.ఈరోజున గ్రామీణ ప్రాంతాలలో కూడా 90 శాతం ప్రజలు మొబైల్స్ వాడుతున్నారు. స్త్రీలకూ కూడా మొబైల్స్ ఉంటున్నాయి.
2. గర్భిణి లకు సూచనలు , సలహాలు అందజేయాలి అంటే, ఇంట్లో ఎవరో ఒకరికి మొబైల్ ఉంటె చాలదా? ప్రత్యేకించి ఆ స్త్రీకి ఉండాలా?
3.ఒక మాదిరి ఆర్ధిక పరిస్థితి, చదువు, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారికి వైద్యులు ఇచ్చే సూచనలు సరిపోతాయి, ప్రత్యేకించి వారికీ మొబైల్ కొత్తగా ఈ విషయమై ఇవ్వవలసిన పనిలేదు.
4. అంతగా చదువు లేకుండా, మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న స్త్రీలకూ మొబైల్ ఇచ్చినా కూడా అది వారి దగ్గర నిలుస్తుంది అని నమ్మకం లేదు. అది ఇతర అవసరాలకు పనికి రావచ్చు. (పేదల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన రేషన్ కార్డులు 90 శాతం తాకట్టు లోనే ఉంటాయి ఎప్పుడూ).
5. బాగా విద్యాధికుల దగ్గరే కొండొకచో, మొబైల్స్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. ఇంకా నిరక్షరాస్యులైన వారికీ ప్రత్యెక మొబైల్స్ అవసరమా?
6.  నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటె, ఈ పధకం కింద ఖర్చు పెట్టె కోట్ల రూపాయలను, గర్భిణి స్త్రీల పోషకాహారానికి నేరుగా ఖర్చు పెట్టవచ్చు.
7. ప్రతి గ్రామం లో ఉన్న గ్రామా సేవికలు, అంగన్వాడి కార్యకర్తల ద్వారా, గర్భిణి స్త్రీల పేర్లు, నమోదు చేసి, ప్రతి వారం , లేదా ప్రతి రోజు వారికీ పోషకాహారం నేరుగా అందివ్వవచ్చు. ప్రతినెలా వారి యొక్క ఆరోగ్యం పరీక్షించడానికి పరీక్షలు చేసి, టీకాలు ఉచితంగా ఇవ్వవచ్చు.
8. మన రాష్ట్రం లో ఎన్నో చోట్ల, ఎన్నో కుటుంబాలు స్వచ్చందంగా వేసవి కాలంలో అంబలి సెంటర్లు తెరిచి బీదలకు అంబలి పంచి పెడుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వం తలచుకుంటే ప్రతి గ్రామం లోను, ప్రజా వైద్య శాలల్లో గాని, అంగన్వాడి సెంటర్లలో కాని, ప్రతి రోజు గర్భినులకు ఆహారం అందజేసే కార్యక్రమం చేపట్టవచ్చు.
9. దీనికి కావలసినది అధికారులలో, చిత్తశుద్ది. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ. వారి వారి కర్తవ్యమ్ పట్ల నిబద్ధత.
10, అసలు చెప్పుకోవాలంటే, మారుమూల గ్రామాలనుంచి గర్భినులకు ప్రసవ సమయం లో ఆసుపత్రికి చేరటానికి సరిఅయిన రహదారులు లేవు. ఏజెన్సీ ప్రాంతాలలో అయితే, వారి పరిస్థితి మరీ దుర్భరం. అక్కడ గర్భిణి స్త్రీ ప్రాణాలకు ఏ విధమైన గారంటీ లేదు.
11. ముందు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ వైద్య శాలల్లో సౌకర్యాలు మెరుగు పరచండి. వైద్యులు అక్కడే ఉండి, ఏ సమయం లో నైనా వైద్యం అందించే పరిస్థితి కల్పించండి.
12. ఉచిత మందులు, ఉచిత టీకాలు ప్రజలకు అందే ఏర్పాట్లు చేయండి.
13. ఇవి అన్నీ లేనపుడు మీరు మొబైల్స్ ఉచితం గా ఇవ్వడం ఎంతవరకు సబబు?
14. మొబైల్స్ ఉచితంగా ఇస్తే పై సమస్యలు అన్నీ తీరిపోతాయ?
15.మాతా శిశు మరణాలు రేటు తగ్గడానికి ముందు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను educate  చేయండి. వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహారం వీటి పట్ల అవగాహనా కల్పించండి.
16. పల్స్ పోలియో కార్యక్రమం లాగా ఈ అవగాహనా కార్యక్రమం కూడా ఏళ్ళ తరబడి నిరంతరాయంగా సాగేలా చుడండి.
17, ప్రజలు educate  అవనంత వరకు మీరు ఎన్ని మొబైల్స్ ఉచితంగా ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
18. పైగా, మొబైల్స్ ఉచితంగా ఇవ్వడం వల్ల ఇంకా అనర్ధాలకు దారి తీసిన వారు అవుతారు. ఎందుకంటే టెక్నాలజీ రెండు వైపులా పదును ఉన్న కత్తి కాబట్టి. దాని విలువ తెలుసుకోలేని వారి దగ్గర అది ఎప్పుడూ దుర్వినియోగం అవుతుంది.

**************ఈ పోస్ట్ చుసిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, లేక ప్రభుత్వం తో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులు ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే సంతోషిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం వరకు ఈ పోస్ట్ చేరవేయాలి అంటే దాని process  నాకు తెలియదు.

Friday 27 June 2014

అనగనగా ఒక మహానగరం లోని ఒక రద్దీ అయిన వీధిలో ఆకాశాన్ని అంటే అపార్టుమెంట్. అందులో ఒక ఇంట్లో 2,3 సంవత్సరాల ఒక పాప. పేరు మున్ని. మున్ని వాళ్ల అమ్మ ఇవాళ చాల హడావిడిగా ఉంది. ఆమె చాల అవసరంగా ఇవాళ బ్యాంకు కు వెళ్లి ఎక్కడో చదువుకుంటున్న మరిది కి డబ్బు పంపాలి. భర్తకు తీరిక లేదు. తనే తప్పనిసరిగా వెళ్ళాలి. అందుకే తనతో పాటు తీసుకెళ్ళడానికి మున్ని ని తయారు చేసి కిటికీలో కూర్చోపెట్టింది. ఇంతలో కింద నుంచి హాహాకారాలు, గొడవలు, గగ్గోలు, మత విద్వేషాలు, గృహ దహనాలు, లూటీలు, పోలీసులు, లాఠి చార్జీలు. షరా మామూలుగా నగరం లో కర్ఫ్యూ విధించారు. 3 రోజులు గడిచిపోయాయి. బ్యాంకు పని అవ్వలేదు. మతకలహలకు కారణం మొదట తెలియలేదు. తరువాత ఎవరో హిందూ కాలనీ లో నడచి వెళ్తున్న ఒక ముస్లిం మిద చెప్పు విసిరారు. అది ఇంత మరణ హోమానికి దారి తీసింది. పరిస్థితులు ఎలాగో సద్దు మణిగాయి.  ప్రశాంతత వచ్చింది. నగరం నివురు కప్పిన నిప్పులా ఉంది. మున్ని వాళ్ల అమ్మ మళ్లీ బ్యాంకు పనికి బయలుదేరింది. మున్ని ని తయారు చేసింది. చెప్పులు వేద్దామంటే కనబడలా... ఏమైనట్టు, ఈ నాలుగు రోజుల నుంచి ఎక్కడికీ వెళ్ళలేదే? అనుకుంటూ అంతా వెతికింది. ఎక్కడా లేదు. కోపం తో అసహనం తో మున్ని కి నాలుగు అంటించింది. మున్ని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ ఏడుపు లోనే ఏదో చెప్తోంది. వెక్కిళ్ళ మధ్యలో తల్లికి ఏమి అర్ధం కాలేదు. కానీ కొట్టినందుకు తనే మళ్లీ బాధపడుతోంది. మున్ని ని దగ్గరకు తీసుకొని మళ్లీ చెప్పమ్మా అని అడిగింది, మున్ని చెప్పింది--" ఆరోజు నా చెప్పు కిటికీలోంచి బయటకు పడిపోయింది" -- అని.

అనగనగా ఒక చెత్త ఛానల్. అది దాని రేటింగ్స్ పెంచుకోవడానికి ఏ గడ్డైనా తింటుంది. ఆ నిర్వాహకులకు రేటింగ్ పెంచుకోవడం తప్ప వేరే పని లేదు. ఆ ఛానల్ ట్యాగ్ లైన్స్ మాత్రం కోటలు దాటుతాయి. మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే ఆ ఛానల్, మెరుగుగా ఉన్న సమాజాన్ని ముంచేసేందుకే పుట్టినట్టుంది.

అయన ఒక పీఠాదిపతి. అయన పని హిందుత్వాన్ని, దశదిశలా వ్యాపింపచేయడం. ఆయనను అంతటి స్థానం ఇచ్చి గౌరవించారు అంటే ఆయనకు సమాజం పట్ల అంతో ఇంతో బాధ్యత ఉంది కదా. అది పాపం అయన మర్చిపోయారు. ఒక పీఠానికి అధిపతి అయి ఉంది, కాషాయం ఎప్పుడైతే కట్టాడో, అయన అరిషడ్వర్గాలను జయించి ఉండాలి. పాపం అది అయన చేతకాలేదు.ఆయనకు ఇష్టం లేని ప్రశ్నలు వేస్తె వారి చెంప చెల్లుమనిపిస్తాడు.  అటువంటి వారికీ వాక్సుద్ధి  ఉండాలి. నోరు, మాట మన్నించ దగినవిగా ఉండాలి. కానీ అయన నోరు విప్పితే కాంట్రవర్సీ లే. అన్నిట్లోనూ వివాదమే. పీఠాధిపతి గా అయన పొందలేని గుర్తింపు వివాదాల ద్వార పొందుతున్నాడు.

ఈ బుర్ర లేని ఛానల్, ఆ పని లేని పెద్దమనిషిని చర్చా కార్యక్రమానికి పిలిచింది. ఒక పక్క, రాష్ట్రం అడ్డుగోలు విభజన, ఒకరికి లోటు బడ్జెట్, ఒకరికి మిగులు బడ్జెట్, కరంటు, నీళ్ళు, అన్నీ వివాదాస్పదం, రెండు రాష్ట్రాల వాళ్ళు సతమతం అవుతున్నారు, మాటల ఈటెలు విసురుకుంటున్నారు. ఇంకో పక్క పసిఫిక్ సముద్రం లో ఎల్ నినో, ఋతుపవనాలు ఆలస్యం, రైతన్నకు నీరు లేదు, పంటలు పండవు, ఎక్కడ మళ్ళీ కరువు కాలం వస్తుందో అనే భయం, మరో ప్రక్క జాతి ఉపయోగానికి అంటూ, రైలు చార్జీల మోత, గ్యాస్ బండ గుదిబండై మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే భయం, --- ఇవన్ని ఇలా ఉంచి, ఆ బుర్ర లేని ఛానల్ కి ఆ చర్చకు టాపిక్ ఎవరు ఇచ్చారో తెలియదు, ఆ చర్చ వల్ల సమాజానికి ఏమి ఉపయోగమో తెలియదు కానీ, ఇప్పటికి సమాజం లో ఉన్న సంఘర్షణలు చాలవు అన్నట్లు, "శ్రీ షిరిడి సాయి బాబా దేవుడా ? కాదా?" అనే అంశం మీద ఆ సదరు పీఠాధిపతి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

1. అన్ని మతాలూ దేవుని చేరే వివిధ మార్గాలు అని అన్ని మతాలూ ఘోషిస్తున్నాయి. అందులోను,  హిందూ ధర్మం ఎంతో విశాల హృదయం తో అన్ని మతాలను ఆదరించింది. ఈనాడు, హిందూ ధర్మం, వారిని పూజించద్దు వీరిని పూజించద్దు, వీరినే పూజించాలి, ఈయనే దేవుడు అనే ఆంక్షలు పెట్టలేదు. అటువంటి హిందూ ధర్మానికి చెందిన ఒక పీఠాధిపతి, బాబా ముస్లిం, ఆయనను పూజించే వారు రాముని పూజించవద్దు అని అనటం ఎంతవరకు సబబు?

2. ప్రతి గ్రామం లోను, బాబాను పూజించే వారు ఎక్కువ అవడం వలన, షిర్డీ కి భక్తుల తాకిడి ఎక్కువ అవడం వలన, ఇదివరకు రాముని పూజించే వాళ్ళు కూడా ఇప్పుడు బాబాను పూజించడం వలన , రామునికి రావలసిన ఆదాయం అంతా బాబాకి వెళ్ళిపోతోంది అని అయన ఆక్రోశం. ఒక సన్యాసి కి డబ్బు గురించిన చింత ఎందుకండీ? రాముడి డబ్బు తగ్గిపోతే రాముడు చూసుకుంటాడు, ఆ ఆ దేవాలయాలు కట్టించిన ధర్మకర్తలు చూసుకుంటారు కదా?

3. ఒకవేళ ఈయన పూజించద్దు అని చెప్పినంత మాత్రాన బాబాను తమ దైవంగా, తండ్రిగా భావించే భక్తులు మానరు కదా? ఎవరిని పూజించాలి, ఎవరిని నమ్మాలి అనేది భక్తుల వ్యక్తిగత విషయం. దీనిని పబ్లిక్ చేయడం ఎంతవరకు సమంజసం.?

4. వేరే మతం వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు హిందూ సమాజం లో అంతర్గత కలహాలు తేవడానికి ఇదంతా చేస్తున్నారు అని ఆ స్వామిజి సెలవిచ్చారు. ఇందులో అర్ధం ఏమిటో ఆయనకే తెలియాలి.

5. ఈ చర్చ చూసిన/విన్న  సోదరులు కొందరు, సాయి భగవంతుడే కాదు, అయన ఒక గురువు మాత్రమే, ఆయనను దైవం తో సమానంగా చూడకండి, దైవం అనే హోదా ఇవ్వకండి అని మొత్తుకున్నారు. మరి చెట్టుకొకరు, పుట్టకొకరు పుట్టుకొస్తున్న స్వమీజిల గురించి ఎవరూ ఏమి మాట్లాడరే? వాళ్ళందరూ ఇంతంత బంగారాలు దిగేసుకుని, పట్టు పరుపుల మిద బంగారు సింహాసనాల మిద కుర్చుని, పడపూజకు లక్షలు లక్షలు రుసుము వసూలు చేస్తుంటే మాట్లాడరే?

6. కలియుగం లో బాబానే కాకుండా, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి, ఇటువంటి మహానుభావులు ఎందఱో ఉన్నారు. ఎంతో మందికి మార్గ నిర్దేశం చేసారు. వాళ్ళందరి విషయం లో లేని దుగ్ధ బాబా విషయం లోనే ఎందుకు?

7. కొందరి ఉవాచ ఏమిటంటే, బాబా గురించి వేదాలలో లేదు కాబట్టి ఆయనను ప్రామాణికంగా తీసుకోలేము. బాబా నిన్న మొన్నటి వరకు మన మధ్యలో తిరిగిన వారు. కొన్ని యుగాల క్రితం పుట్టిన వేదాలలో అయన ప్రసక్తి ఎలా ఉంటుంది?

8. బాబా ను దైవంగా కొలిచినా, కొల్వక పోయినా, అయన నేర్పిన భక్తీ, క్రమశిక్షణ బాబా భక్తులందరికీ అలవాటు అయిపోయాయి. ఏ బాబా మందిరం లోను, ఏ పండగ నాడు కనీ, విశేష దినాలలో కనీ, ఎంత రద్దీ ఉన్నా, తొక్కిసలాట జరుగదు. భక్తులు ఎంతో నిదానంగా క్యు పాటిస్తూ నిశ్శబ్దం గా లైనులో కదులుతుంటారు.

9. అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా తనను తానూ ఎప్పుడూ దేవుడిని అని చెప్పుకోలేదు. దేవుని బానిసను మాత్రమే అని చెప్పారు. నేను దక్షిణగా తీసుకునే ప్రతి పైసాకి నేను భగవంతునికి లెక్క చెప్పాలి అని చెప్పారు. నన్నే పూజించండి అని చెప్పలేదు. ఎవరు ఏ దేవుని పూజిస్తే వారికీ ఆ రూపం లో దర్శనం ఇచ్చారు. నాకు ఈ విధంగా పూజ చేయండి అని చెప్పలేదు. ఎవరి ఇష్టం అయినట్టు వారిని పూజించుకోమని చెప్పారు.

10. సదరు పీఠాధిపతి గారు ఇంకో విషయం సెలవిచ్చారు. బాబా ముస్లిం అయితే, ముస్లిములు ఎక్కువ బాబాను ఎందుకు పూజించడం లేదు అని? ముస్లిములకు నిర్గుణమైన ఆరాధన తప్ప, సగుణారాదన లేదు. ముస్లిములే కాదు, మార్వాడీలు, సిక్కులు ఎంతో మంది బాబాను పూజిస్తున్నారు. సామాన్య భక్తులు కేవలం భక్తీ తప్ప , బాబా మతాన్ని పట్టించుకోవటం లేదు. అందరికీ ఆదర్శం గా ఉండవలసిన ఆ స్వామి బాబా యొక్క మతం కులం అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు.

అసలు సమాజానికి ఒక్క పైసా మేలు చేయని ఇటువంటి చర్చలను ప్రోత్సహించే చానల్స్ ను బాన్ చెయ్యండి. అక్కర్లేని విషయాలకు ధర్నాలు, స్త్రైకులు చేసే వాళ్ళు, ఇటువంటి చర్చలు బాన్ చ్యడానికి ధర్నాలు చేయండి.

Thursday 26 June 2014

దాదాపు 20 సంవత్సరాల క్రితం నుంచి అంటే దాదాపుగా ఈ కార్పొరేట్ కాలేజీ లు మొదలు ఐన నాటి నుండి కేవలం రాంకులు, మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు, అందుకోసం సైన్స్ సబ్జక్ట్స్ తప్పఇంగ్లీషు, తెలుగు భాషలకు విలువ, ప్రాధాన్యం ఇవ్వక పోవడం మూలాన ఇప్పుడు వాటి పరిస్తితి అధ్వాన్నంగా తయారయింది. మా తరం అంటే తెలుగు మీడియం లో చదువు కున్నం కాబట్టి ఇంగ్లీషు grammer మాకు సరిగా రాలేదంటే అర్ధం ఉంది. కానీ అంతంత డబ్బులు పోసి ఇంగ్లీషు మీడియం లలో చదివించినా కుడా ఒక పేరా వ్రాస్తే అందులో పది గ్రామర్ తప్పులు. దానికి తోడు ఇప్పుడు వచ్చిన ఈ దిక్కుమాలిన sms భాష ఒకటి. అన్ని పదాలు సగం సగం వ్రాయటమే. abt ,hw , u , r , thnx , ఇలా. పరీక్ష పేపర్లు దిద్దుతుంటే ప్రాణం పోతోందండి అని వాపోయింది ఒక ఇంగ్లీషు లెక్చరర్ ఆ మధ్య.
ఇక తెలుగు గురించి ఏమి చెప్పాలి? 20 ఏళ్ళ క్రితం నుంచి సరి అయిన బోధనా లేకపోవడం మూలంగా ఇపుడు ఏ signboard చూసినా, ఏ షాప్ ముందు నేమ్ బోర్డు చూసినా, అందులో సవాలక్ష తప్పులు. ఇంక టీవీ లో స్క్రీన్ అడుగు భాగం లో వచ్చే స్క్రోలింగ్ చుస్తే ప్రతి వాక్యానికి ఒక తప్పు తప్పనిసరి. ఇంక వార్తలు చదివే వాళ్ళు, ఎంకర్స్ సంగతి ..... అందరికి తెలిసినదే. మొన్న మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం నాడు ఒక ప్రముఖ ఛానల్ లో రాత్రి ప్రైమ్ టైం న్యూస్ చదువుతున్న అయన "భాద్యతలు" అంటుంటే "బాధితులు" అని వినపడింది. మొదట నేను తప్పు వింటున్నానా అని అనుకొన్నా. శ్రద్ధగా విన్నా అదే పరిస్థితి. పంటి కింద రాయిలా. anchors లో చాల మందికి "ళ", "ణ" పలకదు. వెల్లి. పెల్లి, గననీయం అని చదువుతుంటే వినడానికి చాలా బాధగా ఉంటుంది. దానికి తోడూ, కొత్తదనం పేరిట అన్ని భాషలు కలిపేసి ఏదో వెర్రి మొర్రి పదాలు, సంకర భాషాను.
ఇప్పటికీ డిడి నేషనల్ లో శుద్ధమైన హిందీ, డిడి సప్తగిరి లో శుద్ధమైన తెలుగు మాట్లాడతారు. ఇదివరకు ప్రైవేటు చానల్స్ లో కూడా ఇంగ్లీష్ మాటలు పరిమితంగా వాడేవారు. ఇప్పుడు తెలుగు పొదుపుగా వాడుతున్నారు అనిపిస్తుంది. ఈ ప్రైవేటు చానల్స్ లో తెలుగు తనం ఉట్టిపడే కార్యక్రమాలే ఉండవు. ఏదో సంక్రాంతి పండుగకో, ఉగాది పండుగకో మనం తెలుగు వాళ్ళం అనే సంగతి గుర్తు వస్తుంది వాళ్ళకు.
మా పిల్లలు చదువుకునే కాలంలో తెలుగు లో ఇచ్చిన అన్ని పద్యాలూ భావార్ధలతో సహా నేర్పించేవాళ్ళం. ఇపుడు తెలుగు, ఇంగ్లీషు సబ్జక్ట్స్ లో కేవలం పరీక్షకు వచ్చే పాఠాలు మాత్రమే చెప్పి, అందులో ప్రశ్నలు మాత్రమే చెప్పి మిగతావి వదిలేస్తున్నారు. ఇక పిల్లలకు తెలుగు గురించి ఏమి తెలుస్తుంది?
ఇపుడైనా మించిపోయింది లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లలకు తెలుగు గురించి, చెప్పండి. సామెతలు, పొడుపు కథలు , నీతి కథల ద్వారా తెలుగును పరిచయం చేయండి. నాకు తెలిసి తెలుగు ను మొదటి నుంచి నేర్చుకోవడానికి గొల్లపూడి వారి పెద్ద బాల శిక్ష బాగా పని చేస్తుంది. ముందు మీరు నేర్చుకొని, పిల్లలకు ఇంట్లో ఆడుతూ పడుతూ చెప్పండి. పద్యాలూ, చమత్కారాలు తెలుగులో చాల ఉన్నాయి. అవి చెప్పండి. లేదంటే, కొన్నాళ్ళకు ఈ భాష లోని అందమైన పదాలన్ని మనం మర్చిపోతాం. ఆఖరికి కొన్నేళ్ళకు తెలుగు మృత భాషల జాబితాలో చేరిపోతుంది.
ఈరోజు ఒక గ్రూప్ లో ఒక మహిళా సభ్యురాలు నన్ను ఒక ప్రశ్న అడిగారు. వాళ్ళ పిల్లలు అసలు పనిలో సహాయం చేయడం లేదు అని, ఉద్యోగిని అయిన ఆవిడా అన్ని పనులు చేయటం కష్టం గా ఉంది అని, ఏదైనా సలహా చెప్పండిఅని.
పిల్లలకు ఇంట్లో పని చేయడం చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. బాటిల్స్ లో నీరు నింపడం, భోజనాల సమయం లో టేబుల్ సర్దడం, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టి ఇల్లు నీట్ గా ఉంచడం, ఉతికిన బట్టలు మడత పెట్టి ఎవరివి వారికీ సర్దడం, ఇంకా తల్లులు ఉద్యోగస్తులు అయితే, కూరలు కడిగి పెట్టడం, కొంచెం పెద్ద వయసు పిల్లలు అయితే, కూరలు తరిగి ఇవ్వడం, బియ్యం కడిగి పెట్టడం, వారి టిఫిన్ బాక్స్ లు వారు సర్దుకోవడం, ఏదైనా టూర్ వెళ్ళినపుడు వారి సూట్ కేసులు వారు సర్దుకోవడం, ఇటువంటి పనులు పిల్లల చేత చేయించవచ్చు. కానీ అత్యధికంగా తల్లులు చేసే పొరపాటు ఏమిటంటే, తమ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అని, వారికీ ఏమి తెలియదు అని అనుకోవటం. పిల్లలు ఏ వయసు వారైనా చాల తెలివిగా ఉంటారు. వాళ్ళకు చెప్పే విధంగా చెప్తే చిటికెలో అర్ధం చేసుకుంటారు.ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది. మనం వాళ్ళకి చెప్పే పనులు, మనం చేస్తున్నావే అయి ఉండాలి. ఉదాహరణకు, మనం బట్టలు మడత పెట్టేటప్పుడు వారి చేత కూడా చిన్న బట్టలు కానీ, వాళ్ళ బట్టలు కానీ మడత వేయమని చెప్పాలి. మనం వంట గదిలో పని చేసేటప్పుడు, మనం కూరలు తరిగేటప్పుడు ఆ కూరలు ఒక్కొక్కటీ కడిగి ఇవ్వమని చెప్పాలి. మనం బాటిల్స్ లో నీరు నిమ్పినపుడు, రెండు మనం నింపి, మిగతావి వారిని నింపమని చెప్పాలి. ఈ పనులు చేస్తూ ఉన్నంతసేపు మనం వారిని కబుర్లతో, కథలతో , జోక్స్ తో ఎంగేజ్ చేయాలి. ఒకవేళ ఉద్యోగినులు అయితే, మీరు ఎంత బిజీ గా ఉన్నారో, వాళ్ళు చేసే చిన్న చిన్న సహాయాల వల్ల ఎంత సమయం మీకు అదా అవుతోందో చెప్పాలి. వాళ్ళు సహాయం చేసిన ప్రతిసారి వాళ్ళకు థాంక్స్ చెప్పాలి. చిన్నతనం లోనే వాళ్ళకు మీ వెనకాలే పని చేయటం, మీకు సహాయం చేయటం అలవాటు చేస్తే ఆ అలవాటు వాళ్ళు పెరిగిన తరువాత కూడా మర్చిపోరు.
ఇక్కడ చాల మంది ఒక ప్రశ్న అడుగుతారు. ఇలా ఇంటి పనులలో పడి తిరిగితే వాళ్ల చదువు ఏమి కాను? అని,1. ఈ చిన్న చిన్న పనులకు ఎంతో టైం పట్టదు. 2. చదువు మధ్యలో వాళ్ళకు రిలాక్స్ కావడానికి ఇవి తోడ్పడతాయి. 3. ఇల్లు, ఉద్యోగం రెంటినీ అమ్మ ఎంత శ్రమ తీసుకుని నిర్వహిస్తోంది వారికీ అర్ధం అవుతుంది. కనుక వాళ్ళు మర్నాటి నుంచి స్వచ్చందంగా ఇంటి పనులు చేస్తారు. ఆ సమయానికి తగ్గట్టు వారి చదువుల వేళల్లో మార్పు చేసుకుంటారు. ఇందాకే చెప్పా కదా పిల్లలు తెలివైన వారు అని. 4. కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ పనులు చేసుకోవటం వలన మీకు, మీ పిల్లలకు మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఇది భవిష్యత్ లో మీ అనుబంధాలు గట్టిపడడానికి చాల ఉపయోగపడుతుంది. 5. ఇలా చిన్న చిన్న పనులు పెంచుకోవటం వలన వాళ్ళకు బాధ్యత తెలిసివస్తుంది.
కాబట్టి, ఇలా చేసి చుడండి. పది రోజుల్లో మార్పు మీరే గమనిస్తారు.
దేశం లో ఎన్నో సమస్యలు, చర్చకు రాదగిన విషయాలు ఎన్నో ఉండగా, సాయి బాబా దేవుడా, కాదా అని ఒక ప్రైవేటు ఛానల్ లో చర్చ. దానికి ఒక వక్త ఒక పీఠాధిపతి. ఈ చర్చ వల్ల ఎవరికైనా ఒక పైసా ఉపయోగం ఉందా, ఆ ఛానల్ కి తప్ప. ఏదో ఒక గంట కాలక్షేపం. పోనీ ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల కొంచెం అయినా నాలెడ్జ్ వస్తుందా, అక్కర్లేని గొడవలు, తప్ప. ఇటువంటి దిక్కుమాలిన చర్చలు ఎందుకు పెడతారో తెలియదు. ఇదివరకు రోజుల్లో ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు ప్రైవేటు చానల్స్ ప్రోగ్రామ్స్ నియంత్రిన్చినపుడే బాగుండేది. ఇపుడు 24 గంటలు ప్రోగ్రామ్స్ అనేసరికి ఏ ప్రోగ్రామ్స్ చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు.
అయన ఒక పీఠాధిపతి. మతాలూ అన్ని దేవుని వద్దకు చేర్చే వివిధమైన మార్గాలు అని ఆయనకు తెలియదా? భారతదేశం ముఖ్యంగా హిందూ దేశం అయినప్పటికీ, కొన్ని శతాబ్దాలుగా అనేక మతాలూ ఈ భక్తీ ప్రవాహం లో కలిసాయి. అన్ని మతాల వాళ్ళు కలిసి మెలిసి ఎన్నో శతాబ్దాలుగా ఈ దేశం లో ఉంటున్నారు. రాజ్యాంగం కూడా అందరూ సమానం అని చెప్పింది. బాబా కూడా సమాధి చెంది 100 సంవత్సరాలు కావొస్తోంది. ఇపుడు కొత్తగా బాబా దేవుడా, కాదా అనే పాయింట్ ఎందుకు వచ్చింది? అసలు ఈ ప్రశ్న ఎవడి బుర్రలో పుట్టింది?
షిరిడి బాబా ఏనాడూ నాకు బంగారం, వెండి, కానుకలు ఇవ్వండి అని చెప్పలేదు. కనీసం నాకు ఈ నైవేద్యం పెట్టండి అని కూడా చెప్పలేదు. ఇంకా తన దగ్గరకు వచ్చిన అసహాయులకు అయన ఎదురు సహాయం చేసారు. నివేదనకు కూడా ఒకసారి నివేదన చేసిన దైనా పర్వాలేదు, ఇంట్లో ఏది ఉంటె అదే అని కూడా చెప్పారు. అప్పు చేసి, షిర్డీ రావద్దని, నన్ను మనస్పూర్తిగా తలచుకుంటే ఎక్కడ అయినా ప్రత్యక్షం అవుతానని కూడా అయన జీవించి ఉన్నపుడే భక్తులతో చెప్పారు. ఆయన జీవించి ఉన్నపుడు, సమాధి చెందినా తరువాత కూడా ఎన్నో నిదర్శనాలు భక్తులకు చూపించారు. కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇటువంటి చర్చలు ప్రజలకు అవసరమా?
ఎంతసేపు, రకరకాల సంస్థల వాళ్ళు టీవీల్లో హిందువుల ఆచార వ్యవహారాలు, నమ్మకాల మీదనే ఆధారపడి చర్చలు సాగిస్తారు కాని, ఇతర మతాల జోలికి పోరెందుకు? ఎందుకంటే వాళ్ళంటే భయం. వాళ్ల మతాలలో మాత్రం నమ్మకాలు, మూఢ నమ్మకాలూ లేవా? ఇంకా మన నమ్మకాలూ శాస్త్రీయంగా కూడా రుజువు అయ్యాయి కూడా. అయినా హిందువులే అన్ని చర్చలకి టార్గెట్. ఎందుకంటే ఎవరి పాపాన వాళ్లే పోతారు అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండే జాతి ఇది అని.
బాబా దేవుడు కాదు అని సదరు స్వామి వారు చెప్పినపుడు, పుట్టకొకరు, చెట్టుకొకరు అని పుట్టుకొస్తున్న స్వామిజిల మాటేంటి మరి? ఇది ఎవరూ అడగరు? వాళ్ళకు భక్తులు బంగారం, వెండి కానుకలు ఇవ్వడం లేదా? వాళ్ళకు పెద్ద పెద్ద మహాల్స్ ఉండటం లేదా? వాళ్ళు AC కారుల్లో తిరగడం లేదా?
ఏది ఏమైనా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి దిక్కుమాలిన చర్చా కార్యక్రమాలను ప్రేక్షకులు ఖండించాలి. ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాలు చానల్స్ రూపొందించాలి. వాళ్ల రేటింగ్ పెంచుకోవడానికి అక్కర్లేని చచ్చు, పుచ్చు ప్రోగ్రామ్స్ చేయొద్దని టీవీ చానల్స్ వాళ్ళకు నా మనవి. ప్రపంచం లో ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రజలను educate చేయడానికి. అవి చేయండి. అందరు సంతోషిస్తారు.

Monday 16 June 2014

మా టీవీ లో గత వారం మొదలైన " మీలో ఎవరు కోటీశ్వరుడు" కార్యక్రమం చాల బాగుంటోంది. హిందీ ఛానల్ లో అమితాబ్ చేసిన కార్యక్రమాన్ని తెలుగులో నాగార్జున గారు చేస్తున్నారు. యావద్భారత ప్రేక్షకులకు సుపరిచితమైన అమితాబ్ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అయన నటిస్తూ ఉండడం, ఇపుడు వయసులో పెద్దవారు అవటం వల్ల అయన కార్యక్రమంలో పాల్గొనే వారికీ, ప్రేక్షకులకు కూడా ఒక ఆత్మీయుడు గా అనిపించారు. ఇపుడు అదే కార్యక్రమం అదే నిర్మాతలతో తెలుగు లో రూపు దిద్దుకుంది. హిందీ లో ప్రోగ్రాం ని చుసిన వారికీ ఇది కొత్తగా అనిపించడం లేదు. బాగా అలవాటు అయిన ప్రోగ్రాం చూస్తున్నట్టే ఉంది. నిర్మాతలు ఒకరే అవడం వలన, సెట్టింగ్స్ లో కాని, background music లో కానీ ఏమి తేడా లేదు. ఇది కూడా ఈ ప్రోగ్రాం మనకు సుపరిచితం గా ఉండడానికి ఒక కారణం. అమితాబ్ కన్నా చిన్నవారు అయినప్పటికీ, నాగార్జున ఈ కార్యక్రమాన్ని చాల పరిణతి తో నిర్వహిస్తున్నారు. వచ్చిన వారిని పలకరించడం, వారితో సరదాగా మాట్లాడడం ఈ ప్రోగ్రాం కి వన్నె తెచ్చాయి.

ఈ కార్యక్రమం ద్వారా, మంచి విజ్ఞాన దాయకమైన విషయాలు తెలియడమే కాకుండా, మనుషుల జీవితాలలో ఉన్న ఎత్తుపల్లాలు కూడా తెలుస్తున్నాయి. ఒక విధంగా ఈ ప్రోగ్రాం విజ్ఞానం +స్పూర్తి ని కలిగిస్తోంది. మొట్టమొదటి భాగం లో ఒక టీచర్ వచ్చారు. అయన కల ఒక సొంత ఇల్లు కట్టుకోవటం. దానికి 3,4 లక్షలు సరిపోతుంది అన్నపుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎంత సంపాదించినా, సరిపోవట్లేదు అనుకునే వారికీ ఇది నేర్చుకోవలసిన విషయం అనిపించింది.  అయన కల తీరేందుకు సరిపడా డబ్బును గెల్చుకున్నారు కూడా.

ఇంకొక అభ్యర్ధి తండ్రి చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్నారు. అయన నాగార్జున గారికి అయన సైజుకు సరిపడా, చెప్పులు కుట్టి తెచ్చారు. అవి ఎంతో అందంగా ఉన్నాయి. నాగార్జున ఎంతో అభిమానంగా అవి స్వీకరించారు కూడా.

అన్నిటికన్నా, ఒక స్పూర్తిదాయకమైన మహిళను నిన్నటి భాగం లో చూసాము. ఆమె ఒక HIV పాజిటివ్ వ్యాధిగ్రస్తురాలు. 14 సంవత్సరాల వయసులోనే పెళ్లి అయిన ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టాక ఆమె భర్త ఆ వ్యాధితో చనిపోయారు.  ఆమెకు కూడా ఆ వ్యాధి సోకింది. అప్పటినుంచి జీవితం లో పోరాడుతూ, ఉపాధి కోసం తెలిసిన వారి సహాయంతో ఒక ఆటో కొనుక్కొని, నడపడం నేర్చుకొని దాని మిద ఆదాయం పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఆమె. కేవలం స్త్రీ కావడం వలన ఆమె ఎన్ని బాధలు పడ్డారో చెపుతుంటే చూస్తున్న వాళ్ళకే కాదు, అక్కడ ఉన్న నాగార్జున గారికి కూడా కళ్ళు చెమర్చాయి. ఆటో నేర్పడానికి ఆమె శరీరాన్ని బేరం పెట్టినవారు కొందరు. ఆమె HIV  పాజిటివ్ అని తెలియగానే, మళ్లీ పత్తా లేకుండా పోయారు. ఒక అతను ఈమె బలహీనతను గమనించి ఆటో డ్రైవింగ్ నేర్పడానికి రోజుకు వెయ్యి రూపాయలు అడిగాడట. అంత డబ్బు ఇవ్వలేని ఆమె, ఒక్క రోజులోనే డ్రైవింగ్ నేర్చుకున్నారట. ఇంత జరిగినా, ఆమె తన భర్తను కొంచెం కూడా కించపరచలేదు, విధిని కూడా ఆమె తప్పు పట్టడంలేదు. అది మనం అందరం నేర్చుకోవలసిన విషయం...ఆమె లక్ష్యం పిల్లలను బాగా చదివించడం. ఆమె 40,000 మాత్రమే గెలుచుకున్నారు. ఆమె లక్ష్య సాధన కోసం మరి కొంత మొత్తం గెలుచుకుని ఉంటె బాగుండేది.

గత వారం విజయవాడ నుండి ఒక పెద్దావిడ పాల్గొన్నారు. ఆమె ఒక మహిళా హాస్టల్ నడుపుతున్నారు. ఆమె లక్ష్యం ఆ హాస్టల్ ను ఇంకా అభివృద్ది చేయడం. ఆమె దగ్గర్నుంచి మనం నేర్చుకోవలసినది ఆత్మ విశ్వాసం. ఆవిడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంతో ఆత్మ విశ్వాసం తో , నేను ఈ బహుమతి గెలుచుకుని వెళ్ళాలి, నా హాస్టల్ పిల్లలకు ఎంతోకొంత చేయని అనే ధృఢమైన నిశ్చయంతో పాల్గొన్నారు అనిపించింది. ఆఖరున క్విట్ అయేటప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసం తో క్విట్ అయారు ఆవిడా. ఆవిడ అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అనిపించింది.

ఇదివరకు తెలుగులో చాలా quiz షో లు వచ్చాయి. ముందు చెప్పినట్టు, ఇది అందరికీ పరిచయం అయిన ప్రోగ్రాం అవడం, పరిణతి చెందిన నటుడు దీనిని నిర్వహించడం ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చాయి. ఎప్పుడూ ప్రైవేటు చానల్స్ లో సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలే కాకుండా ఇటువంటివి కూడా ప్రసారం చేస్తే, విజ్ఞానం, వినోదం తో పాటు మన జీవితాలకు ఒక స్పూర్తి కూడా కలుగుతుంది.

Sunday 15 June 2014

రామనామ సంకీర్తన 6

రామనామము రామనామము రమ్యమైనది రామనామము

శాంతిగా ప్రార్ధించు వారికీ సౌఖ్యమైనది రామనామము
రామనామ స్మరణ చేసిన క్షేమమోసగును రామనామము
పెద్దలను ప్రేమించు వారికీ ప్రేమనిచ్చును రామనామము
ఆత్మా శుద్ధిని కన్నవారికి అధిక మధురము రామనామము

గుట్టుగా గురుసేవ చేసిన గుణములోసగును రమణము
బ్రహ్మ విష్ణు మహేస్వరులకు నిష్టమైనది శ్రీ రామనామము
పరమ పదము చేరుటకు దారి చూపును శ్రీ రామనామము
తల్లివలె రక్షించు సుజనుల తావళము శ్రీ రామనామము

జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామ నామము
మంగళం బగు భక్తితో పాడిన శుభకరమ్బగు శ్రీ రామనామము

రామనామము రామనామము రమ్యమైనది రామనామము......


                   //////////    శ్రీరామ   ////////
రామనామ సంకీర్తన 5

రామనామము రామనామము రమ్యమైనది రామనామము

బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము
భక్తితో ప్రహ్లాదు డడిగిన వారము నొసగెను రామనామము
నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీ రామనామము
ఎందు జూచిన ఏకమై తా వెలయుచున్నది రామనామము

రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము
రామ తత్వమూ నెరుగు వారికీ ముక్తి తత్వమూ రామనామము
వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము
శరణు శరణన విభీషణునకు శరణ మొసగిన రామనామము

శాంతి సత్య అహింస సమ్మేళనమే శ్రీ రామనామము
సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము
సోహం అను మంత్రార్ధ విదుల దేహముక్తియే రామనామము
ఉపనిషద్ వాక్యంముల చేతను యోప్పుచున్నది రామనామము

దాసులను రక్షించు దయగల ధర్మ నామము రామనామము
నాదమే బ్రహ్మాన్దమంతయు నావరించును రామనామము
రాక్షసులను తరిమికొట్టిన నామమే శ్రీరామ నామము
మోక్షమివ్వగా కర్త తానై మ్రోగుచున్నది రామనామము

(ఇంకా ఉంది)
రామనామ సంకీర్తన 4

రామనామము రామనామము రమ్యమైనది రామనామము

పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము
నిజ స్వరూపము బోధకంబగు తారకము శ్రీ రామనామము
రజితగిరి పతికినేప్పుడు రమ్యమైనది రామనామము
శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీ రామనామము

సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణ తత్వమే రామనామము
అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన శ్రీ రామనామము
అల కుచేలుని చేతి అటుకుల నారగించిన రామనామము
ఆత్మలో జీవాత్మ తానై అలరుచున్నది రామనామము

అత్మతపమును సల్పువారికి ఆత్మ యజ్ఞము రామనామము
కర్మ నేత్ర ద్వయము చేతను కానరానిది శ్రీ రామ నామము
జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము
చిత్త శాంతిని కలుగ చేసేది చిత్స్వరూపము రామనామము

చావు పుటుకలు లేని పరమ పదమై వెలయుచున్నది రామనామము
ముక్తి రుక్మాంగదున కొసగిన మూలమంత్రము రామనామము
మూడు నదులను దాటువారికి మోక్షలక్ష్మియే రామనామము
మొహమను మంత్రార్ధ విధులకు సోమపానము రామనామము

చూపు మానస మొక్కటై చూడవలసినది రామనామము
త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞానజ్యోతియే శ్రీ రామనామము
దూరద్రుష్టియే లేనివారికి దుర్లభము రామనామము
బంధ రహిత విముక్తి పధమగు మూలమంత్రము శ్రీ రామనామము

(ఇంకా ఉంది )

Friday 6 June 2014

పార్టీల్లో లేదా ఫంక్షన్స్ లో ఎంతమంది ఉన్నా, అందరి దృష్టి ఇద్దరు ముగ్గురి మిద ఉంటుంది. వాళ్ళే ఆ పార్టీ కి కేంద్ర బిందువులా ఉంటారు. వారి చుట్టూ ఒక విధమైన చైతన్యం, ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంటాయి. వారిలో ఏదో ఒక ప్రత్యెక ఆకర్షణ ఉంటుంది. అది ఖచ్చితంగా ఏమిటో చెప్పలేము. వారి ప్రభావం మాత్రం ఖచ్చితంగా అందరి మిద ఉంటుంది.

ఇలా ఒక గుంపులో అందరి మీద ప్రభావం చూపించే వ్యక్తులలో అందం, ఆకర్షణ, మాటతీరు, హుందాతనం, ప్రవర్తన, ప్రతిభా పాటవాలు ఇవన్ని లేదా కొన్ని లక్షణాలు ఉండవచ్చు.

  కొంతమంది నలుగురినీ ఆకర్షించే అందం, ముఖ సౌందర్యం కలిగి ఉన్నా, అదొక్కటే ప్రభావితం చేయడానికి సరిపోదు. నిటారుగా , ఆత్మవిశ్వాసం తో నడవడం, ఖరీదైన వస్త్రాలు ధరించక పోయినా, చక్కగా శరీరానికి నప్పే దుస్తులు ధరించడం, ( అన్ని ఫేషన్లు అందరికీ నప్పవు. అది గమనించుకొని మన వస్త్ర ధారణా ఉండాలి. ) శరీర నిర్మాణానికీ, దుస్తులకూ నప్పే విధంగా నగలు అలంకరించు కోవటం, చక్కటి హెయిర్ స్టైల్, తగినంతగా అలంకరణ ఇవన్ని అందాన్ని, ఆకర్షణను ఇనుమడింప చేసేవే.  అందరికీ శరీర నిర్మాణం, ముఖ సౌందర్యం చక్కగా లేకపోయినా, బయటకు కనిపించే తీరు, మన స్వభావం, మాటతీరు చక్కగా ఉంటె గుర్తింపు అధికంగా ఉంటుంది.

 ఇతరుల వద్ద మనం గుర్తింపు పొందడానికి ముఖ్యమైన కారణం మన మాట తీరు. చక్కని చిరునవ్వు, చక్కగా చిన్న, పెద్ద అందరిని పలకరించడం, వయసులో పెద్ద వారికి నమస్కరించడం, వారి పట్ల గౌరవ భావం తో ఉండడం, ఇటువంటివి మనకు వెంటనే గుర్తింపు తెస్తాయి. పార్టీ కి పిలిచినా వారితోనే కాకుండా, వచ్చిన మిగతా అతిధులను కూడా చక్కగా పలకరించడం, వారి యోగ క్షేమాలు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు కనుక్కోవడం ఎంతో బాగుంటుంది. అతిథులలో ఎవరితో అయినా మనకు బేధాభిప్రాయాలు ఉన్నా , అవి బయట పడనీయకుండా వారితో కూడా అవసరానికి నవ్వుతూ మాట్లాడాలి. వారి గురించి ప్రక్క వారితో చులకనగా మాట్లాడడం, వ్యంగ్యమైన మాటలు విసరడం ఇటువంటివి మన ప్రవర్తనను దిగజారుస్తాయి. ఏదైనా విషయం మీద మాట్లాడేటప్పుడు సూటిగా స్పష్టంగా, వినేవారికి చక్కగా అర్ధం అయ్యేలా, స్పుటమైన గొంతుతో మాట్లాడాలి. నలుగురిలో మాట్లాడడానికి భయంగా ఉన్నపుడు మనకు బాగా తెలిసిన వాళ్లతో కొంచెం సేపు మాట్లాడి అపుడు కొత్త వారితో మాట్లాడాలి. మాటల్లో, అతిశయం, పిల్లల చదువుల గురించో, కొత్తగా కొన్న ఆస్తి గురించో గర్వం ఉండకూడదు.అన్నీ నాకే తెలుసు అన్నట్లు మాట్లాడడం, నా మాటే చెల్లాలి అన్నట్టు మాట్లాడడం తగదు. మనం మాట్లాడేటప్పుడు వినేవాళ్ళకు వినసొంపుగా ఉండాలి. అలాగే ఇతరులు మాట్లాడేటప్పుడు మనం కూడా శ్రద్ధగా వినాలి. ఏదో చెప్పావులే,  నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి అన్నట్టు వినకూడదు. మన హావభావాలు కూడా సంస్కారంతో ఉండాలి. అలాగే దూరంగా ఉన్నవారి గురించి చాడీలు చెప్పడం, నెగటివ్ గా మాట్లాడడం మన సంస్కార లేమిని తెలియజేస్తాయి.

 గోళ్ళు కొరకడం, తల గోక్కోవడం, మాటిమాటికీ ఊత పదాలు వాడడం, పక్క వాళ్లకు చిరాకు తెప్పిస్తాయి. ఆహారం తీసుకునే విషయం లో కూడా, మొదట్లోనే ఎక్కువ వడ్డించు కోకుండా అన్నిటినీ కొంచెం కొంచెం రుచి చూసి బాగా నచ్చినది మరి కొంచెం వడ్డించుకోవాలి. ముందే ఎక్కువ తీసుకుని పళ్ళెం లో వృధా చేయడం సరికాదు. అలాగే తినేటప్పుడు శబ్దం చేస్తూ తినడం, ప్రతి పదార్ధానికీ వ్యాఖ్యలు చేస్తూ తినడం సరికాదు.

మనకు గానం, నృత్యం ఇటువంటి వాటిల్లో ప్రవేశం ఉన్నపుడు ఎవరైనా అడిగిన వెంటనే పాడాలి. మొహమాటం ఉంటె సున్నితంగా తిరస్కరించాలి. అంతే కానీ, ఎక్కువ సేపు బ్రతిమాలించు కోవడం, ఆఖరికి పాడడం, ఇలా చేయకూడదు. మరోసారి మీ మీద వారు దృష్టి పెట్టరు.

చిన్న పిల్లలను పార్టీలకు, ఫంక్షన్లకు తీసుకేల్లినపుడు వారు కూడా అందరితో కలుపు గోలుగా, స్నేహంగా ఉండేటట్టు ఇంటివద్దనే అలవాటు చేయాలి. వారికీ కూడా అందరినీ పలకరించడం నేర్పాలి. ఏదో ఒక విషయం గురించి, మొండి పట్టు పట్టడం, మిగిలిన పిల్లలతో పోట్లాడడం,  ఇటువంటివి జరిగినపుడు పెద్దలు సున్నితంగా వ్యవహరించాల్లి. పిల్లల్లో ఎవరిదో ఒకరిదే తప్పు అని నిర్ణయిన్చాకుండా అందరికీ సర్ది చెప్పాలి.

ఈ విధంగా చేస్తే, పార్టీల్లో, మీరు అందరికీ కేంద్ర బిందువై, అందరి మన్ననలు పొందుతారు. ఏమంటారు?


Friday 16 May 2014

 ఈ మధ్య  అదేదో సినిమాలో " దేశం లో ఎవరితో పెట్టుకున్నా, ఏ భాష వాడితో పెట్టుకున్నా ఆంధ్ర వాడితో, తెలుగు వాడితో పెట్టుకోవద్దు"  అని యముడు తన కుమారుడికి చెప్తాడు. సోనియా ఆ సినిమా చూసుంటే బాగుండేది. . రాష్ట్ర విభజన తో కడుపు మండిన ఆంధ్ర వోటరు ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కు రాకుండా చేసాడు. వోటర్లు వెర్రి గొర్రెలు అనుకునే రా.కీ.నా. లకు చుక్కలు చూపించాడు. ఆంధ్ర వాడి సత్తా ఏమిటో దేశానికి తెలిసేలా చేసాడు. కాంగ్రెస్ కు చెందినా ఏ ప్రముఖ వ్యక్తీ కుడా బరిలో గెలవలేక పోయాడు. సామాన్యుడు సామాన్యుడు అని అనుకున్న వోటరు అసామాన్య తెలివి తేటలు చూపించి తనకు ఏమి కావాలో, ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నాడో స్పష్టం చేసాడు. ఇక ముందు వచ్చే ప్రభుత్వాలు అయినా ప్రజల వైపు నుంచి అలోచించి పాలిస్తేనే వాటికీ మనుగడ.

Thursday 15 May 2014

ఆ రోజుల్లో.....7


ఎన్నికలు.....ఫలితాలు...


మాకు బాగా ఊహ తెలిసిన తరువాత వచ్చిన ఎన్నికలు 1984.  అప్పుడు కొత్తగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. మా పెద్దవాళ్ళు అందరు కాంగ్రెస్ కు కాకుండా తెలుగు దేశం పార్టీ గెలవడం జీర్ణించు కోలేక పోయారు. మాకు మాత్రం సంతోషం. అయితే ఈ ఎన్నికలు, ఫలితాలు వచ్చినపుడు మాకు ఇంకో విధంగా ఆనందంగా ఉండేది. అప్పుడు టీవీ లు లేవుకదా, అన్నిటికీ రేడియో నే ఆధారం. ప్రతి పావుగంటకు ఎలక్షన్ బులెటిన్ వచ్చేది. మిగిలిన ప్రోగ్రాములు అరగంట నిడివి లో ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికల స్పెషల్ బులెటిన్ మధ్యలో రెగ్యులర్ ప్రోగ్రాములు వేయడానికి అవకాసం ఉండదు. అందుకని బులెటిన్ మధ్యలో మీరా భజన్స్, తులసి దాస్ భజన్స్, లలిత గీతాలు, జానపద గీతాలు  వంటివి వేసేవారు. మా సంబరం అందుకు. అవి నేర్చుకోవడానికి మాకు అది చక్కటి అవకాశం. పెన్ను, పుస్తకం దగ్గర పెట్టుకొని ఆ పాట వస్తున్నంత సేపు చక చక వ్రాసుకునే వాళ్ళం. దాంతో పాటే ట్యూన్ కుడా నేర్చుకోవాలి. వినేవాళ్ళకు ఇది అతిశయోక్తి గా అనిపించవచ్చు కానీ, మేము ఎన్నో పాటలు, లలిత గీతాలు అలాగే నేర్చుకొన్నాము. అలాగే బులెటిన్ లో ఎవరు ఎప్పుడు ఆధిక్యం లో ఉన్నారు?, ఎన్ని స్థానాల్లో గెలుపొందారు? వంటివి ప్రతి పావుగంటకి , ప్రతి బులెటిన్ విశేషాలు టైం తో సహా నోట్ చేసుకునేవాళ్ళం.

అలాగే, భారత్ లోను, దాని మిత్ర దేశాల లోను ప్రముఖులు చనిపోయినపుడు  సంతాప దినాలు 3 రోజులు పాటించే వారు. రేడియో లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ఉండేవి కావు. అప్పుడు కూడా ఈ భజనలు, గీతాలు వేసేవారు. ఒక్కోసారి అయితే  ఈ పాటల కోసం స్కూలు మానేసే వాళ్ళం . ఆయతుల్లా ఖోమైనీ చనిపోయినపుడు 2 తులసి దాస్ భజనలు, ఒక మీరా భజన్ నేర్చుకున్నా నేను. వినాయక చవితి పందిళ్ళలో, అయ్యప్ప స్వామి భజన లలో పెట్టే భక్తీ పాటలు కూడా అలాగే నేర్చుకునే వాళ్ళం. ఒక్కోసారి అయితే, ఆ పందిళ్ళ దగ్గరికి వెళ్లి ఆ కేసెట్ వివరాలు అడిగి తెలుసుకొని, కొనుక్కోవడం, లేదా ఒకటో, రెండో తెలియని పాటలు ఉంటె, ఆ పందిళ్ళ వాళ్ళని బ్రతిమాలి ఆ కేసెట్ తెచ్చుకొని ఆ రెండు పాటలు ఒకటి రెండు గంటల్లో నేర్చుకొని వాళ్ళకు ఇచ్చేయడం. కనీ మేము ఈ రకంగా నేర్చుకుంటున్నాము అని మా ప్రత్యర్ధులకు తెలియనిచ్చే వాళ్ళం కాదు. అదో దేవరహస్యం. ఈ రకంగా మేము ఎలక్షన్ బులెటిన్ లు, సంతాప దినాలు, పండుగలలో పందిళ్ళు, అన్నీ  మా కోసం ఉపయోగించేసుకునే వాళ్ళం.

Wednesday 14 May 2014

మా రోజుల్లో.....6


మా దూరదర్శన్ క(వ్య)ధలు......


ఈరోజుల్లో డిష్ లు, 150, 200 కు మించి ఛానల్స్ చూసే పిల్లలకు మేము ఒకటే ఒక ఛానల్ అందునా ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు మాత్రమే పనిచేసే ఛానల్ చూసేవాళ్ళము అంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. 1980 లలో దూరదర్శన్ హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రం లోని మిగతా ప్రాంతాలలో కుడా ప్రసారాలు మొదలు పెట్టింది. రిలే ద్వారా డిల్లీ నుంచి మాత్రమే కొన్నాళ్ళు ప్రసారాలు వచ్చేవి, అవి కుడా కేవలం హిందీ భాషలో. కొత్త ఒక వింత కదా, అర్ధం అయినా అవకపోయినా అవే చూసేవాళ్ళం. అందులోను, టీవీ చూడడం అలవాటు అయిపోతే యింక వదలలేరు , అదొక జాడ్యం లా పట్టుకుంటుంది అనే పెద్దవాళ్ళ భయం తోటి మాకు ఒక టైం లిమిట్ ఉండేది టీవీ చూడడానికి. యింక ఆ టైం లో ఏ ప్రోగ్రాం వచ్చినా చుసేసేవాళ్ళం. అది జైకిసాన్ అయినా, కవి సమ్మేళనం అయినా, ( కవి సమ్మేళనాలు ఎక్కువగా ఉర్దూ భాషలో వచ్చేవి. అవి కుడా వదిలేవాళ్ళం కాదు.) ఆరోజుల్లో వీధికి ఒక టీవీ ఉంటె గొప్ప. వీధిలోని పిల్లలు అందరూ తొందరగా హోం వర్కులు, చదువు పూర్తి చేసుకుని 6,7 గంటల కల్లా టీవీ ఉన్న ఇంటికి చేరేవారు. యింక ఆ వచ్చే కార్యక్రమాలు అర్ధం అయినా, అవ్వకపోయినా గుడ్డిగా చుసేయటం. వారానికి రెండు సార్లు వచ్చే హిందీ గీతాల కార్యక్రమం "చిత్రహార్" కు ఇల్లు హౌస్ ఫుల్. ఆదివారం సాయంత్రం మాత్రం తెలుగు సినిమా వచ్చేది . అప్పుడూ ఇల్లు హౌస్ ఫుల్లే. ఆ వీధి లో మాది టీవీ ఉన్న రెండో ఇల్లు. ఆదివారం వచ్చే తెలుగు సినిమా కోసం వచ్చే ప్రేక్షకుల కోసం మేము ఆదివారం బయటకు వెళ్ళే ప్రోగ్రాం కుడా వాయిదా వేసుకునే వాళ్ళం.  హిందీ వార్తలు కూడా చుసేసే వాళ్ళం.

కొన్నాళ్ళ తర్వాత రోజుకు అరగంట తెలుగు ప్రసారాలు ఇచ్చేవారు. 10 నిముషాలు రైతుల కోసం, 10 నిముషాలు ఏదైనా డాక్యుమెంటరీ లాగా ఇచ్చి, ఆఖరి పది నిముషాలు ఏదో ఒక నాటిక ఇచ్చేవారు. లేదా హాస్య కార్యక్రమం ఉండేది. ఆ ఆఖరి పది నిముషాల ఎంటర్టైన్మెంట్ కోసం ముందు 20 నిముషాలు భరించేవాళ్ళం. ఆ అరగంటా చదువుకు సెలవు. అప్పట్లో కార్టూన్లు వచ్చినట్లుగానే, రైతుల కోసం ప్రోగ్రాం లో ఎప్పుడూ, పందుల పెంపకం, ఈము పక్షుల పెంపకం, సుబాబుల్ చెట్ల పెంపకం,... డాక్యుమెంటరీ లో పొగ లేని పొయ్యిల తయారీ , మహారాష్ట్ర లోని పిమ్పాల్ బట్టి అనే గ్రామం లో సౌర వ్యవస్థ ద్వారా పూర్తిగా గ్రామ విద్యుదీకరణ గురించి, ఇవే చెప్పేవాళ్ళు. చూసి, చూసి, మాకు అవి నోటికి వచ్చేసేవి. నేటి మేటి హాస్యనటుడు శ్రీ బ్రహ్మానందం గారు ఆ అరగంట తెలుగు కార్యక్రమం లోనే మా అందరికీ పరిచయం. కితకితలు అనే ప్రోగ్రాం ద్వార అయన మిమిక్రి చేసేవారు. ఇక ఈనాటి ప్రముఖ ఏంకర్లు సుమ, ఝాన్సీ, వంటి వారు తొలిసారిగా బుల్లితెరకు పరిచయం అయిన సీరియల్ కూడా అప్పుట్లో మొదలు అయ్యింది. న్యూస్ రీడర్స్ శాంతి స్వరూప్, రోజారాణి, కనక దుర్గ, రేవతి వంటి వారు మా ఇంటి సభ్యుల్ల అయిపోయారు. ఈ మధ్య ఏదో పుస్తకం లో రోజారాణి గారు స్వర్గస్తులయ్యారు అని చదివి చాల బాధ కలిగింది.

ప్రతి గురువారం ప్రాంతీయ భాషా చలన చిత్రాలు వేసే వారు. ఇవికూడా డిల్లీ నుంచే వచ్చేవి. కింద ఇంగ్లీషు సబ్ టైటిల్ తో. కొన్నాళ్ళకు ప్రతి శుక్రవారం తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం "చిత్రలహరి" వచ్చేది. ఆరోజు కూడా ఇల్లు ఫుల్లే.

కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో టీవీ మాధ్యమం ద్వారా నేర్చుకోవడానికి ఏమి మిగల్లేదు కానీ, మేము మాత్రం హిందీ భాషనూ టీవీ ద్వారానే నేర్చుకున్నాము. ఇది అతిశయోక్తి కాదు. ఉర్దూ కవి సమ్మేళనాలు కూడా చూడడం వల్ల ఉర్దూ భాష లోని అందం, ఆ భాష పలుకడం లోని మెళకువలు తెలుసుకున్నాం. ప్రతి నెలా మొదటి తారీకున  భారత్, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, (సార్క్) దేశాల నుంచి కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. వాటి నుంచి ఆ యా దేశాల సంస్కృతీ, సంప్రదాయాలు, ఆర్ధిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆ యా దేశాల కల్చరల్ heritage , వీటన్నిటి గురించి తెలుసుకున్నాము. మేము హిందీ ప్రోగ్రాం లు చూసి హిందీ మాట్లాడడం నేర్చుకున్నాం కాబట్టి, మా ఉచ్చారణలో దక్షిణ భారత యాస కనబడదు. subtitles తో ప్రాంతీయ భాష చిత్రాలు చూసాము కాబట్టి, ఇంగ్లీషు కూడా మేము టీవీ ద్వారానే నేర్చుకున్నాము అని చెప్పాలి. అలాగే ఆ చిత్రాలు చూడడం వలన ఆ యా రాష్ట్రాల కల్చరల్ heritage గురించి తెలుసుకున్నాము. అప్పట్లో ప్రసారం అయిన సురభి కార్యక్రమం ద్వారా ఎంతో జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నాము. అలాగే, రంగోలి, చిత్రహార్ ద్వారా  గుల్జార్, జావేద్ అఖ్తర్ వంటి ప్రముఖ రచయితల రచనా శైలి తెలుసుకున్నాము. టీవీ మాధ్యమం ద్వారా మేము మంచే నేర్చుకున్నాము కానీ, చెడిపోలేదు.

వీధిలోని పిల్లలు అందరూ టీవీ చూడడానికి ఒకచోటకు చేరేవారు అని చెప్పా కదా, ఇందులో ఎవరి పుట్టిన రోజులు అయినా, ఎవరైనా పరీక్షలు పాస్ అయినా, ఆ ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ లాంటిది జరిగేది. అసలు అప్పటి నుంచే ట్రీట్ ఇవ్వడం అనేది అలవాటు అయింది అందరికి. అంతవరకు అలాంటివి చిన్న చిన్న ఊళ్ళల్లో అలవాటు లేదు. తరువాత తరువాత అందరి ఇళ్ళల్లోను టీవీలు వచ్చేసాయి. మనుషుల మధ్య దూరం పెరిగి పోయింది. ఈ 24 గంటలు చానల్స్ వచ్చాక అన్ని సినిమా ఆధారిత కార్యక్రమాలే. చూడడానికి, నేర్చుకోవడానికి ఏమి మిగల్లేదు. ఇప్పటి ఏంకర్ల భాష మరీ ఘోరం, ఎంత తక్కువ చెప్పుకుటే అంత మంచిది.

>>>>> మీలో ఎంతమందికి, పొగ లేని పొయ్యిలు, ( స్మోక్ లెస్ చుల్హ ), పిమ్పాల్ బట్టి గ్రామం గురించి గుర్తు ఉంది,? గుర్తు ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఏదో సరదాకి.

Tuesday 13 May 2014

ఆరోజుల్లో..... 5

మా వేసవికాలం సెలవులు.....

మా వేసవి సెలవుల సందడి పరీక్షల చివరి రోజు నుంచే మొదలయ్యేది. కానీ ఆఖరి పరీక్ష వ్రాసి వచ్చిన రోజు ఏమి తోచేది కాదు. మరునాడు ఉదయాన్నే కుర్చుని సగం వ్రాసి ఉన్న నోటు పుస్తకాల నుంచి ఖాళీ కాగితాలు తీసి, వాటిని మరుసటి సంవత్సరానికి చిత్తు పుస్తకాలుగా కుట్టుకునే వాళ్ళం. పరీక్షల ముందరే మా పై క్లాసు వాళ్ళు ఎవరెవరు  ఉన్నారో చూసుకుని పరీక్షల మరునాడు వాళ్ళ దగ్గరి నుంచి టెక్స్ట్ పుస్తకాలూ తెచ్చుకుని వాటిని కొంచెం రిపేరు చేసుకుని మరుసటి సంవత్సరానికి తయారుగా ఉండేవాళ్ళం. మేము చదివిన టెక్స్ట్ పుస్తకాలు ఎవరికైనా ఇచ్చేయడం కుడా ఆరోజే. వాడేసిన నోటు పుస్తకాలు తూకానికి అమ్మేయడం. ఎవరైనా కావాలంటే ఇచ్చేయడం అన్ని ఆరోజే. లేట్ చేస్తే మళ్లీ మర్నాటి నుంచి ఆడుకునే టైం తగ్గిపోతుంది కదా....

ఇంకా మరుసటి రోజు నుంచి మా ప్రతాపం మొదలు. స్కూలు ఉన్నరోజుల్లోను, లేనప్పుడు కూడా తెల్లవారి 4,5 గంటలకే లేచేవాళ్ళం. సెలవలలో కుడా 5 కి లేచి పనులు అన్నీ ముగించుకుని , అన్నం తినేసి 7 కల్లా లైబ్రరీ కి వెళ్ళిపోయే వాళ్ళం. మళ్లీ 11కి వాళ్ళు మేము మూసేస్తున్నాము మీరు వెళ్లి రండి అనేంత వరకు అక్కడే కుర్చుని, పాత చందమామలు, ఇంకా చిన్న పిల్లల పుస్తకాలు చదవడమే. వచ్చి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం. మధ్యాహ్నం పడుకోవడం ఆ తరం లో నిషేధం. అందుకని మధ్యాహ్నం ఎండవేళ ఇంట్లో కుర్చుని ఆడుకునే ఆటలు చదరంగం. అష్టా చెమ్మా, చింతపిక్కలు, ఇవ్వన్ని. మళ్లీ 4 గంటలకల్లా లైబ్రరీ కి తయారు. మళ్లీ 7కి వాళ్ళు మా మొహం మీదే తలుపులు వేసేదాకా ఉండి కొన్ని పుస్తకాలూ ఇంటికి తెచ్చుకోవడం. ఇంటికి వచ్చి మళ్లీ అవి చదువుకోవడం. అప్పట్లో టీవీ లు లేవు కదా.....రేడియో లో వచ్చే ప్రోగ్రాములు విని రాత్రి 9కల్లా పడుకొని మళ్లీ 4 కు లేవడం. ఇదీ మా దినచర్య.

పరిక్షలు ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతున్నాయి అనగా మా అమ్మగారు చిన్న నోటు పుస్తకం లో హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, నిత్య ప్రార్ధనా శ్లోకాలు ఇటువంటివి వ్రాసి రెడీ చేసే వారు. సెలవులు మొదటి రోజు నుంచి ఆ 50 రోజుల్లోనూ అవి అన్ని నేర్చుకోవాలి అన్నమాట. ఏరోజు చదవక పోయినా బడితె పూజే. తప్పించుకునే వీలు లేదు. అలాగే, రామాయణం, భాగవతం వచనం లో చదివించే వారు. మధ్యాహ్నం ఖాలీ ఉన్నపుడు అవి చదవ వలసినదే. అందులో ఎక్కడ ప్రశ్న అడిగినా చెప్పాల్సిందే. ఇంట్లో అంత క్రమశిక్షణ ఉండేది. ముద్దు చేసే చోట ముద్దు చేయడం, చేతికి పని చెప్పాల్సిన చోట చెప్పడం. ఇది ఆ రోజుల్లో పెంపకం తీరు. రెంటికీ కొరత ఉండేది కాదు.

మా లైబ్రరీ అలవాటు ఏ ఊరు వెళ్ళినా మారేది కాదు. సెలవులలో అమ్మమ్మగారి ఊరు వెళ్ళినా, ఇంకెక్కడికి సరదాగా వెళ్ళినా లైబ్రరీ షెడ్యులు మాత్రం మారేది కాదు. సంవత్సరం అంతా బడికి వెళ్లి వచ్చిన తర్వాత రోజూ ఆడుకునే వాళ్ళం కాబట్టి సెలవులలో ఆడుకోవాలి అనే తాపత్రయం ఉండేది కాదు.

స్కూలు ఉన్న రోజుల్లో కూడా సాయంత్రం స్కూలు నుండి ఇంటికి వచ్చి, టిఫిన్ తినేసి, హాయిగా 2,3 గంటలు ఆడుకునే వాళ్ళం. ఆ తరువాత స్నానం, చదువు. తెల్లవారి లేచి సంగీత సాధన, ఇంటి పనులు మాములే. ఎంత పెద్ద క్లాసులో ఉన్నా,,వార్షిక పరీక్షలు అయినా, ఇంటి పనికి డుమ్మా కొట్టడానికి వీలు లేదు. పని నేర్చుకోక పొతే ఎలా అని కేకలేసేవారు.

మా చిన్నతనం లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంటే ఇప్పటిలా వేడి వేడి టిఫీనులు కాదు. చద్దన్నం లో ఇంత చింతకాయ పచ్చడో, మరేదైనా ఊరగాయో, వేసుకుని, పెరుగు వేసుకుని తినేయడమే. మళ్లీ మధ్యాహ్నం వంట అయ్యేవరకు పెద్దవాళ్ళని నస పెట్టకుండా మా ఆటలు మావి. సైకిల్ తొక్కడం, ఎవరి ఇంట్లో అయినా పెద్ద పెద్ద చెట్లు ఉంటె ఉయ్యాలా కట్టుకోవడం, వీధంతా మా సందడే. ఎవరి ఇంట్లో అయినా గోరింటాకు చెట్టో, దబ్బ చెట్టో ఉంటె, మా లోని కోతులు నిద్ర లేచేవి. నామకః వారి అనుమతి తీసుకోవడం, చెట్టు అంత దులిపి పారేయడం. దబ్బ ఆకులు పలుచని మజ్జిగ లో వేసి ఉప్పు, జీలకర్ర వేసుకొని తాగితే ఎండ దెబ్బ తగలదు. గోరింటాకు చెట్టు ఉన్నవాళ్ళు కోసుకోవడానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తీరా అంతా కోశాక, సగమే ఇచ్చేవారు. మిగతాది వాళ్ళే ఉన్చేసుకునే వారు. అప్పుడు చూడాలి మా ఉక్రోషం. ఆ గోరింటాకు రుబ్బదానికి కూడా వంతులే. ఎందుకంటే రుబ్బే వారికీ కుడి అరచేయి అంతా పండుతుంది కదా....

ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తే అదోరకం సందడి. ఇల్లంతా గోల గోల. మాకు అన్నం తినడం లో ఒక రాయితీ ఉండేది. మాతో పెట్టుకుంటే తొందరగా అవదని పెద్ద వాళ్ళు అందరికి అన్నం కలిపి చేతిలో ముద్దలు పెట్టేసేవారు. అలా తినడం చాలా సరదాగా ఉండేది.

మళ్లీ స్కూళ్ళు తెరవడానికి 20 రోజుల ముందు నుంచి పై క్లాసుల పుస్తకాలూ చదవ వలసినదే. స్కూళ్ళు తెరిచేసరికి సగం సిలబసు వచ్చేసి ఉండాలి. అందులో పాఠాలు అర్ధం కాలేదనుకోండి, ఆ వీధిలో ఎవడో అన్నయ్యో, అక్కో ఉంటారు కదా పెద్ద క్లాసులు చదివే వాళ్ళు, వాళ్ళ దగ్గర చెప్పిన్చుకోవలసినదే. ఆ అన్నో, అక్కో వీక్లీ రిపోర్ట్ ఇవ్వడం, మేము ఎలా చదువుతున్నామా అని. అప్పట్లో అదో పెద్ద నస అని భావించే వాళ్ళం.

మాకు వేరే సమ్మర్ కోచింగ్ క్లాసులు ఉండేవి కాదు. ఏవి నేర్చుకోవాలన్నా ఇంట్లోనే. కుట్లు, అల్లికలు, వంటలు, ముగ్గులు, డ్రాయింగ్, అన్నీ. ఆడుతూ, పాడుతూ చదువుకోవడం. కడుపు నిండా తినడం, చేతి నిండా పని చేయడం. అవే మాకు తెలిసిన సూత్రాలు.

(సశేషం)