Sunday 30 March 2014

విజయనగరం జిల్లా లోని చారిత్రక నగరం విజయనగరం పట్టణం లో పురప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కన్నుల పండువగా ఒక అద్భుతమైన నిర్మాణం రూపుదిద్దుకొంది. దాని పేరు "రామనారాయణం_శ్రీమద్రామాయణ ప్రాంగణం"

ఎక్కుపెట్టిన ధనుస్సు ఆకారంలో నిర్మింప బడిన ఈ కట్టడం పూర్తిగా రామాయణ సారాన్ని బోధిస్తుంది. విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కోరుకొండ వెళ్ళే దారిలో 9 km దూరంలో 20 ఎకరాల విస్తీర్ణం లో ఈ కట్టడం రూపు దిద్దుకొంది.  ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్న హర్త అయిన వినాయకుడి ఆలయం ఉంది. ఈ కట్టడం రెండు అంతస్తులు గా ఉంది. ఈ కట్టడం ఎక్కుపెట్టిన విల్లు ఆకారం లో ఉంది అని చెప్పా కదా,పై అంతస్తులో ధనువుకు  ఒక చివర, విష్ణు ఆలయం, మరొక చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయం ఉన్నాయి. ఈ రెంటిని కలుపుతూ ఒక కారిడార్ ఉంది అందులో మొత్తం 75 murals (కుడ్య చిత్రాలు) లో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయి. ఈ కారిడార్ మొత్తం AC . ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలు కూడా వ్రాసారు. ధనువు ఆకారం లోని తోలి సగం కారిడార్ లో 35, మలి సగం కారిడార్ లో 40 మొత్తం 75 కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చివర విష్ణు, ఆ చివర రామ ఆలయాలు నిర్మించడంలో రహస్యం-విష్ణువే రామునిగా అవతరించాడు అని. ధనువు మధ్య భాగం లోని కట్టడం లో ఒక పెద్ద వేదిక పైన 70 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చూపరులను కట్టి పడేస్తుంది. కింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్ళే దారిలో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జల యంత్రాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కింద నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన సోపాన శ్రేణి ఉంది. పైన ఆలయాల బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురులు యొక్క విగ్రహాలు ఉన్నాయి.

కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయ మానంగా ఉంటాయి. ఈ రెండు విగ్రహాల వద్ద కుడా ఫౌంటెన్ లు ఉన్నాయి. మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది. ఆయనకు సర్వదా పుష్పాంజలి సమర్పిస్తున్నట్టుగా 5,6 ఆవ్రుత్తాలలో పూలమొక్కలు ఉన్నాయి.

కింద అంతస్తులో అల్పాహార శాల, అన్న ప్రసాద శాల, గ్రంధాలయం, వేద పాథశాల, ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, గోశాల -- కూడా నిర్మాణం లో ఉన్నాయి. వీటన్నిటికి, శబరీ, సుగ్రీవ, -- ఇలా రామాయణం లో వినిపించే పాత్రల పేర్లే పెట్టారు. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణం అంతా ఔషధి వృక్షాలతో కనువిందు చేస్తుంది.

పైన ఉన్న కుడ్య చిత్రాలలోని రామాయణ పాత్రలు ఎంతోఅందంగా  సజీవంగా ఉన్నాయి. ఇవి అన్ని 3d ఎఫెక్ట్ తో ఉన్నాయి. సీతాదేవి యొక్క సన్నని మేలి ముసుగు కూడా ఎంతో అందంగా ఉంటుంది. అది చూడవలసినదే కాని వర్ణించ సాధ్యం కాదు. మనం ఇంత వరకు salarjung museum  లోనే రెబెక్కా యొక్క మేలిముసుగును చూసి ఆశ్చర్యపోయాం. ఇక్కడ ఉన్న కుడ్యచిత్రాలు రెబెక్క కు తీసిపోవు. మొత్తం ఎంతమంది శిల్పులు, చిత్రకారులు, ఇతర కార్మికులు ఎన్ని రోజులు , ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో కానీ వారి కష్టం అంతా ఈ కట్టడం లోను, ఈ చిత్రాలలోనూ ప్రతిఫలిస్తోంది.

ఇంతవరకు, దేశం లో పలుచోట్ల  బిర్లాలు నిర్మించిన ఆలయాలను చూసి ఆనందించాం, ఆశ్చర్యపోయాం. ఈ ఆలయం వాటికీ సాటి వస్తుంది. ఇక విజయనగర ప్రజలు గర్వంగా చెప్పుకోవచ్చు మాకు కూడా అటువంటి ఆలయం ఉంది అని.

విజయనగరానికి చెందిన NCS  charitable  trust స్థాపకులు,  నిర్వాహకులు అయిన శ్రీ నారాయణం నరసింహ మూర్తిగారి సంకల్పం తో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం ఇది. మార్చ్ 22, 2014 నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. గరికపాటి నరసింహ మూర్తిగారు, తిరుపావై కోకిల మంజుశ్రీ, చాగంటి కోటేశ్వర రావు గారితో సహా ఎందఱో మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అద్భుత ప్రసంగాలతో భక్తులను అలరింప చేసారు.

ధనువు ఆకారం లో ఉన్న ఈ కట్టడం రాత్రి పూట విద్యుత్ వెలుగులలో అచ్చం ధనువు లాగే కనపడుతోంది. ఈ ఆలయాన్ని, పగలు ఒకసారి చూసినా, రాత్రికూడ ఒకసారి దర్శించుకోండి. ఆ అనుభూతే వేరు.

ఇప్పటికే సంగీత సాహిత్య పరంగా ఎంతో పేరెన్నిక గన్న విజయనగరం పట్టణం ఇపుడు భక్తీ పరంగా కూడా ఎంతో ఖ్యాతిని పొందుతోంది. ఇటువంటి మహత్తర ఆలయాన్ని మా సొంతం అని చెప్పుకునే విజయనగర ప్రజలు ఎంతో అదృష్టవంతులు.

No comments:

Post a Comment