Monday 30 November 2015

మనందరికీ తెలిసిన "టైటానిక్" షిప్ సముద్రంలో మునిగిపోయేటప్పుడు అక్కడ మరో మూడు నౌకలు ఉన్నాయట...అందులో ఒక నౌక పేరు శంప్సన్....ఇది టైటానిక్ కు కేవలం 7 మైళ్ళ దూరంలో ఉందిట. ప్రమాదం జరిగునప్పుడు నౌక సిబ్బంది ప్రమాదానికి సంకేతంగా వదులుతున్న తెల్లటి మంటలను ఈ నౌకలోని సిబ్బంది గుర్తించారు...అయినప్పటికీ వారు దొంగతనంగా సముద్రంలో వేట చేస్తున్నందువలన వారు దగ్గరలోనే ఉన్నప్పటికీ సహాయం చేయటానికి జంకారు...తమ నేరం ఎక్కడ బయటపడుతుందో అని...అందుకే టైటానిక్ లొని వారు గుర్తించకుండా సరిగ్గా దానికి వ్యతిరేకదిశలో వెళ్ళిపోయారు. ...ఇక అక్కడ ఉన్న రెండవ షిప్ "కాలిఫోర్నియ"14 మైళ్ళ దూరంలో ఉందిట..ఈ నౌక సిబ్బంది కూడా ప్రమాద సంకేతమైన తెల్లని మంటలను చూసినప్పటికీ, చుట్టూ మంచుగడ్డలు ఉండడం వలన, అక్కడికి చేరలేమేమోనని సంశయించి, రేపు తెల్లారాక చూద్దాములే అని వెళ్ళి పడుకున్నాడట ఆ నౌక కేప్టెన్.....ఇక అక్కడ ఉన్న మూడో నౌక 58 మైళ్ళ దూరంలో ఉన్న "కార్పతియా"...టైటానిక్ నుంచి వెలువడుతున్న ఆక్రందనలను రేడియో లో విని, ఎదో ప్రమాదం శంకించి ఆ నౌక కేప్టెన్ వెంటనే తనకు అక్కడికి వెళ్ళే దిశను, మార్గాన్ని చూపమని దేవుడిని ప్రార్ధించి, మంచు గడ్డలు అడ్డం వస్తున్నా సరే వాటిని నేర్పుగా తప్పించుకొని, టైటానిక్ వద్దకు చేరుకుని అందులో ప్రమాదంలో ఉన్న 705 మందిని రక్షించగలిగాడు.

ఇది నిజంగా జరిగినదా లేదా కల్పనా అనే విషయం పక్కన పెడితే, ఈ నౌకల కేప్టేన్ల మాదిరిగానే మనలో కూడా మూడు రకాలైన మనుషులు ఉన్నారు. మొదటిరకం, ఎవరు అవసరంలో ఉన్నాకాని, తమ పని తాము చూసుకునే రకం...రెండవవారు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవులే, ఇప్పుడు ఎలా సహాయం చేయడం, ఇప్పుడు కుదరదు, ఇంకోసారి చూద్దాంలే, అనుకుని తమకు తామే సర్ది చెప్పుకుని, సమస్య నుంచి తప్పించుకునే రకాలు....ఇక మూడవ రకం వారు, ఎట్టి పరిస్థితులలోనైనా అడిగిన వారికి తప్పకుండా సాయం చేసేవారు. ఈ కథలో మూడవ నౌక కేప్టెన్, పని పూర్తి అయ్యాక, వెనక్కి తిరిగి తాను వచ్చిన దారిలో ఉన్న మంచు గడ్డలను చూసి, ఈ కార్యం సఫలం అయిందంటే తానొక్కడి వలన కాదని, కనిపించని భగవంతుడే నాకు చేయూత నిచ్చి, అంతమంది ప్రాణాలు కాపాడాడని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భగవంతుని మీద భారం వేసి, తాను చెయదలచుకున్న మంచి పనిని ఏమాత్రం సంశయం లేకుండా చేయడానికి ముందుకు దూకే వారికి ప్రతీక ఈ నౌక కేప్టెన్. అలాగే ఉత్తములు తాము ఇతరులకు చేసిన సహాయాన్ని తమ ప్రతిభ అని చెప్పుకోకుండా, భగవంతుడే తమను ఈ కార్యానికి ఎన్నుకున్నాడు అని వినయంతో ఉంటారు, తమ వలన కొంతమందికి అవసరాలు తీరాయి అని సంతృప్తి పడతారు....

మనమేమి చేసినా, మనస్సాక్షి గమనిస్తూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మెళకువతో, జాగరూకతతో వ్యవహరించటమే....

No comments:

Post a Comment