Saturday 28 November 2015

ఇక వినాయక చవితి సందడే వేరు...ఇల్లిల్లూ తిరిగి బోలెడు పత్రి సేకరించుకొని వచ్చేవాళ్ళం. పాలవెల్లిని అలంకరించడం ఎంతో సరదా అయిన పని. ఆరోజు 9 మంది వినాయకులను చూడాలి అనే వంకతో ఇల్లిల్లూ తిరిగేసేవాళ్ళం...అప్పుడు బయట ఇన్ని పందిళ్ళు, ఇంత రచ్చ ఉండేది కాదు. కార్తిక మాసం పెద్దవాళ్ళతో సమానంగా ఉపవాసాలు, తెల్లారే లేచి స్నానలు చేసేసేవాళ్ళం...ఆ అలవాటు మార్గశిరం లో కూడా కంటిన్యూ చేసి, గుడికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకునేవాళ్ళం. ఇక సంక్రాంతి కి భోగిపళ్ళ పేరంటాలు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు, ముగ్గులు, పట్టుపరికిణీలు, పూలజడలు....ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే...

ధనుర్మాసం మా ఇంటి దగ్గర వేంకటేశ్వరస్వామి గుళ్ళో తిరుప్పావై చదివేవారు.మాకు దానిమీద అంత శ్రధ్ధ లేకపోయినా తరువాత పెట్టే ప్రసాదం మీద భక్తి బాగా ఉండేది. ఆ రుచి ఇంట్లో చేసుకునె దద్దోజనం, చక్కెరపొంగలి కి వచ్చేది కాదు ఎందుకో...బాదం ఆకుల్లో వేడివేడిగా పెట్టి ఇచ్చేవారు....పూజార్ల ఇళ్ళల్లో పుడితే చక్కగా అన్ని తినచ్చు అనుకునేవాళ్ళం. హరిదాసులు, కొమ్మదాసరి వాళ్ళూ, గంగిరెద్దుల వాళ్ళు, పిట్టల దొరలు, బుడబుక్కల వాళ్ళు, అందరూ వచ్చేవారు...గంగిరెద్దుల వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం, హరిదాసుకు ఒక వీధి తిరగగానే గిన్నె బియ్యంతో నిండిపోయేది...ఇప్పుడు వాళ్ళెవ్వరూ ఎక్కువ రావటంలేదు. బుడబుక్కల వాడు డమరుకం వాయించుకుంటూ వచ్చేవాడు...తలమీద ఇన్ని పక్షి ఈకలు పెట్టుకొని, నల్ల అంగీ తొడుక్కుని, అతన్ని చూస్తేనే భయం వేసేది....ఇంత పొడుగ్గా ఉండేవాడు...పిట్టలదొర మాటలు వింటుంటే కడుపుబ్బ నవ్వు వచ్చేది.....మాటలు కోటలు దాటించేసేవాడు. భోగిరోజు వస్తోందంటే ఇంటి వసారాలో ఉన్న చెక్కా ముక్కాకి కాపలా కాయవలసి వచ్చేది. ఎప్పుడొచ్చేవారో మగపిల్లలు చటుక్కున ఎత్తుకుపోయేవారు. అందరిళ్ళల్లో డబ్బులు అడిగి పెద్ద పెద్ద దుంగలు కొని తెచ్చి మంటలు వేసేవారు. ఆ చిరుచలిలో నులివెచ్చని భోగిమంట వేడిలో చలి కాచుకోవటం భలే సరదాగా ఉండేది.....సెలవులు కూడా పదేసి రోజులు ఇచ్చేవారు. పండుగ వస్తోందంటే పెద్ద పెద్ద డబ్బాల నిండుగా జంతికలు, సున్నుండలు, అరిసెలు, కజ్జికాయలు అవీ చేసి ఉంచేవారు. అందరూ అవన్నీ తిని అరాయించుకోగలిగేవారు. ఇప్పుడు ఇవాళ వండితే మర్నాటికే ఎవరూ తినడంలేదు.

No comments:

Post a Comment