Thursday 24 December 2015

సర్వేత్ర సుఖిన:స్సంతు , సర్వేస్సంతు నిరామయా, సర్వేభద్రాణి పశ్యంతు, మాకశ్చిద్దు:ఖమాప్నుయాత్....అందరూ సుఖంగా, ఆరోగ్యంగా, ఉండాలి, ఎవ్వరూ దు:ఖానికి లోను కాకూడదు అని భావించే గొప్ప బారతీయ సంస్కృతి మనది. సర్వజీవుల లోనూ భగవంతుడున్నాడని, కనుక ప్రతి ప్రాణినీ ప్రేమించాలని, ఏచిన్న ప్రాణికీ కీడు తలపెట్టరాదనీ బోధించాయి మన శాస్త్రాలు. దీనుల యెడ కరుణ కలిగి ఉండాలని, మానవసేవయే మాధవ సేవ అని కూడా మన సంస్కృతి మనకు చెప్తుంది. దయ, కరుణ కలిగిన వారు పరుల దు:ఖాలలో పాలుపంచుకుంటారు. భగవంతుడు మనలను సృష్టించినప్పుడు ఎంతో నిష్కల్మషంగా ఈ భూమి మీదకు పంపాడు. కానీ,మనం ఎదుగుతున్న క్రమంలో మానవతను కోల్పోతున్నాం...హృదయాలను పాషాణాలుగా మార్చేసుకుంటున్నాం. మనకు తరతరాలనుండీ వస్తున్న ఆస్థి మన పురాణాలు, ధర్మ శాస్త్రాలు. వాటిని నిర్లక్ష్యం చేయడం వలన మన సంస్కృతి గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన ఆదర్శదైవం శ్రీరాముడు 16 కళలతో విలసిల్లిన పూర్ణపురుషుడు. కరుణారస సాగరుడు. రామసేతు నిర్మాణంలో పాలుపంచుకున్న ఉడుత వంటి చిన్నప్రాణిని సైతం దయతో అనుగ్రహించాడు. ఇక శ్రీకృష్ణుడు ఎన్ని రకాలుగా దీనజనులను ఆదరించాడో లెక్కేలేదు..కుబ్జ, కుచేలుడు, వీరందరినీ కరుణతో బ్రోచినవాడు మాధవుడు. ఇంకా బలి, శిబి చక్రవర్తి, మనకు కరుణ, దయ గురించి తమ ప్రవర్తనల ద్వారా నేర్పించారు. ఈ కాలానికి వస్తే, క్రీస్తు, గాంధీజీ, రమణమహర్షివంటివారు దీనజన సేవను చేసి చూపించి మనకు ఆదర్శమూర్తులైనారు. అసహాయులను ఆదరించడంలో గొప్ప తృప్తి ఉంది. మనకు ఎంతో అదృష్టం ఉంటేనేకాని, దీనజన సేవాభాగ్యం లభించదు..అటువంటి సేవా అవకాశాల్ని లభించేలా చేయమని ప్రార్ధించడమే మానవజన్మకు సార్ధకత నిస్తుంది.

No comments:

Post a Comment