Friday 22 April 2016

అసలు రామాయణం, భగవద్గీత వంటి పుణ్యగ్రంధాలని వయసు అయిపోయిన తర్వాత చదివే పుస్తకాల లెక్కలోకి ఎందుకు వేస్తారో అర్ధం కాదు. వయసు అయిపోయినాక, ఒళ్ళు సహకరించక, కళ్ళు కనబడక, ఆరోగ్యం సరిగా లేక, ఇహ అప్పుడు చదివేదేమిటీ, అర్ధం చేసుకునేదేమిటీ? అప్పటికే జీవితంలో చేయవలసిన తప్పులన్నీ చేసేసి, మనసా, వాచా, కర్మణా దోషాలన్ని చేసేసి ఇక సరిచేసుకోవడానికి కూడా సమయం సరిపోని ఆ వయసులో ఇక చదవడం ఎందుకూ? ఇంట్లో ఒక వ్యక్తి చేసిన తప్పులు కానీ, వేసిన తప్పటడుగులు కానీ ఆ ఇంటిలోని వారందరి మీదా, తరతరాలపాటు  ప్రభావం చూపుతాయి. బాధ్యతలు కొన్ని తీరిన తరువాత, నడివయసులోనైనా ఇలాంటి సద్గ్రంధాలు చదవడం, చదివి అర్ధం చేసుకోవడం మొదలుపెడితే, అంతవరకు తెలిసో, తెలియకో చేసిన దోషాలన్నిటినీ సరిచేసుకుని, మునుముందు జీవితాన్ని శాంతిమయం చేసుకునే అవకాశం ఉంటుంది. రామాయణం చదివి ఏమి నేర్చుకోవాలో ఈ దేశంలో పుట్టినవారెవరికీ చెప్పక్కర్లెదు. భగవద్గీతా పఠనం, మనలను మనం తెలుసుకొవడానికి తోడ్పడుతుంది. మన గుణదోషాలను తెలుసుకోవడానికి , దానివలన మనలను మనం స్వచ్చపరుచుకోవటానికి ఎంతో సహాయపడుతుంది.ఈ పని చేయతగినదా, కాదా, ఈ మాట మాట్లాడతగినదా కాదా అని మంచి చెడూ విశ్లేషించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనలను మనం సంస్కరించుకుంటే, అరిషడ్వర్గాలను పూర్తిగా జయించలేకపోయినా, (అలా పూర్తిగా జయించడానికి ఎంతో సాధన కావాలి, మానవమాత్రుల వలన దాదాపు అసాధ్యం ) కొంతవరకు నియంత్రించుకోగలిగితే, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనలను ఇష్టపడతారు. మనసు మీద, మాటమీద, ఆలోచనల మీద నియంత్రణ సాధించడానికి భగవద్గీతా పఠనం ఎంతో ముఖ్యం. దయచేసి భగవద్గీతను శోకానికి మారుపేరుగానో, చావు ఇంట్లో పాడుకొనేదిగానో తలవకండి...అది మానవులకు కృష్ణ భగవానుడు అందించిన అత్యుత్తమమైన కానుక....

No comments:

Post a Comment