Saturday 10 May 2014

మా రోజుల్లో.....
మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు మా చిన్నతనంలో మాతో ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆ కబుర్ల మధ్యలో మాటమాటకీ మా రోజుల్లో అయితేనా....అని వాళ్ళ చిన్నతనం లో సంగతులు చెప్తూ ఉండేవారు. బంగారం ఖరీదు ఆ రోజుల్లో తులం 60 రూపాయలు ఉండేదిట. ఇప్పట్ల లాకర్లు అవి లేకపోవడం చేత, ఇంట్లో నే ఏదో ఒక మూల గొయ్యి తీసి అందులో నగలన్నీ మూటకట్టి పెట్టేవారుట. మా తాతగారు వైద్యుడు. అప్పట్లో వైద్యం చేసినందుకు ఏమి ఫీసు తీసుకోకపోగా, పక్క గ్రామాల నుంచి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు వారి ఇంట్లోనే భోజన సదుపాయం చేసేవారుట. ఇక ఆదాయం అంటే పంటల మిద వచ్చేదే. అందులోనే, పాలేర్లు, చాకలి వాళ్ళు, పని మనుషులు అందరికి ధాన్యం కొలవడం. ఇప్పట్లా పని వాళ్ళకు డబ్బు రూపేణా ఇచ్చే వారు కాదుట. అందరికీ ధాన్యం కొలవడమే. కాలక్రమేణా పొలాలు అన్ని అమ్మేసుకున్నారనుకోండి. ఇక వచ్చిన రోగులు కూడా డబ్బు తీసుకోరు కదా అని ఉత్త చేతులతో రాకుండా వాళ్ళ పొలాల నుంచి ఏదో, పండో, కాయో తెచ్చేవారుట. అవి మళ్లీ అశ్రితులకే ఇచ్చేసేవారు. అలాగే మామిడి పండ్లు, సీతాఫలాలు అటువంటి పండ్లు కొనుక్కొనే పని లేదుట. తెలిసిన వారు బుట్టలతో తెచ్చి ఇవ్వటమే. మా చిన్నతనాలలో 100 లెక్కన కొనేవారు మా నాన్నగారు. ఇపుడు డజన్లు లోకి దిగిపోయాం. కొన్నాళ్ళు పొతే మన పిల్లలు 2,3 లెక్కన కొనుక్కోవాలో ఏమిటో.
మా నానమ్మగారు 82 సం. జీవించారు. అంతవరకూ వంటింటి అధికారం కోడళ్ళకు ఇవ్వకుండా తన అజమాయిషీ లోనే ఉంచుకున్నారు. నా పిల్లలకు నేనే వండి పెట్టుకుంటాను అనేవారు. మా అమ్మమ్మగారు 75 ఏళ్ల వరకు కుట్లు అల్లికలు చక్కగా చేసేవారు. ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చునేవారు కాదు. కడుపు నిండుగా తిని చేతినిండా పని చేసుకునే వారు ఆరోజుల్లో, నెయ్యి, స్వీట్స్, ఊరగాయలు, అన్నీ చక్కగా లిమిట్ లేకుండా తినేవారు. తినే వాటి మీద ఏ ఆంక్షలు ఉండేవి కావు. ఇప్పుడు నెయ్యి తినకూడదు, స్వీట్స్ మానేయాలి, ఉరగాయలు మానేయాలి అని కెలోరీలు లేక్కపెట్టుకొని తినడం వచ్చాకనే అసలు రోగాలు ఎక్కువ అయ్యాయేమో. ఇపుడు 30 ఏళ్ల వాళ్ళకి కూడా రక్తహీనత, కాల్షియమ్, విటమిన్ లోపాలు. ఈ అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాక విటమిన్ డి. కూడా తక్కువ అయిపోతోంది అందరికి. కూరలు, పండ్లు, పాలు అన్ని కల్తీ. తినేవాటిలో సారం ఉండటం లేదు. తిన్నది వంటపట్టడం లేదు. అన్నిటికి మందుల మీద ఆధారపడడమే. ఇవి కాకుండా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ ఇవి మళ్లీ కొసరు మనకి.
(సశేషం)
Like ·

No comments:

Post a Comment