Thursday 15 May 2014

ఆ రోజుల్లో.....7


ఎన్నికలు.....ఫలితాలు...


మాకు బాగా ఊహ తెలిసిన తరువాత వచ్చిన ఎన్నికలు 1984.  అప్పుడు కొత్తగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. మా పెద్దవాళ్ళు అందరు కాంగ్రెస్ కు కాకుండా తెలుగు దేశం పార్టీ గెలవడం జీర్ణించు కోలేక పోయారు. మాకు మాత్రం సంతోషం. అయితే ఈ ఎన్నికలు, ఫలితాలు వచ్చినపుడు మాకు ఇంకో విధంగా ఆనందంగా ఉండేది. అప్పుడు టీవీ లు లేవుకదా, అన్నిటికీ రేడియో నే ఆధారం. ప్రతి పావుగంటకు ఎలక్షన్ బులెటిన్ వచ్చేది. మిగిలిన ప్రోగ్రాములు అరగంట నిడివి లో ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికల స్పెషల్ బులెటిన్ మధ్యలో రెగ్యులర్ ప్రోగ్రాములు వేయడానికి అవకాసం ఉండదు. అందుకని బులెటిన్ మధ్యలో మీరా భజన్స్, తులసి దాస్ భజన్స్, లలిత గీతాలు, జానపద గీతాలు  వంటివి వేసేవారు. మా సంబరం అందుకు. అవి నేర్చుకోవడానికి మాకు అది చక్కటి అవకాశం. పెన్ను, పుస్తకం దగ్గర పెట్టుకొని ఆ పాట వస్తున్నంత సేపు చక చక వ్రాసుకునే వాళ్ళం. దాంతో పాటే ట్యూన్ కుడా నేర్చుకోవాలి. వినేవాళ్ళకు ఇది అతిశయోక్తి గా అనిపించవచ్చు కానీ, మేము ఎన్నో పాటలు, లలిత గీతాలు అలాగే నేర్చుకొన్నాము. అలాగే బులెటిన్ లో ఎవరు ఎప్పుడు ఆధిక్యం లో ఉన్నారు?, ఎన్ని స్థానాల్లో గెలుపొందారు? వంటివి ప్రతి పావుగంటకి , ప్రతి బులెటిన్ విశేషాలు టైం తో సహా నోట్ చేసుకునేవాళ్ళం.

అలాగే, భారత్ లోను, దాని మిత్ర దేశాల లోను ప్రముఖులు చనిపోయినపుడు  సంతాప దినాలు 3 రోజులు పాటించే వారు. రేడియో లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ఉండేవి కావు. అప్పుడు కూడా ఈ భజనలు, గీతాలు వేసేవారు. ఒక్కోసారి అయితే  ఈ పాటల కోసం స్కూలు మానేసే వాళ్ళం . ఆయతుల్లా ఖోమైనీ చనిపోయినపుడు 2 తులసి దాస్ భజనలు, ఒక మీరా భజన్ నేర్చుకున్నా నేను. వినాయక చవితి పందిళ్ళలో, అయ్యప్ప స్వామి భజన లలో పెట్టే భక్తీ పాటలు కూడా అలాగే నేర్చుకునే వాళ్ళం. ఒక్కోసారి అయితే, ఆ పందిళ్ళ దగ్గరికి వెళ్లి ఆ కేసెట్ వివరాలు అడిగి తెలుసుకొని, కొనుక్కోవడం, లేదా ఒకటో, రెండో తెలియని పాటలు ఉంటె, ఆ పందిళ్ళ వాళ్ళని బ్రతిమాలి ఆ కేసెట్ తెచ్చుకొని ఆ రెండు పాటలు ఒకటి రెండు గంటల్లో నేర్చుకొని వాళ్ళకు ఇచ్చేయడం. కనీ మేము ఈ రకంగా నేర్చుకుంటున్నాము అని మా ప్రత్యర్ధులకు తెలియనిచ్చే వాళ్ళం కాదు. అదో దేవరహస్యం. ఈ రకంగా మేము ఎలక్షన్ బులెటిన్ లు, సంతాప దినాలు, పండుగలలో పందిళ్ళు, అన్నీ  మా కోసం ఉపయోగించేసుకునే వాళ్ళం.

No comments:

Post a Comment