Wednesday 14 May 2014

మా రోజుల్లో.....6


మా దూరదర్శన్ క(వ్య)ధలు......


ఈరోజుల్లో డిష్ లు, 150, 200 కు మించి ఛానల్స్ చూసే పిల్లలకు మేము ఒకటే ఒక ఛానల్ అందునా ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు మాత్రమే పనిచేసే ఛానల్ చూసేవాళ్ళము అంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. 1980 లలో దూరదర్శన్ హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రం లోని మిగతా ప్రాంతాలలో కుడా ప్రసారాలు మొదలు పెట్టింది. రిలే ద్వారా డిల్లీ నుంచి మాత్రమే కొన్నాళ్ళు ప్రసారాలు వచ్చేవి, అవి కుడా కేవలం హిందీ భాషలో. కొత్త ఒక వింత కదా, అర్ధం అయినా అవకపోయినా అవే చూసేవాళ్ళం. అందులోను, టీవీ చూడడం అలవాటు అయిపోతే యింక వదలలేరు , అదొక జాడ్యం లా పట్టుకుంటుంది అనే పెద్దవాళ్ళ భయం తోటి మాకు ఒక టైం లిమిట్ ఉండేది టీవీ చూడడానికి. యింక ఆ టైం లో ఏ ప్రోగ్రాం వచ్చినా చుసేసేవాళ్ళం. అది జైకిసాన్ అయినా, కవి సమ్మేళనం అయినా, ( కవి సమ్మేళనాలు ఎక్కువగా ఉర్దూ భాషలో వచ్చేవి. అవి కుడా వదిలేవాళ్ళం కాదు.) ఆరోజుల్లో వీధికి ఒక టీవీ ఉంటె గొప్ప. వీధిలోని పిల్లలు అందరూ తొందరగా హోం వర్కులు, చదువు పూర్తి చేసుకుని 6,7 గంటల కల్లా టీవీ ఉన్న ఇంటికి చేరేవారు. యింక ఆ వచ్చే కార్యక్రమాలు అర్ధం అయినా, అవ్వకపోయినా గుడ్డిగా చుసేయటం. వారానికి రెండు సార్లు వచ్చే హిందీ గీతాల కార్యక్రమం "చిత్రహార్" కు ఇల్లు హౌస్ ఫుల్. ఆదివారం సాయంత్రం మాత్రం తెలుగు సినిమా వచ్చేది . అప్పుడూ ఇల్లు హౌస్ ఫుల్లే. ఆ వీధి లో మాది టీవీ ఉన్న రెండో ఇల్లు. ఆదివారం వచ్చే తెలుగు సినిమా కోసం వచ్చే ప్రేక్షకుల కోసం మేము ఆదివారం బయటకు వెళ్ళే ప్రోగ్రాం కుడా వాయిదా వేసుకునే వాళ్ళం.  హిందీ వార్తలు కూడా చుసేసే వాళ్ళం.

కొన్నాళ్ళ తర్వాత రోజుకు అరగంట తెలుగు ప్రసారాలు ఇచ్చేవారు. 10 నిముషాలు రైతుల కోసం, 10 నిముషాలు ఏదైనా డాక్యుమెంటరీ లాగా ఇచ్చి, ఆఖరి పది నిముషాలు ఏదో ఒక నాటిక ఇచ్చేవారు. లేదా హాస్య కార్యక్రమం ఉండేది. ఆ ఆఖరి పది నిముషాల ఎంటర్టైన్మెంట్ కోసం ముందు 20 నిముషాలు భరించేవాళ్ళం. ఆ అరగంటా చదువుకు సెలవు. అప్పట్లో కార్టూన్లు వచ్చినట్లుగానే, రైతుల కోసం ప్రోగ్రాం లో ఎప్పుడూ, పందుల పెంపకం, ఈము పక్షుల పెంపకం, సుబాబుల్ చెట్ల పెంపకం,... డాక్యుమెంటరీ లో పొగ లేని పొయ్యిల తయారీ , మహారాష్ట్ర లోని పిమ్పాల్ బట్టి అనే గ్రామం లో సౌర వ్యవస్థ ద్వారా పూర్తిగా గ్రామ విద్యుదీకరణ గురించి, ఇవే చెప్పేవాళ్ళు. చూసి, చూసి, మాకు అవి నోటికి వచ్చేసేవి. నేటి మేటి హాస్యనటుడు శ్రీ బ్రహ్మానందం గారు ఆ అరగంట తెలుగు కార్యక్రమం లోనే మా అందరికీ పరిచయం. కితకితలు అనే ప్రోగ్రాం ద్వార అయన మిమిక్రి చేసేవారు. ఇక ఈనాటి ప్రముఖ ఏంకర్లు సుమ, ఝాన్సీ, వంటి వారు తొలిసారిగా బుల్లితెరకు పరిచయం అయిన సీరియల్ కూడా అప్పుట్లో మొదలు అయ్యింది. న్యూస్ రీడర్స్ శాంతి స్వరూప్, రోజారాణి, కనక దుర్గ, రేవతి వంటి వారు మా ఇంటి సభ్యుల్ల అయిపోయారు. ఈ మధ్య ఏదో పుస్తకం లో రోజారాణి గారు స్వర్గస్తులయ్యారు అని చదివి చాల బాధ కలిగింది.

ప్రతి గురువారం ప్రాంతీయ భాషా చలన చిత్రాలు వేసే వారు. ఇవికూడా డిల్లీ నుంచే వచ్చేవి. కింద ఇంగ్లీషు సబ్ టైటిల్ తో. కొన్నాళ్ళకు ప్రతి శుక్రవారం తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం "చిత్రలహరి" వచ్చేది. ఆరోజు కూడా ఇల్లు ఫుల్లే.

కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో టీవీ మాధ్యమం ద్వారా నేర్చుకోవడానికి ఏమి మిగల్లేదు కానీ, మేము మాత్రం హిందీ భాషనూ టీవీ ద్వారానే నేర్చుకున్నాము. ఇది అతిశయోక్తి కాదు. ఉర్దూ కవి సమ్మేళనాలు కూడా చూడడం వల్ల ఉర్దూ భాష లోని అందం, ఆ భాష పలుకడం లోని మెళకువలు తెలుసుకున్నాం. ప్రతి నెలా మొదటి తారీకున  భారత్, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, (సార్క్) దేశాల నుంచి కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. వాటి నుంచి ఆ యా దేశాల సంస్కృతీ, సంప్రదాయాలు, ఆర్ధిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆ యా దేశాల కల్చరల్ heritage , వీటన్నిటి గురించి తెలుసుకున్నాము. మేము హిందీ ప్రోగ్రాం లు చూసి హిందీ మాట్లాడడం నేర్చుకున్నాం కాబట్టి, మా ఉచ్చారణలో దక్షిణ భారత యాస కనబడదు. subtitles తో ప్రాంతీయ భాష చిత్రాలు చూసాము కాబట్టి, ఇంగ్లీషు కూడా మేము టీవీ ద్వారానే నేర్చుకున్నాము అని చెప్పాలి. అలాగే ఆ చిత్రాలు చూడడం వలన ఆ యా రాష్ట్రాల కల్చరల్ heritage గురించి తెలుసుకున్నాము. అప్పట్లో ప్రసారం అయిన సురభి కార్యక్రమం ద్వారా ఎంతో జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నాము. అలాగే, రంగోలి, చిత్రహార్ ద్వారా  గుల్జార్, జావేద్ అఖ్తర్ వంటి ప్రముఖ రచయితల రచనా శైలి తెలుసుకున్నాము. టీవీ మాధ్యమం ద్వారా మేము మంచే నేర్చుకున్నాము కానీ, చెడిపోలేదు.

వీధిలోని పిల్లలు అందరూ టీవీ చూడడానికి ఒకచోటకు చేరేవారు అని చెప్పా కదా, ఇందులో ఎవరి పుట్టిన రోజులు అయినా, ఎవరైనా పరీక్షలు పాస్ అయినా, ఆ ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ లాంటిది జరిగేది. అసలు అప్పటి నుంచే ట్రీట్ ఇవ్వడం అనేది అలవాటు అయింది అందరికి. అంతవరకు అలాంటివి చిన్న చిన్న ఊళ్ళల్లో అలవాటు లేదు. తరువాత తరువాత అందరి ఇళ్ళల్లోను టీవీలు వచ్చేసాయి. మనుషుల మధ్య దూరం పెరిగి పోయింది. ఈ 24 గంటలు చానల్స్ వచ్చాక అన్ని సినిమా ఆధారిత కార్యక్రమాలే. చూడడానికి, నేర్చుకోవడానికి ఏమి మిగల్లేదు. ఇప్పటి ఏంకర్ల భాష మరీ ఘోరం, ఎంత తక్కువ చెప్పుకుటే అంత మంచిది.

>>>>> మీలో ఎంతమందికి, పొగ లేని పొయ్యిలు, ( స్మోక్ లెస్ చుల్హ ), పిమ్పాల్ బట్టి గ్రామం గురించి గుర్తు ఉంది,? గుర్తు ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఏదో సరదాకి.

No comments:

Post a Comment