Friday 28 August 2015



* శ్రావణ పూర్ణిమ (రాఖీ పూర్ణిమ)
మన పురాణాల లో ఇంద్రుదు, కృష్ణుడు ఇలా దేవతలకు కూడా రాఖీ కట్టారుట.
" యేన బద్దో బలీ రాజా దాన వేంద్రో మహా బలా
తేనత్వా మాభి బద్నామి రక్షే మా చల మా చల "
ఈ మంత్రాని పఠిస్తూ రాఖీ కడతారు.
భారతీయ సంప్రదాయంలో పెద్దలు ఏర్పర్చిన పద్ధతులు మరుగున పడి విదేశీయ సంప్రదాయ మోజులో నిరాదరణకు గురెై వాటి ప్రయోజనాలను నేటి తరం వరకు గుర్తించలేకపోతున్నారు. అటువంటి సంప్రదాయాల్లో రక్షా(రాఖీ) బంధనం ఒకటి. రక్షా బంధనంలోని ప్రయోజనాలలో ఆధునీకత చోటు చేసుకుని రాఖీ పౌర్ణమి వినోద కార్యక్రమంగా కొనసాగుతూ పిల్లలకు మాత్రమే పరిమితమవుతుంది.
* రక్షా బంధనం
పుట్టిన శిశువుకు ఏ కష్టమూ రాకుండా ఉండేందుకు హైందవులు బాల సారెనాడు దెైవాన్ని ప్రార్థిస్తూ, పురోహితుడు మంత్రోచరణ నడుమ శిశువకు కటి(మొలతాడు)రక్ష తొలిసారిగా కడతాడు. ఆ శిశువుకు ఏ దృష్టి దోషము కలుగకుండా దో(భుజానికికట్టే తాయత్తు) రక్షను తల్లి కడుతుంది. వివాహ సమయంలో వధూవరులిద్దరికి నుదిటి మీద పాల(భాషికం) రక్షలు ముతెైదువులు కడుతారు. మానవ జీవితంలో ఏ ఆపదలు సంభవించకుండా ఉంటాయన్న ప్రగాఢ విశ్వాసంతో ప్రతి ఘట్టంలో రక్షా బంధన ఆచారాన్ని మన పూర్వీకులు ఏర్పరిచారు.
*రాఖీ
శ్రావణ మాసంలో చంద్రుడు తనకున్న 15 కళల్లో విరాజిల్లుతూ నిండుగా ఉండే పూర్ణిమ రోజు ‘రాకా’ పిలువబడుతుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ రాకా(పూర్ణిమ రోజు) నాడు చెల్లెలు తన అన్న చేతికి రక్షా బంధనం కట్టి మిఠాయిలు తినిపించి భవిష్య జీవితానికి రక్షణగా నిలిచేలా ఆశీర్వాదం పొందుతుంది. ఈ రక్షా బంధన ఆచారం మహాభారత కాలం నుంచి కొనసాగుతుందని వేద శాస్త్ర కోవిదులు తెలుపుతున్నారు. మహా భారత యుద్ధ కాలంలో శ్రీకృష్ణుని చేతికి గాయమవ్వగా వెంటనే ద్రౌపది తన చీర కొంగును చించి ఆ గాయానికి రక్షగా కట్టిందని, కౌర వ సభలో ద్రౌపది వస్త్రాపహరణ ఆపద సమయంలో అన్న శ్రీ కృష్ణుడు చీరలు అందించి ద్రౌపదికి రక్షగా నిలిచాడని పురారణ కథనాలు వెల్లడిస్తున్నాయి. అలానే యమధర్మరాజు చేతికి యమునాదేవి రక్షా బంధనం కట్టడం ద్వారా సకల జీవుల పాప కర్మలను తొలగించే పుణ్య యుమునా నదిగా అవతరించిందని ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ రాఖీ పండుగను మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు.
* జంధ్యాల పూర్ణిమ
సనాతన ఆచారాలను, నియమనిష్టలను కచ్చితంగా పాటించే కుటుంబాలలో ఉపనయనం సమయం నుంచి యజ్ఞోపవీతం(జంధ్యం) ధరించడం సంప్రదాయంగా కొనసాగుతుంది. శ్రావణ పూర్ణిమ నాడు పాత జంధ్యాన్ని విసర్జించి నూతన జంధ్యాన్ని ధరించడ ం ఆనవాయితీగా నేటికి కొనసాగుతుంది. ఈ జంధ్యాన్ని ధరించే సమయంలో గాయత్రీ మంత్రం జపిస్తారు. జంధ్యాల పూర్ణిమను పురస్కరించుకొని నగరంలో వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి జంధ్యాలను మాజేటి గోపాల కృష్ణ అందిస్తూ దాని ప్రాశిస్త్యాన్ని, గాయత్రీ మంత్ర మహిమను తెలుపుతున్నారు.
* హయగ్రీవ జయంతి:
విద్యా బోధనలను అందించే జ్ఞాన గురువుగా అందరూ పూజించే హయగ్రీవుడి జయంతి శ్రావణ పూర్ణిమ నాడు అందరూ ఘనంగా జరుపుకుంటారు. హయగ్రీవుడు మానవ దేహంతో గురప్రు తలతో, నాలుగు చేతులలో శ్రీహరి ఆయుధాలు, చిహ్నాలను ధరించిన అవతారంలో దర్శనమిస్తారు. పురాణ కథలు ఎలా ఉన్నా జ్ఞాన ప్రధాత హయగ్రీవుడిని శ్రావణ పూర్ణిమ రోజున విద్యార్థులు పూజిస్తే చదువు బాగా కొనసాగుతుందని పండితులు చెప్తున్నారు.
* శ్రావణ పూర్ణిమ విశిష్టత
శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణమని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఏ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసానికి ఆ పేరు పెట్టారు వేదకోవిదులు. శ్రవణం కార్యసాధక నక్షత్రమని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణార్ధం అవతరించిన మత్స్య, కూర్మ, వరహా, నారసింహ, వామన, పరుశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి జన్మలతోపాటు కలియుగ ప్రత్యక్ష దెైవంగా కొలువబడుతున్న శ్రీవేంకటేశ్వరుని అవతారంలో కూడా శ్రవణా నక్షత్రం నాడు జన్మించారని శాస్త్ర పండితులు వెల్లడిస్తున్నారు. శ్రవణా నక్షత్రం నాడు వేంకటేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు నిర్వహించడం అనాధిగా కొనసాగుతుంది.
* నా ముఖపుస్తకంలో నున్న అక్కచల్లెల్లందరికి రక్షాభందన్ శుభాకాంక్షాలు

courtesy: Soma Sekhar

No comments:

Post a Comment