Monday 12 October 2015

విదుర నీతి 53

ఇంద్రియ విషయ సుఖములకు లోబడువారు తపస్సును చేయలేరు. పరమాత్మ సుఖమును గాంచజాలరు. దేహసుఖమును లక్ష్యమందుచుకొనని ధీరులు మాత్రమే ఏకాగ్ర చిత్తంతో దైవ సామ్రాజ్య పట్టాభిషిక్తులు కాగలుగుతారు. ఇంద్రియములను అదుపున పెట్టుకొని, మనస్సును చెదరిపోనీక, వికారములు పొందినపుడు చక్కగా శిక్షించుచు, పరీక్షించి పనులు చేయు ధీరుని లక్ష్మీదేవి అంటిపెట్టుకుని ఉంటుంది. (నిగ్రహము లేని నీవు కొడుకులు ఆడించినట్లు ఆడుచున్న కారణమున లక్ష్మి నీయందు నిలువదని విదురుని సూచన)

రాజా! పురుషునకు శరీరము రథము, మనస్సును, వశమైన ఇంద్రియములు దానికి గుర్రములు. ఏమరుపాటులేక, నేర్పుగలవాడై తనకు లొంగిన ఆ మంచి గుర్రములతో ధీరుడు రథికుని వలె సుఖముగ ప్రయాణించును.

సాధువులను ఎవరు నిందించెదరో వారు తమను తామే దూషించుకొనువారగుదురు. ఎటులనగా ఆ కాశములోనికి ఎవరైనా బూడిదను ఎగురవేసినచో అది వచ్చి వారి తలమీదనే పడును కదా!

అధమజనులకు బ్రతుకుతెరువు లేకపోవుట భయము. మధ్యములకు చావు భయము. ఉత్తములగు నరులకు అవమానములంటే కహాభయము.

త్రాగుడు, మదము మొదలగు మదములన్నింట్లో ఐశ్వర్య మదము అన్నింటికన్న మిన్న. ఐశ్వర్యముచే పొగరెక్కినవాడు మొత్తముగా పతనము చేందాక కానీ తెలివినొందడు. ఐశ్వర్యము, ధనము, అధికారము అను వానివలన కలిగిన మదము తక్కిన పాపములకెల్ల మించిన పాపమని తెలుసుకోవాలి.  పరస్త్రీ వ్యామోహం, జూదం, తాగుడు, వేట, కఠినంగా మాట్లాడటం, కఠినంగా ప్రవర్తించడం, డబ్బు కుర్వ్యయం చేయటం ఇవి సప్తవ్యసనాలుగా మన పెద్దలు పరిగణీంచారు. వ్యసనం మానవునికి చిత్తసమ్యమనం లేకపోవడం వల్లనే వస్తుంది. ఈ సప్తవ్యసనాల వల్ల నశించిపొయినవారి గురించిన కథలు చరిత్రలో ఎన్నెన్నో...

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment