Wednesday 29 July 2015

కుల మతాలకు అతీతమైన ప్రేమ, అభిమానం, మనోవేదన.....వయసు బేధం లేదు, చిన్న పిల్లల నుంచి వృధ్ధుల వరకూ...శోకమూర్తులవుతున్నారు.....ఒక వృత్తి, ఒక ఉద్యోగం, ఒక వర్గం అనే తేడాలేదు....అన్ని వర్గాల వారు కన్నీరు పెడుతున్నారు....సోషల్ మీడియాలో సంతాప సందేశాలు లెక్కకు మిక్కిలిగా పోస్ట్ అవుతున్నాయి. రామేశ్వరం జనసంద్రమైంది. అక్కడికి ఫలాన కులం వారే రావాలి, ఫలానా మతం వారే రావాలి అనే నిబంధనలు లేవు. మీరు మా మతానికి చెందిన వారు కాదు కదా, మీరెందుకు బాధపడుతున్నారు అని ఎవరూ అడగడంలేదు. మీరు మా రాష్ట్రం వారు కాదు కదా, మీరెందుకు నివాళులర్పిస్తున్నారు అని ఎవరినీ ప్రశ్నించడంలేదు. దేశ ప్రజ మొత్తం కుల , మత, రాష్ట్ర, భాషా బేధాలకు అతీతంగా ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్ధిస్తున్నారు. చెమర్చని కన్ను లేదు. స్పందించని హృదయం లేదు. మరో పక్క అదే మతానికి చెందిన ఉగ్రవాదికి శిక్ష పడటం పట్ల ఇదే ఐకమత్యంతో భారత ప్రజ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిని బట్టి ఏం అర్ధమయ్యింది? సామాన్య ప్రజకు కుల మత బేధాలు లేవు. కష్టంలోను, సంతోషంలోనూ అందరూ ఒకేలా స్పందిస్తున్నారు. ఒకరికి ఒకరం అనే భావన అందరిలోనూ ఉంది. ఆంధ్రాలో తిరుపతిని, ముంబాయి లో గణపతి ఆలయాన్ని, శబరిమలను, షిరిడి సాయిని, మెదక్ చర్చిని, కడప దర్గాని, అజ్మీర్ దర్గాను అందరూ దర్శించుకుంటున్నారు. మేమందరం మాలో మేము ఐకమత్యంగానే ఉన్నాము. మీ ఓట్ల కోసం , మీ పదవుల కోసం మమ్మల్ని విడదీయకండి. మా మధ్య ఘర్షణలు పెట్టకండి. మా హృదయాలను చీల్చకండి. రాజకీయనాయకులారా! మీ స్వార్ధం కోసం మా బ్రతుకులతో ఆడుకోకండి.

No comments:

Post a Comment