Wednesday 1 July 2015

ఓం గురుభ్యో: నమ:

మహాభారతంలో మహాత్మ్య పూర్ణ రత్నాలు మూడు ఉన్నాయి. ఉద్యోగ పర్వం లోని సనత్సుజాతీయం,భీష్మ పర్వం లోని భగవద్గీతా, అనుశాననిక పర్వంలోని విష్ణు సహస్రనామం. ఈ మూడూ పరమార్ధ విషయాలు. ఇవి మానవజాతికి అహర్నిశం జ్ఞానజ్యొతిని ప్రసాదించే ఆరని దివ్య దీపాలు.

ఈమూడింట్లో ఉన్న విశేషం: మొదటిదానికి వక్త సనత్సుజాతుడు. అతడు బ్రహ్మ మానసపుత్రుడు. జ్ఞానపు మొదటి అవతారం. శ్రోత--నిలువెల్లా అజ్ఞానమే అయి కళ్ళు మూసుకొని పోయిన ధృతరాష్ట్రుడు. జ్ఞానానికి రాగద్వేషాలు లేవు. శ్రోత నిమిత్తమాత్రుడే.

ఇక రెండవది భగవద్గీత..శ్రీకృష్ణపరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తం చేసుకొని ఉపనిషత్తులన్నింటి సారాన్ని లోకానికి ఆ పేరుగా అందించాడు. ఇచట శ్రోత అర్జునుడు. అతనిది ధర్మపక్షమే. జ్ఞాన గంగను ఇముడ్చుకోవడానికి యోగ్య స్థానమే కానీ, ఉపదేశ సందర్భము కొంచెము క్లిష్టమైనది.

ఇక మూడవది విష్ణు సహస్ర నామము. ఇక్కడ వక్త శాంతనవుడు. శ్రోత ధర్మరాజు. "పలికించెడు వాడు రామభద్రుండట" అన్నట్టుగా భగవానుడు శాంతనవుడి నోటినుంచి పలికించాడు. ఇచట వక్తా, శ్రోత ఇద్దరు మిన్నులు  ముట్టిన జ్ఞానులే. సందర్భము కూడా పరమ ప్రశాంతమైనది.

పై మూడే కాక మరో రెండుమనోజ్ఞ రత్నాలు భారతంలో ఉన్నాయి. మొదటిది పరమార్ధానికి సంబంధించినవి కాగ, రెండవది ఇహానికి సంబంధించినదిగా చెప్పాలి. మొదటిది ఉద్యోగ పర్వంలోని విదురనీతి, రెండవది శాంతి అనుశాసనిక పర్వాలలోని భీష్మకృత ధర్మ బోధ.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment