Monday 8 August 2016

విదురనీతి: 57

"మహారాజా! ఎదుటివాని పతనాన్ని కోరకుండా చరించేవ్యక్తి అర్ధించక పోయినా వానికి కళ్యాణమార్గమే చెప్పాలి. రానున్న విపత్తులు కూడా సూచించాలి. నేను కళ్యాణప్రదాలూ ధర్మయుక్తాలూ అయిన విషయాలు రెండూ చెబుతాను వినండి. దుష్టమార్గాన కపట వ్యవహారాలు సాగించడంకోసం మీరు యత్నించకండి. సన్మార్గాన సదుపాయాలలో కృషిచేసినప్పుడు అది ఫలించకపోయినా ధీమంతుడు విచారించకూడదు. ఏ ప్రయోజనంతో మనం కర్మ ప్రారంభిస్తున్నామో అది ముందుగా నిశ్చయించుకొని దాని విషయమై పూర్వాపరాలు చింతించి తొందరపడకుండా సావధాన చిత్తంతో దాని పరిణామాలను ఫలితాలను పరిశీలించి ముందుకడుగు వేయాలి.

లాభమూ, హానీ, ధనమూ, దేశకాల స్థితులూ, దండనీతీ ఎరుగని రాజు రాజపదవికి అర్హుడు కాడు. పై విషయాలన్నీ గ్రహించి ధర్మార్ధాలయందు  సావధాన చిత్తుడై చరించేవాడు రాజ్యార్హుడూ. రాజపదవి లభించింది కదా అని అనుచితంగా వ్యవహరించకూడదు. వార్ధక్యం సౌందర్యాన్ని హరించేటట్లు ఉద్దండవ్యవహారం సంపదలను నశింపచేస్తుంది. గాలపు ముల్లుకు గ్రుచ్చబడిన ఆహారాన్ని వాంచించే చేప దాని పరిణామాన్ని ఆలోచించలేదు. పురుషుడు ఈ విషయం గ్రహించి తనకు ఆరోగ్యం కలిగించే వస్తువునే గ్రహించాలి. హితకరమైనదీ జీర్ణమయ్యేదీ ఆరగించాలే కానీ పచ్చి కాయలు కోసినట్లయితే దానివల్ల రసం సిధ్ధించదు. అది వానికి ప్రయోజనకారి కాకపోగా దాని బీజం కూడా నశిస్తుంది. పక్వఫలాలు స్వీకరించడం వల్ల ఫలరసాలతో పాటు బీజం కూడా నిలబడుతుంది. తుమ్మెద పువ్వులకు ప్రమాదం కలగకుండా మకరందం గ్రోలేటట్లు  తోటమాలి చెట్టుకు ప్రమాదం రాకుండా పువ్వులు కోసేటట్లు ప్రభువు ప్రజలకు హాని  కలుగకుండా ధనం (పన్నులు)సంగ్రహించాలి.

ఒకానొక కార్యం చెయ్యబోయే ముందు దానివల్ల సిధ్ధించే ప్రయోజన అప్రయోజనాలను ముందుగానే నిర్ణయించుకోవాలి. అసాధ్యాలకోసం కృషి చేయ్యడం అనవసరం అని తెలిసి కూడా కృషిచేస్తే అది వ్యర్ధమే కదా. అనవసరంగా క్రోధం కలిగే వానిని అకారణంగా సంతోషించే వానీ ప్రజలు రాజుగా గ్రహించరు.

ఈ మాటల్ని విదురుడు చెప్పడంలో ఒక అంతరార్ధం ఉంది. పాండవులు ధర్మపరులు. వారికి న్యాం చేయమని ధృతరాష్ట్రునికి విదురుడు హితవు చెబుతున్నాడన్నమాట.

(ఇంకా ఉంది)  

No comments:

Post a Comment