Sunday 1 March 2015

సత్యం, అహింస, ధర్మం, శాంతి, దయ, ఇవన్నీ మానవునికి ఉత్తమ గతులను కల్పించగల లక్షణాలు. ఇవన్నీ మన పురాణాల లోను, శాస్త్రాల లోనే తెలుపబడి ఉన్నాయి. ఎల్లవేళలా సత్యం పలుకమనే చెప్తూ, " న బ్రూయాత్ సత్యం అప్రియం" అని చెప్పాయి ఉపనిషత్తులు. అంటే, అప్రియమైన సత్యాన్ని పలుకవద్దు. ఎప్పుడూ ప్రియము గానే భాషించవలెను అని, ఒక విషయం సత్యం అయినప్పటికీ, అది అప్రియముగా ఉంటె, మనసులను బాధ పెట్టేది అయితే దానిని పలుకవద్దు ఆని చెప్పారు. అహింస అంటే కేవలం జంతువులను హింసించకుండా ఉండటమే కాక, సాటి మనుషుల మనసులను కూడా బాధపెట్టవద్దు అని అర్ధము. ధర్మో రక్షతి రక్షిత: అని వేదం ఏనాడో చెప్పింది. మన మన స్వధర్మాన్ని పాటిస్తూ ఉంటె, మనం ధర్మాన్ని రక్షించిన వారం అవుతాము. ధర్మ ప్రకారం మానవులందరూ నడుచుకుంటే, మనం అందరం ఎంతో సురక్షితమైన జీవితాన్ని గడపగలము.ధర్మం ఏనాడూ సాటి మనుషులను హిమ్సించమని, ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పలేదు. ఏ సమాజం లో ధర్మం రక్షింప బడుతుందో, ఆ సమాజం సురక్షితంగా ఉంటుంది. అంటే ధర్మం మనలను కాపాడినట్లే కదా.. ఇదే "ధర్మో రక్షతి రక్షిత:" అంటే భావము. పురాతనకాలం నుంచి వస్తున్న మన సంస్కృతీ, సంప్రదాయాలను, ధర్మాన్ని ఈనాడు గౌరవించక పోవటం వలనే సమాజం లో ఈనాడు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి.
సర్వ ప్రాణుల యందు దయ కలిగి ఉండాలి. సాటి మనుషుల పట్ల దయ కలిగి ఉండాలి. మన కన్నా తక్కువ స్థితిలో ఉన్నవారిని చూసి జాలి పడాలి. అటువంటి వారికీ సహాయం చేసే బుద్ది కలిగి ఉండాలి.
ఇవన్ని మనసుకు శాంతి ని ప్రసాదించి, మనిషిని దైవం వైపు ప్రయాణించడానికి మార్గాన్ని చూపిస్తాయి.
సర్వేజనా సుఖినో భవంతు....

No comments:

Post a Comment