Friday 1 May 2015

జ్యేష్ట మాస ప్రాశస్త్యం:

మాసం లో మొదట వచ్చే తదియ నాడు పార్వతీదేవి ని పూజిస్తారు. తరువాతరోజు "ఉమా" నామంతో అమ్మవారిని అర్చిస్తారు.

దశపాపహరదశమి :

దశమినాడు గంగాస్నానం, గంగా స్మరణం శ్రేష్టం.మానవుడు జన్మ జన్మాంతరాలలో చేసిన పాపములు, దుష్టకర్మలు రోజున గంగా స్నానం కానీ, గంగా మాత స్మరణం కానీ చేస్తే తొలగింపబడతాయి అని శాస్త్రం చెప్తోందిమహాత్ముల సాంగత్యంలో అమోఘమైన శక్తి ఉంటుంది. వారి మాట, స్పర్శ, సంకల్పం మహతర ప్రభావం కలిగి ఉంటాయి. బాగవతం లోని గంగావతరణ ఘట్టం సత్యాన్ని వెల్లడిస్తుంది. భగీరధుడు గంగను భూలోకానికి రప్పించడానికి ఘోరమైన తపస్సు చేశాడు.

" రాజా! నేను భూలోకానికి రాను. వస్తే పాపాత్ములు నాలో స్నానం చేసి, వారి పాపాలను నాలో వదినివేస్తారు. పాపభారాన్ని నేనెలా మోయగలను?" అన్నది గంగాదేవి. అప్పుదు భగీరధుడు, " అమ్మా గంగాదేవీ! నీలో పాపులే కాదు, సాధు పుంగవులు, శాంతస్వభావులు, ధర్మపరాయణులు కూడా స్నానమాచరిస్తారు. సర్వపాపహరుదైన శ్రీహరి వారిలో కొలువై ఉంటాడు. పుణ్యాత్ర్ముల స్పర్శ వలన పాపభారమంతా దూరమౌతుంది" అన్నాడు. గంగాదేవి అతని మాటలకు త్రుప్తి చెంది, భూలోకానికి వచ్చింది. మహాత్ముల మాటలకు అంతటి మహిమ ఉంది. ఈనాడు

"నమో భవత్యై హశపాపహరాయై, గంగాయై, నారాయణ్యై,
రేవ్యై, శివాయై, దక్షాయై, అమృతాయై, విశ్వరూపిణ్యై
నందిన్యై తే నమో నమ:

అనే మంత్రం తో గంగను పూజించాలి.

నిర్జల ఏకాదశి:

ఏకాదశి చాలా విశేషమైనది. పగలంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవసించి, ద్వాదశి నాడు త్రివిక్రమ మూర్తిని పూజించి, దానాదులు చేసి, పారణ చేయాలి. ఒక్క ఏకాదశిని ఆచరించిన, 12 ఏకాదశులు ఆచరించిన పుణ్యం వస్తుంది అని శాస్త్ర వచనం.

వట సావిత్రీ వ్రతం..

వ్రతం జ్యేష్ట పూర్ణిమ నాడు ఆచరిస్తారు. జ్యేష్ట అమావాస్యకు కొంతమంది చేస్తారు. స్త్రీలు ఐదవతనాన్ని గొప్ప వరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారు. మంగళ గౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, వటసావిత్రీ వ్రతం వంటివి విశేషమైనవి. వీటిలొ వట సావిత్రీ వ్రతానికి ప్రత్యేకత ఉంది. వ్రతాన్ని వటవృక్షాన్ని పూజ చేయడం ద్వారా జరుపుకుంటారు. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలాలు. వ్రతం రోజు, సుమంగళులు వృక్షాన్ని పసుపు కుంకుమలతో, పూజించి, వృక్షాన్ని పువ్వులతో అలంకరించి, గాజులు మొదలైన అలంకరణ సామగ్రిని సమర్పించి, ధూప దీప నైవేద్యాలతో అర్చిస్తారు. తరువాత వటవృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణం చేస్తూ ముడి ప్రత్తి నుండి తీసిన దారం చుట్టుకుంటూ వెళతారు. వటవృక్షం యొక్క అఖండ ఆయుర్దాయంతో, తమ భర్తల యొక్క అయుర్దాయాన్ని బంధించటమే, పూజ యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. పూజ అయ్యాక, ప్రతి స్త్రీ 5గురు సుమంగళులను పసుపు కుంకుమ, దక్షిణ, తాంబూలం, నైవేద్యంతో గౌరవిస్తుంది. స్త్రీలు అందరూ ఈరోజు ఉపవాసం చేస్తారు. ఈరోజు అఖండ సౌభాగ్యం కొరకు యమునితో పోరాడిన పతివ్రతా శిరోమణి సావిత్రీ, ఆమె భర్త సత్యవంతుల గాధను స్మరించుకుంటారు. ఎంతో విశేష ఫలితాలను ఇచ్చే పుణ్యదినం జ్యేష్ట పౌర్ణమి.

ఈరోజున నువ్వులు, గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే, అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది.


జ్యేష్ట పౌర్ణమిని ఏరువాక పున్నమి అంటారు. ఇది కృషీవలుల పండుగ. ఈరోజున రైతులు అందరూ, తమ తమ ఎడ్లను యధాశక్తి పూజించి, ఊరేగింపుగా పొలాలకు నాగళ్ళతో కదిలి వెళతారు. అక్కడ తొలి దుక్కి దున్నుతారు. ఇది ఒకరకంగా చెప్పాలంతే వ్యవసాయ ప్రారంభ పండుగ

No comments:

Post a Comment