Friday 1 May 2015

కార్తీక మాస ప్రాశస్త్యం: ( రెండవ భాగం )

కార్తీక మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. దీపము దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు, అన్నదానము మొదలైనవి చేయాలి. దానమిచ్చుటవలన స్త్రీలకు ఐదవతనము వృధ్ధి అగుట, మంగళ ప్రదము, సఔభాగ్యకరము. తాను ఉపవసించి బీదలకు అన్నదానము చేసిన యెడల గొప్ప పుణ్యము లభించును. సూర్యాస్తమయము అయిన వెంటనే "సంధ్యా దీపము" వెలిగించుట, ముగ్గుపెట్టి ఇంటి ముందు దీపము పెట్టుట, తులసికోటలో దీపము పెట్టుటఉదయము తులసిపూజ, గౌరీపూజ చెసిన వారికి ఆర్ధిక బాధలు తొలగుతాయి.

సూర్యోదయానికి పూర్వము తలపై చన్నీటి స్నానము చేయడం వలన జీవితములో దు:ఖములు నశిస్తాయి. ప్రతి రోజు చేయ్లేక పొయినా, ప్రధాన తిథులలో (ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలు ) నైనా చేయాలి. నది, సముద్రం లభ్యం కాకపోతే, లభ్యమైన జలాలతోనే చేయాలి. కార్తీక దామోదర అనే స్మరణతో స్నానం చేయాలి. అరుణోదయ సమయంలో విష్ణ్వాలయం లో కాని, శివాలయం లో కాని గడపాలి. విష్ణు, శివాలయాల్లొ భగవత్ ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వలన వేల గోవుల్ని దానం చేసిన ఫలం లభిస్తుంది. విష్ణు, శివ ఆలయాలు లభించని పక్షం లో మరి దేవాలయంలో లేదా, రావిచెట్టు మొదట్లో కానీ, తులసీవనం లో కానీ, భగవత్ స్మరణ చేయాలి. మాసం దీపారాధనకు విశిష్తమైనది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిలో కానీ, దేవాలయం లో కానీ "ఆకాశదీపం" పెట్టే సంప్రదాయం ఉంది.

తులసి దేవతా వృక్షం. తులసీ సన్నిధిలో, దీపారాధన చేయడం విశిష్టం. తులసి దళాలతో విష్ణువును పూజించడం, తులసి సన్నిధిలో ఆరాధించడం, పారాయణ, జపం వంటి సత్కర్మలు చేయడం భగవదనుగ్రహాన్ని కలిగిస్తాయి.

ఉభయ సంధ్యలలో శివ కేశవ మందిరాలలో, తులసి సన్నిధిలో దీపాలను వెలిగించడం మహోత్క్రుష్టమైన సత్కర్మ. అన్ని దానాలు ఒకవైపు, దీపదానం ఒకవైపు అని శాస్త్ర వచనం. తెలిసి గానీ, తెలియక గానీ మాసంలో దీపం వెలిగిస్తే ఇహపర ఐశ్వర్యాలు లభిస్తాయిఆలయాలలో, తులసి వనాలలోనే కాక, అరటి దొప్పల వంటి వాటిలో దీపాన్ని పెట్టి తటాక నది ఆదులలో విడిచిపెట్టి, భగవదర్పణం చేయడం ఎంతో ఉత్తమం. ఉసిరికాయపై వత్తిని పెట్టి దీపం విలిగించడం విష్ణు ప్రీతికరం. నియమంగా నెల్లాళ్ళూ దైవ సన్నిధిలో దీపారాధన చేయడం సర్వశ్రేష్టం. ప్రతిరోజూ ఉభయ సంధ్యలలోనూ దీపాలు వెలిగించేవారికి దివ్య శుభ ఫలాలు లభిస్తాయి. ముఖ్యంగా మాసంలో పాడ్యమి, చతుర్థి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమా తిథులు అత్యంత మహిమాన్వితమైనవి.

కార్తీక మాసంలో స్వగృహంలోనూ, తులసి సన్నిధిలోనూ, దేవాలయం లోనూ దీపం వెలిగించేవారికి అఖండైశ్వర్యం లభిస్తుంది. పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివార్చన లేదా విష్ణు పూజ చేసుకొని, నక్షత్ర దర్శనం చేసుకొని భగవంతునికి నివేదించిన అహారాన్ని స్వీకరించడాన్ని "నక్త వ్రతం" అంటారు. నెలంతా "నక్తం" ని నియమంగా చేయడం సంప్రదాయం.నెలంతా కుదరక పోయినా సోమవారాలు వ్రతం ఆచరించడం శ్రేష్టం.


(ఇంకా ఉంది  )

No comments:

Post a Comment