Monday 10 February 2014

పరిక్షల కాలం...

ఇంక రెండు నెలల్లో, స్టేట్, సెంట్రల్ సిలబస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి,  వార్షిక పరీక్షలు, రకరకాల సెట్ లు రాయవలసిన సమయం వచ్చేసింది. ఇంక విద్యార్ధులు ఉన్న ప్రతి ఇంట్లోను, పిల్లలకూ టెన్షన్, అంతకు మించి పెద్దవాళ్ళకు టెన్షన్. ఇంక పదో తరగతి, ఇంటర్మీడియట్, ఎంట్రన్సు ఎగ్జామ్స్ కి వెళ్ళే పిల్లలు ఉన్న ఇంట్లో హడావిడి అంతా ఇంతా కాదు.

పరీక్షలు అనగానే సాధారణంగానే  ఎక్కువ శాతం పిల్లలకు చాలా వత్తిడి ఉంటుంది.  దీనికి తోడు, పెద్దవాళ్ళు ఒరేయ్, అసలే టెన్త్  క్లాసురా ఏం చదువుతావొ  ఏమిటో, ఎప్పుడు చూసినా, , ఫ్రెండ్స్, టీవీ తోనే సరిపోతోంది నీకు. కేబుల్ కనెక్షన్ తీయించెస్త అంటూ బెదిరిస్తూ ఉంటారు. అసలు కేబుల్ కనెక్షన్ తీయిన్చేయడం ఒక పరిష్కారం కానే కాదు నా అభిప్రాయం ప్రకారం. పిల్లలు రోజంతా చదువుకున్న తరువాత వారికీ రిలాక్స్ అవటానికి టీవీ ఒక మార్గం. ఒకవేళ కనెక్షన్ తీయించేస్తే వాళ్ళకు రిలాక్సేషన్ మీరు ఇవ్వగలరా? పిల్లలకు ఏది లేదో దాని మిద ఎక్కువ మనసు పోతుంది. పుట్టినప్పడి నుండి టీవీ కి అలవాటు పడి సడన్ గా మానేస్తే వాళ్ళ ధ్యాస దానిమిదే ఉంటుంది. ఒక వేళ వాళ్ళు టీవీ చూడకూడదు అనే ఉద్దేశ్యం మీకు ఉంటె మీరు చూడడం మానేయండి. పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. నాకోసం అమ్మ వాళ్ళు టీవీ చూడడం లేదు కదా అనే భావం పిల్లలకు వచ్చి ఇంకొంచెం శ్రద్ధగా చదువుకుంటారు.

కొంతమంది ఇళ్ళల్లో తండ్రి స్ట్రిక్ట్ గా వుంటే, నాన్న వచ్చెవరకె నీకు టైం, తరువాత ఆపేయాలి అని కొంత consideration  చూపిస్తుంటారు పిల్లల మిద. దానివల్ల వాళ్లకు తండ్రి అంటే భయం ఉండదు సరికదా , ఏదైనా విషయంలో  లూప్ హోల్స్ వెతకటం మనమే నేర్పిన వాళ్ళం అవుతాము. మనమే తండ్రిని లోకువ చేసిన వాళ్ళం అవుతాము. ఇలా అస్సలు చేయకూడదు.

మరికొంతమంది ఒరేయ్, లక్షలు పోసి నిన్ను చదివిస్తున్నాం, అప్పు చేసి మరీ చదివిస్తున్నాం అని మాటిమాటికి అంటుంటారు. మన బాధ బయటపేట్టుకోవడం తప్పు కాదు కానీ, తరచూ అలా అనడం వల్ల వాళ్లకి ఎంత చదివినా, సరిగా చదవలేదేమో, మనం పాస్ కామేమో అనే భయం పట్టుకుంటుంది. దాని వల్ల ఇంక ఒత్తిడి పెరుగుతుంది వాళ్లకి. ఖర్మ కాలి ఒకవేళ పరీక్షలు  సరిగా రాయకపోతే, అమ్మ వాళ్ళు కష్టపడి చదివించారు, ఇపుడు ఎలాగా అనే చింత మొదలౌతున్ది వాళ్ళకి. అలా కాకుండా. మా స్తోమతకి మించి నిన్ను చదివిస్తున్నాం, నువ్వు బాగుపడాలి అని, అది మనసులో పెట్టుకో అని చెపితే సరిపోతుంది.

కొంతమంది తల్లిదండ్రులు పక్కవాళ్ళతో నిరంతరం పోలుస్తూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి చూడు, అన్ని ఫస్ట్ మార్కులే,, నువ్వు ఉన్నావు ఎందుకు.... నువ్ కనక మంచి rank  తెచ్చుకోక పొతే మేము నలుగురిలో తలెత్తుకు తిరగలెము అని అస్తమాను చెప్తూ ఉంటారు. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఏ ఇద్దరు పిల్లలు ఏ అంశం లోను సమానంగా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కో తరహా. అందువల్ల ఏ ఇద్దరినీ పోల్చి ప్రయోజనం లేదు. మనం మన పిల్లలని మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం చదివిస్తున్నాం. పక్క వాళ్ళ కోసం కాదు కదా. ఇటువంటి మాటలు పిల్లల దగ్గర మాట్లాడితే వారు చాలా తొందరగా న్యూనత భావానికి గురి అవుతారు.

ఒకవేళ పరీక్షలు సరిగా రాయలేకపోతే, అమ్మ వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి మొహం ఎలా చూపించాలి అని అఘాయిత్యాలు చేసుకొనే వారు పై రెండు కొవలకి చెందిన విద్యార్ధులే. ఎంత మంచి కాలేజీ లో చదివినా, ఎంత చక్కటి corporate  స్కూల్స్ లో చదివించినా పిల్లలు వారి శక్తిని మించి చదవలేరు. అయితే అటువంటి స్కూల్స్ లో చదవటం మూలంగా చదివే skills  పెరుగుతాయి. సబ్జెక్టు మిద పట్టు పెరుగుతుంది.

ఇంకో విషయం ఏంటంటే, టెక్నాలజీ చాలా వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో, అత్యాధునికమైన gadgets  అందరి ఇళ్ళలోనూ ఉంటున్నాయి. పిల్లలు అడిగారనో, మనకు డబ్బు ఉంది కదా అనో, గారాబం కొద్దీనొ, అవి వాళ్ళకి కొని ఇచ్చి, వాళ్ళు చదవడం లేదు అని పిల్లల మిద నిండా వేయడం చాల తప్పు. చదువుకొనే పిల్లలకు అంత ఆధునిక టెక్నాలజీ అవసరం లేదు అని నా అభిప్రాయం. 

మనం సంవత్సరమంతా పిల్లలను తెల్లవారి లేపి చదివించకుండా, పరీక్షల టైం లో మాత్రమే పెందరాలే లేవండి అని చెపితే వాళ్ళు ఏమి లెవగలరు? అది ప్రతిరోజూ అలవాటు చేయాలి. నేను కాసేపాగి లేస్తాలే, నువ్వు లేచి చదువుకో అని చెప్పటం వల్ల కూడా ఏమి ప్రయోజనం లేదు. పిల్లలు ఎప్పుడు మననే అనుకరిస్తారు. మనం తొందరగా లేస్తేనే పిల్లలు మనని చూసి నేర్చుకుంటారు.

ఒరేయ్, అసలే టెన్త్ క్లాస్సు, ఎలా చదువుతవొ ఏమిటో అని మనమే వాళ్ళని భయపెట్టకూడదు. ఒకవేళ పిల్లలు భయపడితే, మీరు ఇలా చెప్పండి. ఇన్ని క్లాసులు చదివావు కదా, అలాంటిదే ఇదీని, కంగారెందుకు. ప్రశాంతం గా చదువుకో అని ధైర్యం చెప్పండి. ఏమి కంగారు పడకు, సంవత్సరం మొత్తం చదివావు కదా, అని అనునయించండి. పక్కవాళ్ళు ఏమి అనుకుంటే నీకెందుకు, నీమీద మాకు నమ్మకం ఉంది అని భరోసా ఇవ్వండి. మీరు వాళ్ళని నమ్మండి,  మీమీద పిల్లలకి నమ్మకం కుదిరేలా చూసుకోండి. పిల్లలకి ధైర్యంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు వాళ్ళ ఎదురుగా కంగారు పడకండి.

పరీక్షలకు ముందు నుంచి వాళ్ళకు మంచి పోషకాహారం ఇవ్వండి. ఈ సమయములో ఆహారం తో పాటు నిద్ర కూడా ముఖ్యమే. వాళ్ళను నిర్దిష్టమైన గంటలు నిద్రపోనివ్వండి. ఒక ప్లాన్ ప్రకారం చదవడం అలవాటు చేయండి. ఆ ప్లాన్ లో నిద్రకు, రిలాక్సేషన్ కు కూడా సమయం కేటాయించండి. ఒత్తిడి ని ఎదుర్కోడానికి మంచి మందు అందరితో సరదాగా ఉండడమే. కుటుంబ సభ్యులందరూ రోజులో కనీసం ఒకసారైనా కలిసి భోజనం చేయండి. భోజనం చేసే సమయం లో టీవీ ని ఖచ్చితం గా avoid  చేయండి. చదువు ఒక్కటే కాక, మిగతా అన్ని విషయాలలోనూ కూడా వాళ్ళు సంభాషించేలా గమనించండి.

జీవితానికి చదువు ముఖ్యమే కానీ, చదువే జీవితం కాదు. చదువు లేకపోయినా  జీవితంలో ఉన్నతి సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక ప్రాణం కన్నా చదువు ముఖ్యం కాదు. గుర్తుంచుకోండి.

No comments:

Post a Comment