Monday 17 February 2014

భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునునకు "స్థితప్రజ్ఞుని" లక్షణాలు ఇలా చెప్పాడు.

        దు:ఖములకు కృంగిపోని వాడును, సుఖములకు పొంగిపోని వాడును, ఆసక్తిని, భయక్రొధములను వీడిన వాడును అయినట్టి మనన శీలుడు స్థితప్రజ్ఞుడు అనబడును. దేనియందును మమతా ఆసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థుతుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కాని వాడును స్థితప్రజ్ఞుడు. అట్టివానికి పరమాత్మ సాక్షాత్కారము అయినందు వలన వానికి భగవంతుని సాన్నిధ్యము, మిత్రత అను  వాని నుండి కుడా ఆసక్తి తొలగిపోవును. ఇంద్రియములను వశపరచుకొన్న వాని బుద్ది స్థిరముగా ఉండును.ఒకవేళ ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహించుచున్నను, అంత:కరణమును అదుపులో ఉంచుకోనిన వాడు మన:శాంతిని పొందును. వెంటనే అతని దు:ఖములన్నియు నశించును. ఈ విధముగా ప్రసన్న చిత్తుడయిన వాని బుద్ది అన్ని విషయముల నుండి వైదొలగి, పరమాత్మ యందు నిలుచును.( ఇచ్చట విశయములనగా లౌకిక ఆసక్తులు)

ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానికి నిశ్చయమైన బుద్ది  ఉండదు. అట్టి వాని అంత: కరణ యందు ఆస్తిక భావమే ఉండదు.అట్టి వానికి, శాంతి, దాని ద్వారా వచ్చే సంతోషము, సుఖము ఎట్లు వచ్చును? కోరికలన్నిటిని త్యజించి, మమత, అహంకార రహితుడై ఉన్న పురుషుడు శాంతిని బొందును.ఇదియే బ్రహ్మిస్థితి. దీనిని అంత్యకాలమున పొందిన వాడు బ్రహ్మ లోకమును పొందును.

నిన్ననే చెప్పుకున్నట్టు, భగవద్గీతా ప్రవచనము అన్ని కాలాలకి, అన్ని వర్గాల వారికీ కూడా అన్వయించుకొవచ్చును. గీతా సారాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే జీవితం ప్రశాంతంగా గడపడానికి మార్గాలను కనుగొనవచ్చును.

No comments:

Post a Comment