Friday 11 September 2015

విదురనీతి 34
చేయాల్సినవి--చేయకూడనివి.
వట్టి వదరుబోతుల్ని, వాజమ్మల్ని, పొల్లు మాటలు, చచ్చు మాటలు మాట్లాడే వాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళని శీలం లేని వాళ్ళని, నీతిలేని వాళ్ళని, దగాకోరుల్ని, గుణహీనుల్ని, గద్దెనెక్కిస్తే, ప్రజలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు అని విదురుడు హెచ్చరించాడు. అవసరకాలంలో ఆపద సమయంలో ఆదుకోని రాజును తక్షణమే వదిలేయాలని కూడా విదురుడు చెప్పాడు. ఒక్క రాజే కాదు, అలా తక్షణం వదిలించికోవలసిన జాబితా ఒకటి ఇచ్చాడు ఆయన.
"గు" అంటే చీకటి, "రు" అంటే నిరోధించడం. అజ్ఞానాంధకారాన్ని తొలగించాల్సినవాడు, జ్ఞానాన్ని కలిగించాల్సిన వాడు గురువు. సర్వార్ధాలను చెప్పవలసిన వాడు, బోధ చేయల్సినవాడు గురువు. అలాంటివాడు నేను నా ధర్మాన్ని నిర్వర్తించలేను అంటే కుదరదు. అలాంటి వారిని వదిలించుకోవాలి.
అంతేకాక, యజ్ఞ యాగాది క్రతువులు చేయని ఋత్విక్కును, ఎప్పుడూ అప్రియాలు పలికే ఆలిని, ఊరొదిలి వెళ్ళటానికి ఇష్టపడని పశులకాపరిని, వెంటనే వదిలించుకోవలిట. అలా చేయకపోతే, వారిని వారి ధర్మాలు నిర్వర్తించడంలో అడ్డుకున్నవాళ్ళం అవుతాము. దాని ఫలితం మనమె అనుభవించాలిట. సరీయిన మనుషులను, సరి అయిన వృత్తిలో నియమించి, వారు ఆ వృత్తుల్ని సక్రమంగా నిర్వహిస్తున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దీన్నే కార్యనిర్వహణ అంటారు.
మనిషై పుట్టాక వదిలిపెట్టకూడని గుణాలు ఆరు ఉన్నాయి. అవి 1. సత్యాన్నే పలకడం, 2. దానబుధ్ధి లకిగియుండటం, 3. సోమరితనం లేకుండా ఉండటం, 4. అసూయ లేకుండా ఉండటం 5. ఓర్పు, 6. ధైర్యం కలిగి యుండడం. ఇవి విడువరానివి, మరువరానివి.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment