Friday 11 September 2015

విదురనీతి 6.
పాండవుల పరాక్రమమ, దుర్యోధనునికి నిద్రపట్టనివ్వడంలేదు. వారు కనుక అలాగే విజృంభిస్తే తాను నామరూపాలు లేకుండాపోతామన్నది కౌరవ యువరాజు దుర్యొధనుని భయం. దీనికి వత్తాసుగా గాంధారీదేవి సోదరుడు శకుని, రాజభవనంలో తిష్టవేసి, మేనల్లుళ్ళను ఓమూల భయపెడుతూ, మరొకవంక దుష్ట ప్రయత్నాలు, ఆలోచనలతో వారిలో ధైర్యం పేరున భయాన్ని పెంచుతున్నాడు. శకునికో మంత్రి ఉన్నాడు. అతను దుర్యోధనునికి నీతి, ధర్మాలను చెబుతున్నాడు. ఈ నీతిని "కణికనీతి" అని కూడా అంటారు.
"రాజకుమారా! రాజన్నవాడు సర్వవర్గాలవారినీ బలీయమైన "దండన" భయంతోనే తన చెప్పుచేతలలో ఉంచుకోవాలి. సన్మార్గవంతులను చెయ్యాలి. తాను ఆ విధంగానే ప్రవర్తించాలి. అప్పుడే ప్రజలు ఇటు ధర్మానికి అటు వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు.
అధర్మమార్గాన, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారిని వారెంతటివారైనా, పూజ్యుడైనా సరే శిక్షించాల్సిందే! అప్పుడే ధర్మం నిలుస్తుంది. రాజు పూజనీయుడౌతాడు. ప్రజలు అతనిని అనుసరించి, ధర్మ కర్తవ్య రక్షణాదీక్షలో నియమానుసారం ప్రవర్తిస్తారు. రాజన్నవాడు బుధ్ధిమంతులు, ధీశాలుర శక్తియుక్తులను సదా స్వీకరించాలి. సత్కర్మాచరణంలో ముందు భాగాన ఉండాలి. మన సుఖమే కాదు, ఇతరుల సాధకబాధకాలను జాగ్రత్తగా ఆలోచించి చేసే ఏ పనైనా శుభప్రదం కాగలదు.
ఇటు దండన విషయంలో కాని, అటు దుర్మార్గం విషయంలో కాని ప్రభువు సదా అప్రమత్తంగా ఉండాఅలి. ఆత్మసంరక్షణామూర్తిగా ఉండాలి. ఎంతటి సర్వసమర్థులైనా అహంకరించి, హుంకరిస్తే అది వారి పతనానికి మార్గదర్శకమవుతుందే తప్ప, ప్రజా సంక్షేమానికి దోహదం చేయదు. పాలకులు తమలో లోపాలు ఉంటే, అవి బయటపడకుండా వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇతరులలోని దోషాలను నిశితంగా పరిశీలించాలి. బలవంతూలైన శతృవులతో సత్సంబాంధాలను కలిగి ఉండాలి. బలహీనులు తిరుగుబాటు చేయకుండా అదిమి పెట్టాలి. దేశరక్షణ, ఆత్మరక్షణ విషయంతో అతిజాగ్రత్తగాఉంటూ వేగులా ద్వారా మంచి చెడులు రెంటిని సేకరించాలి. శతృనివాసామార్గాలు, వాళ్ళ స్థానాలు చెబుతాను యువరాజా! " విహార పర్వతాలు, వినోదస్థలాలు, ఉద్యానవనాలు, పుణ్యతీర్థాలు, దేవతా మందిరాలు తప్పక శతృనిలయాలుగా మారుతాయి. అక్కడ జనసంచారం ఎక్కువగా ఉండడమే కారణం. వారిని గమనించే అవకాశం చాలా తక్కువ. కాబట్టి అటువంటి ప్రాంతాలలో ఉన్నప్పుడు ప్రభువు బహుజాగ్రత్తగా ఉండాఅలి. 2. తన మనసులోని మాట, తనబాట, ఎటువంటి పరిస్థితులలోను బయటపెట్టకూడదు. మరో ముఖ్యవిషయం. వంగి వంగి దండాలు పెట్టేవారిని, "అమ్మతోడు" అని ఒట్టుపెట్టేవారిని, మంచిగా ఉంటూ నయవంచన చేసేవారిని, ముందు తియ్యటి కబుర్లు, వెనుక లేవలేని గోతులు తీసేవారిని, కపట వినయవిధేయతలు ప్రదర్శించేవరి విషయలో జాగ్రత్త ఎంతో అవసరం. రాజనీతికొస్తే, శతృవులను క్షమించరాదు. వారు అల్పులా, బలవంతులా అన్నది వాదంకాదు. కుయుక్తులతో ప్రవర్తించి, దెబ్బతియ్యలనుకునే వారిని అంత నమ్మకంగాను శిక్షించాలి. జాగ్రత్త మంచిదే కానీ అతిజాగ్రత్త పనికిరాదు. అలక్ష్యం, నిర్లక్ష్యం అసలే పనికిరాదు. పై విషయాలను జాగ్రత్తగా అమలుపరచినప్పుడే నీతి మెచ్చదగినదవుతుంది. " అని చెప్పాడు కణీకుడు. కణికుని రాజనీతి, దుర్యోధనునికి కుటిలనీతికి రాజమార్గంగా తోచింది. తన వంకర బుధ్ధితో, శంకలకు తావులేని విధంగ, తనదాయాదులైన పాండవులపై శతృత్వం పెంచుకోవాలని, ఆ దీక్ష విజయానికి తండ్రిని సంప్రదిస్తాడు. నీతి ఇక్కడ అవినీతికి మార్గదర్శకమైంది. అందుకే ఎవరికైనా ఎమైనా చెప్పేముందు అతడు దానికి పాత్రుడా కాదా అన్నది అలోచించుకోవాలి.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment