Friday 11 September 2015

విదురనీతి 36
శీల సంపద:
ఆధ్యాత్మిక జ్ఞానానికి శీలం ముఖ్యమని కేనోపనిషత్తు చెబుతుంది. పుస్తకజ్ఞానం వల్లనో, పాండిత్యం వల్లనో ఆధ్యాత్మిక జ్ఞానసంపదలభించదు. మానవుడు శీలవంతుడు అనిపించుకోవాలంటే మంచి చెడు, ధర్మ-అధర్మ విచక్షణ కలిగి నడచుకోవాలి. విచక్షణ కలిగిన హృదయంలోనే ఆధ్యత్మికతకు చోటు వుంటుంది. ఎవరిలో కల్లాకపటంలేదో, ఎవరికి వక్రబుధ్ధిలేదో వారికే ఆధ్యాత్మికత సాధ్యమట.
బ్రహ్మసాక్షాత్కారమంటే పరిపూర్ణమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందడం. ఇంద్రియాలను తృప్తిపరిచే అల్పవిషయాలు తాత్కాలిక, అశాశ్వతమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. స్వార్ధబుధ్ధిని విడనాడినపుడే అమనసు నిర్మలమవుతుంది. మానవునికి ధార్మిక చింతన అవసరం. వాక్కు గోవు కంటే పవిత్రమైనది. మంచి వాక్కు వలన శీలము, సంపదలు కలుగుతాయి. దానము వలన భోగము కలుగుతుంది. వృధ్ధులకు సేవ చేయుటవలన బుధ్ధిమంతులవుతారు. అహింస వలన దీర్ఘాయువు సిధ్ధిస్తుంది.
పద్మాలు సూర్యుని చేత ప్రకాశమైనట్టు, మనిషి ఉత్తమగుణాల చేత ప్రకాశవంతుడై కీర్తికాయుడవుతాడు. శాస్త్రీయ కర్మలను, లౌకిక కర్మలను నీవు భుజిచు వానిని, నీవాచరించే తపఒ, దాన హోమకర్మలను నాకర్పించు. ఇలా చేస్తే కర్మబంధనాల నుండి విడివడి జీవన్ముక్తిని పొందుతావు. ఇది శ్రీకృష్ణుని ఉవాచ.
దానధర్మములతో పాటు త్యాగము కూడా అవసరం. శిభి చక్రవర్తి, బలి తమకు ప్రాణం పోతుందని తెలిసి కూడ సత్యానికి, ధర్మానికి కట్టుబడి త్యాగశీలురైనారు. మనం ఇతరులకు ఏది ఇస్తే, అదే తిరిగి భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఈ ధార్మిక సూత్రాన్ని మనం ఎప్పుడూ మరచిపోకూడదు. అందుకే మనం పరులకు ఏమి ఇచ్చినా మంచివి, ఉపయోగపడేవే ఇవ్వాలి. మనకు అక్కరలేనివి ఇతరులకు ఇస్తే అది దానం కింద లెక్కలోకి రాదు. అది ధర్మం కూడా కాదు.
ధర్మంగా సంపాదించిన ధనం పాత్రులైనవారికే దానం చేయాలి కాని, అపాత్రులకు చేయకూడదు. పాతుర్లకు ఇవ్వకపోయినా, అపాత్రులకిచ్చినా కీడు లభిస్తుంది.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment